నేటి స్వార్థ రాజకీయాల్లో నిస్వార్థంగా నేనున్నానని చెప్పుకోదగిన ఉదాత్త రాజకీయవేత్త సురవరం సుధాకర్ రెడ్డి. ఆజన్మాంతం సామాన్యుడిగానే ఉంటూ, అసామాన్య రాజకీయ ప్రతిభను ప్రదర్శించిన వ్యక్తి ఆయన. దేశం గర్వించదగ్గ సురవరం మన తెలుగువాడు, తెలంగాణవాడు కావడం మనకు గర్వకారణం.
కమ్యూనిస్టు రాజకీయాల్లో ఉంటూనే సురవరం సుధాకర్ రెడ్డి, దేశ రాజకీయాల్లో ప్రభావశీలమైన ముద్రవేశారు. అయితే, కమ్యూనిస్టులు ఏకం కావాలన్న ఆయన కోరిక మాత్రం తీరకుండానే పోయారు. ఎప్పుడూ ప్రజా సమస్యలతోనే ఆయన జీవితం ముడిపడి ఉండేది. తెలంగాణ కమ్యూనిస్టు దిగ్గజాలలో గతేడాది సీతారాం ఏచూరిని కోల్పోయాం. ఏడాదిలోపే ఇప్పుడు సురవరంను కోల్పోయాం. జాతీయ రాజకీయాల్లో తెలుగువారు కనుమరుగు అవుతున్నారు. గట్టిగా నిలబడే నేతలు లేకుండా పోతున్నారు. ఈ క్రమంలోనే సురవం, వృధ్ధాప్య అనారోగ్య కారణాలతో మనలను వీడిపోయారు.
ఆయన రాజకీయాల్లో అజాతశత్రువు. అంతకు మించిన నిస్వార్థం ఆయనకు ఆభరణం. పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ ముద్దుబిడ్డ. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి సమస్యలు ఎక్కడున్నా వాటి పరిష్కారానికై పోరాడేందుకు ఎప్పుడూ ముందుండే వారు. సమస్యలపై ఎంత గట్టిగా పోరాడేవారో ఆయన అంతకుమంచి సౌమ్యుడు. ఆయన సౌమ్యత్వానికి, పోరాటానికి పొంతన ఉండేది కాదు. కానీ జన్మతః వచ్చిన మృదు స్వభావం కారణంగా ఆయన అజాత శతృవు అయ్యారేమో అనిపిస్తుంది. ఆయన మాట్లాడినంత సేపు ఇంకా వినాలనిపిస్తుంది. సాదాసీదాగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో చెలామణి కావడం చాలా కష్టం. కానీ అది సాధ్యమని రుజువు చేసిన దిగ్గజనేత సురవం. తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి తమ్ముడు స్వాతంత్ర్య సమరయోధుడు వెంకటరామిరెడ్డి కుమారుడు సుధాకర్రెడ్డి. అటు తండ్రి, ఇటు పెదనాన్న వారసత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు. ఒకవైపు పెదనాన్న సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను, మరోవైపు తండ్రి స్వాతంత్య పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సుధాకర్రెడ్డి, చిన్న వయసులోనే సమస్యలపై పోరుబాట పట్టిన తీరు అమోఘం. కర్నూలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే బ్లాక్బోర్డు, చాక్పీస్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై నిరసన చేపట్టారు. అది ఉద్యమంగా మారి, నగరంలోని మిగతా విద్యాలయాలకు వ్యాపించింది. అన్ని స్కూల్స్ కి అవి సమకూరాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారు. దివంగత జైపాల్ రెడ్డితో పాటు ఆయన కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో రాటుదేలారు. ఎన్నో వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారు. రెండుసార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన సురవరం సుధాకర్ రెడ్డి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడనిపించుకున్నారు. పోరాటలు, ప్రజా ఉద్యమాల పట్ల ఉన్న నిబద్దత కారణంగా ప్రజానేతగా సురవరం గొప్ప పేరు సంపాదించుకున్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేశారు.
తెలంగాణ ఉద్యమంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. మూడు దఫాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2000లో విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం ది ముఖ్యమైన పాత్ర. చండ్రరాజేశ్వరరావు తరువాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆతర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ- 62రోజుల పాటు- చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదువుతున్న సమయంలో కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను సురవరానికి అప్పగించారు. 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యారు. దీంతో ఆయన దిల్లీకి మకాం మార్చారు. 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్నకు జాతీయ అధ్యక్షుడయ్యారు. 1971లో కేరళలోని కొచ్చిన్లో జరిగిన సీపీఐ 9వ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో జాతీయ కమిటీ- సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధప్రదేశ్కు వచ్చిన సురవరం ఆనాటి నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985, 90లో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి పోటీ- చేసి ఓడిపోయారు. 1994లో కర్నూలులోని డోన్లో అప్పటి సీఎం విజయ భాస్కర్రెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. 1998లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కినా, ఒదిగే ఉన్నారు. ఇంతటి ఉన్నత లక్షణాలు, ఉదాత్త ఆశయాలు కలిగిన సురవరం మనవాడు కావడం మన అదృష్టం అయితే, మనకు లేకుండా పోవడం మన దురదృష్టం.

