ఎద్దు ఏడ్చిన ఎవుసం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. అందరికీ అన్నం పెట్టే రైతు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు? ఆరుగాలం కష్టపడే రైతు అంతకు ఎందుకు తెగిస్తున్నాడు? ప్రక్రుతి వైపరీత్యాలకు, ఏటికి ఎదురీదే రైతు ఎందుకు అప్పుల పాలవుతున్నాడు? అసలు రైతు ఆత్మహత్యకు పురికొల్పుతున్న అంశాలేంటి? మరి ప్రభుత్వాలు గొప్పగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, పంట పెట్టుబడులు అందిస్తున్నామని, రుణమాఫీలు చేస్తున్నామని ప్రకటించుకుంటున్నాయి కదా? నీటి తీరువా రద్దు, ఉచిత విద్యుత్ సౌకర్యాలు కూడా అందిస్తున్నాయి కదా? ఇన్ని చేసినా రైతు కంట కన్నీరెందుకు? రైతు ఇంట చావులెందుకు? దళారుల ఇంట పన్నీరెందుకు?
దేశంలో మొత్తం ఆత్మహత్యల్లో 11శాతం రైతులవే. ప్రతి లక్ష మంది జనాభా కు 1.4 శాతం మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాదిలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయి. పంట నష్టం, దివాళా, వ్యవసాయ సంబంధ సమస్యలు రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని కేంద్రం విశ్లేషించింది. మనదేశం వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో దాదాపు 83 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 70 శాతం గ్రామీణ మహిళలు వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్నారు. 1991లో వచ్చిన సంస్కరణల తర్వాత మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ కైమ్ర్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 46 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి అరగంటకు ఒక రైతు చనిపోతున్నాడు.
రోజురోజుకు వ్యవసాయ పద్ధతులు మారుతున్నాయి. యాంత్రీకరణ పెరిగింది. సాంకేతికత వినియోగం కూడా జరుగుతున్నది. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు, పెట్టుబడులు పెరిగాయి. దిగుబడులు తగ్గాయి. కూలీ రేట్లు అధికమయ్యాయి. అతివ్రుష్టి, అనావ్రుష్టి, ప్రక్రుతి వైపరీత్యాలు, వాతావరణ దుష్పరిణామాలు వంటివి కూడా కర్షకుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కమతాలు చిన్నవిగా మారుతున్నాయి. సాగునీరు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పేద రైతులు అప్పులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పెళ్ళిళ్ళు, పండుగలు పబ్బాల ఖర్చులు, ఆనారోగ్యాలు, ప్రమాదాల వైద్య వ్యయాలు ఎక్కువయ్యాయి. వడ్డీరేట్లు పెరిగి, తక్కువ సమయంలోనే అప్పులు చెల్లించాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి దఫా అప్పు చెల్లించక పోవడంతో రెండోదఫా నిరాకరించడం, ప్రభుత్వాలు, బ్యాంకర్లు రైతులకు ఇవ్వాల్సిన రుణాలను ఇతర రంగాలకు మళ్లించడం వంటివి కూడా సమస్యలుగా మారుతున్నాయి. రైతులకు కొంత మొత్తంలోనే రుణాలిచ్చిన బ్యాంకులు రుణమాఫీని కూడా క్రమశిక్షణా రాహిత్యంగా చూపుతున్నాయి. జీవన వ్యయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో దాన్ని అందుకోలేని రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నాడు. రైతులకు వచ్చే అరకొర ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోలేక, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లభించక వ్యవసాయ వృత్తిలోనే కూరుకు పోవడంతో రైతు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అప్పు సామాజికంగా రైతును కుంగదీస్తుంది. తనకు వచ్చే ఆదాయంతో అప్పు తీర్చలేకపోతున్నాడు. గతంలోలా ఇంటిల్లిపాది వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. దీంతో కుటుంబ సభ్యులను సంతృప్తి పరచలేక.. పరువు పోతోందనే ఆవేదనతో నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మరి ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి? ఈ భూమ్మీద ప్రతి ఉత్పత్తిదారు తమ ఉత్పత్తులకు తామే ధరలు నిర్ణయించి విక్రయిస్తుండగా, ఒక్క రైతు మాత్రమే తమ పంటల ఉత్పత్తులకు వేరోకరు నిర్ణయించిన ధరలకు తెగనమ్ముకుంటున్నాడు. అదే అసలు సమస్య. అయితే, దీన్నే పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడం అంటున్నాం. పెట్టుబడులు పోను, లాభాలతో మిగతా అన్ని వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముడవుతున్నప్పుడు రైతులు పండించిన ధాన్యాలు ఎందుకు లాభంపై విక్రయించకూడదు? రైతు హక్కులు కూడా మానవ హక్కులే. దానిపై ఒక సమగ్ర విధాన రూపకల్పన జరగడం లేదు. వ్యవస్థాగత రుణాలు కల్పించాలి. రైతులకు సరైన శిక్షణ ఇచ్చి లాభాలు పొందేటట్టు చేయాలి. సామాజికంగా పౌరులు, మీడియా, ఇతర స్వచ్ఛంద సంస్థలు రైతు సమస్యలను తీవ్రమైన, ముఖ్యమైన అంశంగా పరిగణించి ఆత్మహత్య నివారణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
వ్యవసాయం అసంఘటిత రంగంలో ఉండటంతో పథకాలు కూడా లబ్ధిదారులకు సరిగా చేరడం లేదు. ఆశించిన ఫలితాలు రావడం లేదు. తెలంగాణలో రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాలు, ఏపీలో అన్నదాతకు ఆర్థిక సాయం అందుతోంది. అయినా రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారు. హరిత విప్లవం తర్వాత దిగుబడి పెరిగినా, ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువే. పంటల మార్కెటింగ్ మరో సమస్య. మార్కెట్లల్లో తీవ్ర అవినీతిని ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే మద్దతు ధర దక్కడం లేదు. వ్యవసాయం రంగంలోని మహిళల సంక్షేమానికి దిక్కులేదు. రుణాలు, రుణ హామీలు, రుణ బదిలీలు, రుణ మాఫీలకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వాలు, బ్యాంకులు జవాబుదారీగా వ్యవహరించాలి. వ్యవసానుబంధ రంగాలను ప్రోత్సహించాలి. కోళ్ళు, పశువులు, కూరగాయల సాగను ప్రోత్సహించాలి. వీటికి మార్కెటింగ్ ను కల్పించాలి. రైతు సమస్యల పరిష్కారం లక్ష్యంగా 2004లో ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ సూచనలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు రైతు ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. రైతులు చనిపోయాక పరిహారం ఇచ్చి అదే పరిష్కారం అనుకోవడమే తప్పని సూత్రీకరించింది.
అయితే సంక్షోభాల నివారణకు శాస్త్రీయ దృక్పథం అవసరం. అప్పుడే వ్యవసాయం పురోగమించ గలదు. ఆత్మహత్యలను నిరోధించగలం. ఉత్పత్తిని పెంచగలం. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగస్వామిని చేయగలం.

