భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా అనేక రుగ్మతలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇవి పరిష్కారం కానిదే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో అక్షరాస్యత రేటు 77% ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో లేదు. ప్రైవేట్ విద్యాసంస్థల పెరుగుదలతో విద్య వ్యాపారంగా మారింది. మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయంలో 25%–40% వరకు విద్య కోసం ఖర్చు చేస్తున్నాయి. పేదలు అప్పులు చేసి పిల్లలకు చదువు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి వైద్య రంగంలో కూడా కనిపిస్తుంది. దేశంలో మొత్తం ఆరోగ్య వ్యయంలో 55% ప్రజలు స్వంతంగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి ఏడాది లక్షలాది కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల పేదరికంలోకి జారిపోతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రతి జిల్లాలో ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానాలు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. దీని వల్ల ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆధారపడాల్సి వస్తోంది.
ఆర్థిక అసమానతలు కూడా తీవ్రమైన సమస్యగా మారింది. దేశంలో 40% పైగా సంపద కేవలం 10% మంది చేతుల్లోనే ఉంది. పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు. గృహవసతి విషయంలోనూ ఇదే పరిస్థితి. పట్టణాల్లో 20 మిలియన్ గృహాల కొరత ఉందని అంచనా. దీంతో గృహం అనేది చాలా మందికి అందని ద్రాక్షగా మారింది.
ఇక సామాజిక భద్రత మరింత ఆందోళనకరంగా ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, ప్రతి రోజూ సగటున 90కి పైగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. మహిళలపై దాడులు, అపహరణలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ వినియోగం యువతలో విస్తరిస్తోంది. ఈ పరిస్థితులు సమాజంలో నైతిక విలువలు క్షీణిస్తున్నాయనే సంకేతాన్ని ఇస్తున్నాయి.
దేశంలో కులవ్యవస్థ కూడా మరో కీలక సమస్యగా పరిణమించింది. రాజ్యాంగం సమానత్వ హామీ ఇస్తున్నప్పటికీ, కుల వివక్ష ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, సామాజిక విభజనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశం నిజమైన సమానత్వం వైపు అడుగులు వేయాలంటే కుల వివక్షను కూకటివేళ్లతో నిర్మూలించాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో మహిళా సాధికారత ఒక కీలక పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం, లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఇది 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. దేశ జనాభాలో దాదాపు 50% మహిళలే ఉన్నప్పటికీ, ప్రస్తుతం లోక్సభలో వారి ప్రాతినిధ్యం కేవలం 15% మాత్రమే ఉంది. ఈ అసమానతను సరిచేయడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుంది.
మహిళలు పాలనలో భాగస్వాములైతే, నిర్ణయాల్లో సమతుల్యత పెరుగుతుంది. ఆరోగ్యం, విద్య, మహిళల భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. గ్రామీణ స్థాయిలో జరిగిన అనుభవాలు చూపిస్తున్నట్లుగా, మహిళా నాయకత్వం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి సూచికలు మెరుగ్గా ఉంటాయి. ఇది మహిళల సామర్థ్యానికి నిదర్శనం.
అయితే, మహిళా రిజర్వేషన్ ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. సమాజంలో సమగ్ర మార్పు కోసం ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, పౌర సమాజం కలిసి పనిచేయాలి. విద్యా సంస్కరణలు, ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపు, కఠిన చట్టాల అమలు వంటి చర్యలు సమాంతరంగా సాగాలి.
సమాజంలో విలువల ఆధారిత మార్పు అవసరం. కుటుంబం, పాఠశాల స్థాయిలోనే సమానత్వం, గౌరవం, బాధ్యత వంటి విలువలను బోధించాలి. మహిళలను గౌరవించే సంస్కృతి పెంపొందించాలి.
భారతదేశం అభివృద్ధి పథంలో సాగాలంటే, సామాజిక రుగ్మతలను నిర్మూలించడం అత్యవసరం. మహిళా సాధికారత, సమానత్వం, న్యాయం ఇవే భవిష్యత్తు భారతానికి బలమైన పునాదులు. మహిళలు ముందుకు వస్తేనే సమాజం ముందుకు సాగుతుంది. అదే నిజమైన స్వాతంత్య్రానికి అర్థం.

