అమెరికా రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో ఇప్పుడు అధ్యక్ష అధికారాల పరిమితి చర్చనీయాంశమైంది. డోనాల్డ్ ట్రంప్ చేపట్టిన టారిఫ్ ల పెంపుపై ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, సుంకాలు విధించే అధికారం రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్కే చెందుతుందా? లేక అత్యవసర చట్టాల కింద అధ్యక్షుడు విస్తృత అధికారాలను వినియోగించగలడా? అనే ప్రశ్నలు అమెరికా రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. ఇప్పుడీ చర్చ అమెరికా సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
అమెరికా రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో ఇప్పుడు అధ్యక్ష అధికారాల పరిమితి చర్చనీయాంశమైంది. డోనాల్డ్ ట్రంప్ చేపట్టిన టారిఫ్ ల పెంపుపై ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, సుంకాలు విధించే అధికారం రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్కే చెందుతుందా? లేక అత్యవసర చట్టాల కింద అధ్యక్షుడు విస్తృత అధికారాలను వినియోగించగలడా? అనే ప్రశ్నలు అమెరికా రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి.
అమెరికా రాజ్యాంగ నిర్మాతలు అధికార విభజనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్కు ఇవ్వడానికి కారణం, ప్రజాప్రతినిధులే ఆర్థిక భారాన్ని నిర్ణయించాలన్న భావన. అయితే కాలక్రమేణా కొన్ని చట్టాల ద్వారా అధ్యక్షుడికి ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్థిక నియంత్రణాధికారాలు కల్పించారు. ముఖ్యంగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం వంటివి విదేశీ వాణిజ్యంపై నియంత్రణ సాధనాలుగా ఉపయోగించబడ్డాయి. కానీ వాణిజ్య నియంత్రణ అంటే సుంకాలు విధించడమా? లేక అది కాంగ్రెస్ పరిధిలోనే ఉండాలా?
ట్రంప్ తన పదవీకాలంలో “అమెరికా ఫస్ట్” అనే నినాదంతో టారిఫ్లను ప్రధాన ఆయుధంగా మలిచారు. చైనాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. చైనాపై భారీ సుంకాలు విధించడం ద్వారా అమెరికా పరిశ్రమలను రక్షిస్తున్నామని ట్రంప్ వాదించారు. అదే సమయంలో ఇండియా, యూరోపియన్ యూనియన్ వంటి భాగస్వామ్య దేశాలపైనా అదనపు సుంకాలు విధించడం ద్వారా వాణిజ్య ఒప్పందాలపై ఒత్తిడి తెచ్చారు. ఆయన అనుచరుల దృష్టిలో ఇది దూకుడు నాయకత్వం. విమర్శకుల దృష్టిలో ఇది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే కుటిలతత్వం.
ఈ వివాదం న్యాయస్థానాల దాకా వెళ్లడం అమెరికా ప్రజాస్వామ్య పటుత్వానికి నిదర్శనం. సుప్రీంకోర్టు వంటి న్యాయవ్యవస్థలు కార్యనిర్వాహక అధికారాలను పరిమితం చేసే బాధ్యతను నిర్వర్తిస్తాయి. ఒకవేళ న్యాయస్థానం అధ్యక్ష నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చితే, ఆ తీర్పును గౌరవించడం ప్రజాస్వామ్య పరిపక్వతకు సూచిక. అదే సమయంలో కోర్టు తీర్పుపై నిరసనలు వ్యక్తం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశ్నించే ధోరణి పెరిగితే, అది వ్యవస్థాపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది.
టారిఫ్ల ఆర్థిక ప్రభావం కూడా ద్వంద్వ స్వరూపం కలిగినదే. ఒకవైపు దేశీయ పరిశ్రమలకు రక్షణ లభిస్తుంది. దిగుమతులపై ఆధారపడే రంగాలు స్వదేశీ ఉత్పత్తి వైపు మళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు వినియోగదారులకు ధరల పెరుగుదల భారంగా మారుతుంది. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. పెట్టుబడిదారులు స్థిరత్వాన్ని కోరుకుంటారు. విధానాలపై స్పష్టత లేకపోతే మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తాయి.
ప్రపంచ దేశాల ప్రతిస్పందన కూడా ఆసక్తికరంగా ఉంది. కొన్ని దేశాలు అమెరికా అంతర్గత న్యాయ ప్రక్రియను గమనిస్తూ సంయమనంతో స్పందిస్తున్నాయి. మరికొన్ని దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఒప్పందాలపై దృష్టి సారిస్తున్నాయి. గ్లోబల్ వాణిజ్య వ్యవస్థ పరస్పర ఆధారితమైంది. ఒక దేశం తీసుకునే నిర్ణయం, అందునా అమెరికా లాంటి అగ్రరాజ్యం తీసుకునే నిర్ణయాలు మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి.
ట్రంప్ విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, అమెరికాలో కాంగ్రెస్, న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యనిర్వాహకశాఖను నియంత్రిస్తుంటాయి. అమెరికా చరిత్రలో అనేక సందర్భాల్లో అధ్యక్షులు విస్తృత అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించారు. ఆ సమయాల్లో ఆ వ్యవస్థలే ఆ హద్దులను గుర్తు చేశాయి. ప్రజాస్వామ్యం అంటే విభేదాలు లేని వ్యవస్థ కాదు. విభేదాలను వ్యవస్థాగతంగా పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యవస్థ.
అంతిమంగా జాతీయ ప్రయోజనాల పేరుతో అసాధారణ అధికారాలను వినియోగించడం సమంజసమా? ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా, ప్రపంచ వాణిజ్య సంబంధాలను దెబ్బతీసే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరమా? ఇప్పుడీ చర్చ అమెరికా సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.

