విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచాయి. ఎంపీ, ఉప ఎన్నికలు, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల వరుస ఫలితాలు ఆయనకు రాజకీయంగా తిరుగులేని బలాన్నిచ్చాయి. పార్టీ ఢిల్లీ అధిష్ఠానం నుంచి ప్రశంసలు అందుకోవడం కూడా ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.
ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిన నేపథ్యంలో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగిందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. కానీ స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలకు విరుద్ధంగా వచ్చాయి. ఇది ప్రతిపక్షానికి హెచ్చరిక అయితే, అధికార పక్షానికి మరింత బాధ్యతగా వ్యవహరించడానికి, ఆత్మపరిశీలనకు అవకాశం.
ఎన్నికల విజయాలు నాయకత్వ నైపుణ్యాన్ని సూచిస్తాయి. ముఖ్యమంత్రి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేయడం, పార్టీలో సీనియర్లను ఏకతాటిపై నడిపించడం వంటి వ్యూహాలు మంచి ఫలితాల్నిచ్చాయి. కాంగ్రెస్లో సహజంగా కనిపించే అంతర్గత అసమ్మతిలను అధిగమిస్తూ రేవంత్ తన స్థానాన్ని బలపరుచుకున్నారు. పదిలపరుచుకున్నారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. మంచినీరు, సాగునీటి సమస్యలు అనేక ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధరల కల్పనలో స్పష్టత అవసరం. నిరుద్యోగ సమస్య ఇంకా యువతను వేధిస్తోంది. ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా, ప్రభుత్వ యంత్రాంగంలో ఇంకా అవినీతి పెరుగుతూనే ఉన్నది. రోజుకో చోట లంచం కేసులు వెలుగులోకి రావడం ఆందోళనకరం. విద్యుత్ శాఖలో ఉద్యోగుల సస్పెన్షన్లు జరిగినా, వ్యవస్థాపక సంస్కరణలు లేకపోతే సమస్య సమూలంగా పరిష్కారం కాదు.
మంత్రులపై ‘పర్సంటేజీల’ ఆరోపణలు ఉన్నాయి. వారి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ప్రభుత్వ ప్రతిష్ఠకు దెబ్బతీస్తున్నాయి. పాలనలో సమన్వయం, జవాబుదారీతనం ఇంకా పెరగాలి. ప్రజలకు చేరువైన పారదర్శక వ్యవస్థ అవసరం. అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే స్థానిక ఎన్నికల్లో వచ్చిన విజయాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతే, అవసరాలను తీర్చకపోతే అసంతృప్తి పెరగక మానదు.
స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా స్థానిక అంశాలతోనే ప్రభావితమవుతాయి. అధికార పార్టీవైపు ప్రజలు మొగ్గడం సహజం. సార్వత్రిక ఎన్నికలు మాత్రం రాష్ట్ర స్థాయి పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రైతు సంక్షేమం వంటి విస్తృత అంశాలపై ఆధారపడతాయి. స్థానిక విజయాలు భవిష్యత్ సార్వత్రిక గెలుపునకు ఒక సానుకూలాంశమే తప్ప, అవే అసలైన విజయాలుగా ముందే భావించలేం.
2029లో జమిలి ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. అదే నిజమైతే రాజకీయ సమీకరణాలు మారవచ్చు. వచ్చే మూడేళ్ళు అధికార పార్టీకి అత్యంత కీలక కాలం. ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా పాలనలో గుణాత్మక మార్పులు తీసుకురావాలి. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వ్యవసాయ రంగానికి స్థిరమైన మద్దతు, పరిశ్రమల ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.
నిరంతరం ప్రజల మనసు గెలుచుకోవాలంటే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. విజయోత్సాహం పాలనలో అలసత్వానికి దారితీయకూడదు. స్థానిక సంస్థల ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా బలాన్నిచ్చినా, అదే సమయంలో ప్రజల అంచనాలు కూడా పెంచాయి. ఆ అంచనాలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే భవిష్యత్ ఎన్నికల్లోనూ విజయం సాధ్యమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా అసలైన బలం.

