దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 కేవలం సాంకేతిక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది దేశ భవిష్యత్తును నిర్దేశించే కీలక సందర్భం. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తున్న ఈ దశలో, అది సృష్టించే అద్భుతాలు, దాని అవకాశాల కంటే దుష్ప్రభావాలపైనే సమగ్ర చర్చ జరగడం అవసరం. అభివృద్ధి ఆశయాల మధ్య అప్రమత్తతే అసలు బలమని ఈ సమ్మిట్ గుర్తించాలి.
ఏఐని ప్రపంచ శక్తులు వ్యూహాత్మక ఆయుధంలా భావిస్తున్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు శక్తివంతమైన ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధి, భారీ కంప్యూటింగ్ సామర్థ్యాలు, ప్రత్యేక చిప్ తయారీలతో దూసుకెళ్తున్నాయి. బహుళజాతి టెక్ సంస్థలు ఏఐలో బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా గ్లోబల్ సౌత్కు సాంకేతిక కేంద్రంగా ఎదగాలని సంకల్పించడం శుభపరిణామమే. అయితే, ఆ ఆశయాలకు తగిన మౌలిక వసతులు, దీర్ఘకాల వ్యూహాలు లేకుండా మాట్లాడటం ఆకాశానికి నిచ్చెనలు వేయడమే అవుతుంది.
ఏఐ వల్ల ఉద్భవించే ప్రధాన సవాల్ ఉద్యోగ, ఉపాధి రంగంలో కనిపిస్తోంది. ఆటోమేషన్ వేగవంతమవుతున్న కొద్దీ తక్కువ, మధ్యస్థ నైపుణ్యాల పనులు మాయమవుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తయారీ, బ్యాంకింగ్, మీడియా, ఆరోగ్య, న్యాయ రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోంది. ఇది కొత్త అవకాశాలను సృష్టించినా, సంప్రదాయ ఉపాధి మార్గాలను మూసేసే ప్రమాదం ఉంది. నిరుద్యోగ సమస్య ఇప్పటికే భారంగా ఉన్న దేశంలో, ఈ మార్పులు ప్రజలు, ప్రభుత్వాలపై మరింత ఒత్తిడిని పెంచుతాయి. “ఏఐ ఉద్యోగాలు మింగేస్తుందా?” అనే కంటే, అలాంటి పరిస్థితి రాకుండా చూడటం, వస్తే ఎలా ఎదుర్కోవాలి? ప్రత్యామ్నాయాలకు ఎలా సిద్ధం కావాలి?” అన్న దానిపై స్పష్టమైన కార్యాచరణ అవసరం. భారీ స్థాయిలో రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ కార్యక్రమాలు లేకుండా ఏఐ విప్లవం ప్రగతికంటే, సామాజిక అసమానతలను పెంచే ప్రమాదమే ఎక్కువ.
డేటా గోప్యత, నైతికత కూడా అంతే కీలకం. ఏఐ వ్యవస్థలు విస్తృత స్థాయిలో వ్యక్తిగత డేటాను వినియోగిస్తాయి. డేటా కేంద్రీకరణ పెద్ద టెక్ సంస్థల చేతుల్లోకి వెళ్తే ప్రభుత్వాలకు, దేశాలకే ముప్పు తలెత్తుతుంది. డీప్ఫేక్ల రూపంలో దుష్ప్రచారం ఇప్పటికే రాజకీయ వ్యవస్థను సవాల్ చేస్తోంది. న్యాయ, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై కూడా జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పారదర్శక చట్టాలు, బలమైన డేటా రక్షణ వ్యవస్థ, నైతిక నియంత్రణలు అనివార్యం.
నీతి అయోగ్ రూపొందించిన నివేదికల ప్రకారం ఏఐ లో భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి ఇంకా దశాబ్దం నుంచి రెండు దశాబ్దాలు పట్టవచ్చని అంచనా. ఇది వాస్తవాన్ని సూచించే గణాంకం. హైపర్-స్కేల్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య కంప్యూటింగ్ వనరులు, స్వదేశీ ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధి వంటి అంశాల్లో మనం ఇంకా పురిట్లోనే ఉన్నాం. చిప్ తయారీ రంగంలో స్వావలంబన సాధించకుండా ఏఐలో పూర్తి స్వాతంత్ర్యం సాధించడం కష్టమే.
ప్రధాని నరేంద్ర మోదీ 2047 నాటికి భారత్ను ఏఐ సూపర్ పవర్గా తీర్చిదిద్దాలన్న దృక్పథాన్ని ప్రకటించారు. భారత్ కేవలం వినియోగదారుగా కాకుండా సృష్టికర్తగా ఎదగాలన్న లక్ష్యం ప్రశంసనీయం. యువశక్తి, ప్రతిభావంతుల సమృద్ధి మన దేశ బలం. కానీ ప్రతిభకు తగిన వేదిక, పరిశోధనకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు లేకుంటే లక్ష్యాలు మాటలు దాటవు.
ఇటీవలి సాంకేతిక లోపాలు, విదేశీ తయారీ ఉత్పత్తులను స్వదేశీ ఆవిష్కరణలుగా చూపించే ఘటనలు అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. గంభీరమైన సాంకేతిక రంగంలో పారదర్శకత, ప్రామాణికత, విశ్వాసం అత్యవసరం. ఆవిష్కరణలలో అతిశయోక్తి కాకుండా స్థిరమైన పురోగతి ముఖ్యం.
ఏఐ ఒక పరివర్తన శక్తి. ఇది అభివృద్ధికి దారితీస్తుంది. అదే సమయంలో అసమానతలకు, నిరుద్యోగానికి, గోప్యత, భద్రత సంక్షోభానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి భయం లేకుండా, నిర్లక్ష్యం కాకుండా అప్రమత్తతో అనుసరించాలి. ఏఐ సదస్సులు విజయగాథలనే గాక, సవాళ్ళను కూడా సమగ్రంగా చర్చించే వేదికలుగా మారాలి. ముందు జాగ్రత్తలు, బలమైన చట్టాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, స్వదేశీ సాంకేతిక పునాది, ఇవే భవిష్యత్ భారత్కు రక్షణ కవచాలు. అప్రమత్తతతో కూడిన ప్రణాళికలే ఏఐ యుగంలో దేశాన్ని సురక్షితంగా, సమృద్ధిగా ముందుకు నడిపించగలవు.

