ఎన్నికల హామీలు అధికార పోరాటానికి ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఒక పార్టీ మించి మరో పార్టీ మరింత ఆకర్షణీయమైన హామీలను ప్రకటిస్తున్నాయి. ఈ వ్యవహారాలు ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతున్నాయి. భారత రాజ్యాంగంలోనే సంక్షేమ భావన ఉంది. సామాజిక, ఆర్థిక న్యాయం సాధించడం ప్రభుత్వాల బాధ్యత. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్యం, ఆహార భద్రతలకు ప్రభుత్వమే పూచీ. అయితే సంక్షేమమే సర్వస్వంగా ఎన్నికల్లో ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించడం, తర్వాత వాటిని అమలు చేయడం ఆందోళనకరంగా మారుతోంది.
దేశం, రాష్ట్రాల్లో ఇటీవల పెరిగిన అప్పులు, జీతాల చెల్లింపుల ఆలస్యాలు, పెన్షన్ బకాయిలు వంటివి సంక్షోభాలకు సంకేతాలనిస్తున్నాయి. దాదాపు సగం బడ్జెట్ సంక్షేమ పథకాలకే పొతోంది. ఆదాయ వనరులు పెరగకపోవడం వల్ల అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అప్పులు చేసి, సంక్షేమాన్ని నడపడం తాత్కాలిక ఉపశమనం కావచ్చు కానీ, దీర్ఘకాలంలో వడ్డీ భారమే అసలును మింగే ప్రమాదం ఉంది.
రాజకీయ పరంగా అధికారంలో లేనప్పుడు ఉచితాలపై విమర్శలు చేసే పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మార్గాన్ని అనుసరించడం విస్మయకరం. ఉచిత పథకాల్ని “అభివృద్ధికి అడ్డంకి”గా పేర్కొంటున్న పార్టీలే, సంక్షేమ, ఉచిత హామీలతో ఎన్నికల గోదాల్లోకి దిగుతున్నాయి. సామాజిక, ఆర్థిక, నైతికాంశాలకంటే, అధికార వ్యామోహమే ప్రామాణికమవుతోంది.
‘ఉచితాల వల్ల ప్రజల్లో పనిచేయాలనే ఉత్సాహం తగ్గే’ ప్రమాదముందన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు పార్టీలకు, ప్రభుత్వాలకు హెచ్చరికలే. అయితే, విధాన నిర్ణయాలు ప్రభుత్వ, పార్లమెంట్ పరిధిలోకి వస్తాయంటూ నేరుగా ఆయా పథకాల నిషేధానికి వెళ్లలేదు. ఎన్నికల సంఘం కూడా మేనిఫెస్టోలపై మార్గదర్శకాలిచ్చినా, చట్టపరంగా బలమైన నియంత్రణలు లేకపోవడంతో ప్రభావం పరిమితంగానే ఉంటోంది.
సంక్షేమమంటే సామాజిక రక్షణ, అవకాశాల సమానత్వం, మానవ వనరుల అభివృద్ధి. ఉచితాలు అంటే తాత్కాలిక లబ్ధి. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, నాణ్యమైన విద్య, ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం వంటివి దీర్ఘకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. కానీ రేషన్ బియ్యం, నగదు పంపిణీలు, ఉచితాలు, సబ్సిడీలు మాత్రం ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తాయి.
నగదు బదిలీలు ఆర్థిక వ్యవస్థకు బలమిస్తాయనే వాదన కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల చేతుల్లో నగదు పెరగడం కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. నిర్ణీత పరిమాణం, లక్ష్యసాధన, ఆర్థిక స్థిరత్వం. అర్హులైన వర్గాలకు పరిమిత స్థాయిలో, స్పష్టమైన వనరులతో అమలు చేసే సంక్షేమ పథకాలు సమంజసం. కానీ ఆదాయానికి మించి ఖర్చు చేసే రాజకీయ పోటీ ప్రమాదకరం.
అప్పుల పరిమితికి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ చట్టాలు (ఎఫ్ఆర్బీఎం) ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆ పరిమితులను సడలించుకునే మార్గాలు అన్వేషిస్తున్నాయి. పారదర్శకత లోపం ప్రధాన సమస్య.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే ప్రతి హామీకి ఆదాయ ఆర్థిక మూలాలు, వ్యయ అంచనాలు వెల్లడించడం తప్పనిసరి చేయాలి. దీని వల్ల ఓటర్లు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
అసలు సమస్య రాజకీయ సంకల్పం. ఉచితాల ద్వారా తాత్కాలిక లాభం పొందడం సులభం. కానీ విద్య, పరిశ్రమలు, మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టి దీర్ఘకాల అభివృద్ధి సాధించడం కష్టసాధ్యం. అందుకే ఎన్నికల సమయంలో “ఎవరెంత ఇస్తారు?” అన్న పోటీ పెరుగుతోంది. అభివృద్ధి గాడి తప్పుతోంది.
ఈ పరిస్థితుల్లో కీలక పాత్ర ప్రజలదే. ఏలికలను ఎంచుకోవడమేగాక, ఓటు ఒక విలువైన ఆర్థిక నిర్ణయాక సాధనం కూడా. తాత్కాలిక లబ్ధి కంటే స్థిరమైన అభివృద్ధే ముఖ్యం. ప్రగతిని కోరుకునే ఓటర్లు పెరిగితేనే రాజకీయ ధోరణి కూడా మారుతుంది. ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రతి పైసా తమనుంచే వస్తుందన్న అవగాహన సమాజంలో పెరగాలి.
సంక్షేమం అవసరమే. పేదరిక నిర్మూలన ప్రభుత్వ ధర్మం. కానీ మోతాదు మించితే ఔషధమే విషమవుతుంది. ఆర్థిక క్రమశిక్షణలేమి, మితిమీరిన అప్పులు, భవిష్యత్ తరాలపై పడే అప్పుల భారం, అభివృద్ధి ప్రాధాన్యతల మధ్య సమన్వయం లోపిస్తే, ఆర్థిక సంక్షోభాలు తప్పవు. ఉచితాలపై కూడా రాజ్యంగ, చట్టపరమైన పరిమితిలు, నియంత్రణలు అవసరమే. లేకపోతే సంక్షేమం పేరుతో ప్రారంభమైన ప్రయాణం, ఆర్థిక సంక్షోభం దిశగా దారితీసే ప్రమాదం తప్పదు.

