విచారణల ఉద్దేశ్యం నిజాలను వెలికి తీయడం, తప్పు చేసినవారిని శిక్షించడం. కానీ నేటి రాజకీయ వ్యవస్థలో విచారణలు న్యాయ సాధనంగా కాకుండా, రాజకీయ ప్రయోజనాలకనుగుణంగా జరుగుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారంలో ఉన్నవారికి జవాబుదారీతనం మాత్రం కనిపించడంలేదు. సవాళ్లు–ప్రతిసవాళ్లతో అసలు సమస్యలను దారి మళ్ళిస్తూ ప్రజలను మభ్యపెట్టే రాజకీయ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తోంది.
ఏపీ లో టీడీపీ–వైసీపీ మధ్య, తెలంగాణలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం ఓ ప్రహసనంగా కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలతో వ్యక్తిగత తప్పిదాలను రాజకీయ వ్యవస్థాగతం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. అసలు ప్రశ్నలు నేరం, రుజువు, శిక్ష, న్యాయం, బాధ్యత, పారదర్శకత ఆ రాజకీయాల్లో కొట్టుకుపోతున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు ఆరోపణలున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. కేంద్ర టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఒక ఘోర నేరం. వ్యక్తిగత గోప్యతను హరించడం. రాజ్యాంగ విరుద్ధం. ఈ కేసుపై విచారణ రెండేళ్లు దాటినా, ఇప్పటికీ స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. విచారణల పేరుతో కాలం గడిచిపోతోంది.
బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష, స్వపక్ష నేతలు, సినీతారలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖుల ఫోన్ సంభాషణలు రికార్డు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అధికారాన్ని నిలుపుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఈ అక్రమ మార్గాలను ఉపయోగించారనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ బిడ్డే తనది, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, తాము కూడా బాధితులమేనని చెప్పుకోవడం ద్వారా ఈ వ్యవహారం ఎంత విస్తృతంగా జరిగిందో అర్థమవుతోంది. కవిత పదేపదే ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు.
కొనసాతున్న దర్యాప్తుతో నిజంగా న్యాయం జరుగుతుందా? లేక ఇది కూడా ఒక రాజకీయ నాటకమేనా? అన్న సందేహాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అవసరమైన ఆధారాలు ప్రభుత్వానికి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెబుతూనే, విచారణను ఎందుకు సాగదీస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల “ఇంకెంతకాలం?” అని ప్రశ్నించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
విచారణ ఎంత ఎక్కువకాలం సాగితే, అంతగా రాజకీయ లబ్ది పొందవచ్చన్న లెక్క ప్రభుత్వానికి ఉందా? అన్న సందేహం సహజమే. ఇప్పటికే హరీశ్రావు, కేటీఆర్లు … విచారణల పేరిట తమను వేధిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కేసులను ఉపయోగిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. విచారణలు ముగిసి, తుది ఫలితాలు రాకపోతే, అనుమానాలే నిజమయ్యే ప్రమాదం ఉంది.
ఇదే సమయంలో సింగరేణి భవితవ్యం అగమ్యగోచరంగా ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు విధిస్తూ సింగరేణిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు బొగ్గు గనులను కేంద్రం వేలం ద్వారా ప్రైవేట్కు అప్పగించగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఓవర్బర్డెన్ పనులకే పరిమితమైన ప్రైవేట్ పాత్రను, ఇప్పుడు నేరుగా బొగ్గు ఉత్పత్తికే విస్తరించడం, సింగరేణి అస్తిత్వానికి ముప్పుగా మారుతోంది. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్లో ఎండీవో పేరిట టెండర్లు పిలవడం ద్వారా, గని మొత్తాన్ని 25 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పేరు మాత్రమే సింగరేణిది, అధికారమంతా ప్రైవేట్ చేతుల్లో ఉంటే, అది ప్రైవేటీకరణ కాక ఇంకేమిటి?
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే విచారణలు త్వరగా పూర్తవుతాయి. తప్పు చేసినవారికి శిక్షలు వేగంగా పడతాయి. కానీ రాజకీయ క్రీడలో భాగమైనప్పుడు మాత్రమే విచారణలు అంతులేని ప్రక్రియలుగా మారతాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త వివాదాలు తెరపైకి వస్తుంటాయి. విచారణల పేరుతో కాలయాపన చేస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం అనివార్యం. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి ప్రాణం. దానిని కాపాడకపోతే, అధికారంలో ఉన్నవారు కూడా కనుమరుగవడం ఖాయం.

