తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తే ఒక చేదు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నంతసేపు అవినీతికి పాల్పడటం, వేల కోట్లు వెనుకేసుకోవడం, అధికారం కోల్పోగానే అధికార పార్టీ అవినీతిపై పోరాటం చేయడం. ఇది ఇప్పుడు రాజకీయ సంస్కృతిగా మారిపోయింది. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా పరిస్థితి అదే. ఈ రాజకీయ దౌర్భాగ్యం వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈరోజు కోలుకోలేని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.
విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ పాలించిన ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ లు చేసిన ఆర్థిక దుర్వినియోగానికి బాధ్యత వహించాల్సిందే. అభివృద్ధి పేరుతో తీసుకున్న అప్పులు ప్రజలపై భారంగా మారాయి. కానీ ఈ అప్పులకు కారణమైన రాజకీయ నేతలెవ్వరూ బాధ్యత వహించడంలేదు. రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతే, రాజకీయ పార్టీలు మాత్రం అధికార మార్పిడితో సురక్షితంగా బయటపడుతున్నాయి.
ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు ఆరోపణలు, ఈ–కార్ రేసు కేసులు ఈ రాజకీయ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచడంతో బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన “నోటీసులు కాదు, రాజకీయంగా పోరాడుదాం” అన్న వ్యాఖ్యలు చట్టం కంటే రాజకీయ బలం పెద్దదన్న భావనను ప్రతిబింబిస్తున్నాయి. విచారణ ఎదుర్కొనాల్సిన సమయంలో సవాళ్లు విసరడం రాజకీయంగా తప్పించుకునే వ్యూహంగా మారింది.
ఇదే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఒకవైపు బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూనే, మరోవైపు తమ మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన టెండర్లు, బొగ్గు కుంభకోణంపై వచ్చిన ఆరోపణలు ప్రభుత్వ పారదర్శకతపై సందేహాలు కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీలకు వేల కోట్ల టెండర్లు కట్టబెట్టారన్న ఆరోపణలు తేలికగా తీసుకునేవి కావు. వీటిపై స్వతంత్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ ఆరోపణ–ప్రత్యారోపణల రాజకీయంలో ప్రజల ప్రయోజనం ఎక్కడా కనిపించదు. “వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి” అన్నట్లు, ఒక పార్టీ అవినీతిని మరో పార్టీ అవినీతి ఆరోపణలతోనే ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా నిజం మరింత మసకబారుతోంది. విచారణ సంస్థలు రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నాయన్న భావన ప్రజల్లో బలపడుతోంది. పైగా విచారణాధికారులను నేరుగా బెదిరించడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాత్ర కూడా ప్రశ్నార్థకమే. రాష్ట్రాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంగా నిజాయితీగా చర్యలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. బొగ్గు మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి పాత్ర ఏమిటి? సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు ఎందుకు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదు? అవినీతి ఆరోపణలు రాజకీయ అవసరాలకే పరిమితమవుతున్నాయా? అన్న అనుమానం తలెత్తుతోంది.
సింగరేణి వంటి కీలక ప్రభుత్వ సంస్థల్లో టెండర్ ప్రక్రియలపై వస్తున్న ఆరోపణలు అత్యంత ఆందోళనకరం. మైనింగ్ టెండర్లు భౌగోళిక పరిస్థితులతో ముడిపడి ఉండటం వల్ల, పారదర్శకత అత్యవసరం. సైట్ విజిట్ చేసిన కంపెనీలకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం, అధికారుల అనిశ్చితి, రాజకీయ జోక్యం వంటివన్నీ అవినీతికి తలుపులు తెరుస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన నైనీ కోల్బ్లాక్ టెండర్లలోనూ రాజకీయ అనుబంధాలు ఉన్న కంపెనీలకే లబ్ధి చేకూరిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పాలనలోనూ పునరావృతమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. పోలీసులు, అధికార నియంత్రణలో ఉన్న సంస్థలతో రాజకీయ అవినీతికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం. అందుకే అన్నా హజారే సూచించినట్లుగా, నిజంగా స్వతంత్రంగా పనిచేసే బలమైన లోక్పాల్ వ్యవస్థ అత్యవసరం. అధికారంలో ఎవరు ఉన్నా, ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా, భయం లేకుండా విచారణ చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదన్న భయం ఏర్పడుతుంది.
జగన్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరు చేసినా అవినీతి అవినీతే. ప్రజలు, మేధావులు, పౌర సంఘాలు కలిసి రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. అవినీతి నుంచి బయటపడాలంటే లోక్పాల్ ఒక్కటే శరణ్యం. రాజకీయ సంకల్పం కావాలని నిర్వీర్యమవుతోంటే, ప్రజా ఒత్తిడే ఆ సంకల్పాన్ని సృష్టించాలి. లేదంటే ఈ ఆరోపణల రాజకీయాలు, అవినీతి చక్రం యథాతథంగా కొనసాగుతూనే ఉంటుంది.

