ఆరావళిలో మైనింగ్ నిషేధం సహేతుకమైన నిర్ణయం. ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ పర్వతాలు భారత దేశపు పర్యావరణ భద్రతకు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణులు, కేవలం భౌగోళిక నిర్మాణమే కాదు. ఉత్తర భారతదేశ వాతావరణ సమతుల్యత, భూగర్భజలాల పరిరక్షణ, జీవ వైవిధ్యానికి కీలకంగా ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా సాగిన అక్రమ మైనింగ్, అశాస్త్రీయ అభివృద్ధి కారణంగా ఆరావళి తీవ్రమైన పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంది.
ఆరావళి పర్వత శ్రేణి థార్ ఎడారికి సహజ అడ్డుకట్టలా నిలిచింది. పశ్చిమం నుంచి వీచే ఎడారి గాలులు తూర్పు భారతావనికి విస్తరించకుండా ఈ పర్వతాలు అడ్డుకుంటాయి. రాజస్తాన్, హర్యానా ప్రాంతాల్లో భూగర్భ జలాలను ఒడిసిపట్టి, నిల్వ ఉంచడంలో ఆరావళి పర్వతాలు కీలకంగా పని చేస్తున్నాయి. ఇక్కడి అడవులు చిరుతలు, నక్కలు, జింకలు, పక్షులు వంటి అనేక జీవ జాతులకు నివాసంగా ఉన్నాయి. ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ అంటే, ఒక సంపూర్ణ జీవన వ్యవస్థను కూల్చివేయడమే.
ఎనిమిది వందల కి.మీ. పొడవునా విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణుల్లో 1990ల నుంచే లైమ్స్టోన్, మార్బుల్, ఇతర ఖనిజాల కోసం విస్తృతంగా మైనింగ్ జరుగుతోంది. అనేక చోట్ల అక్రమంగా, పర్యావరణ అనుమతులు లేకుండానే సాగుతోంది. ఫలితంగా కొండలు తరిగిపోయాయి. అడవులు నశించాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రమైంది. దుమ్ము కాలుష్యం పెరిగి, స్థానిక ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడింది. అభివృద్ధి పేరుతో జరిగిన ఈ మైనింగ్ వాస్తవానికి దీర్ఘకాలిక విధ్వంసానికి దారితీసింది.
ఆరావళి పరిరక్షణ కోసం పర్యావరణవేత్తలు, పౌర సమాజ సంస్థలు, స్థానిక ప్రజలు కీలక పాత్ర పోషించారు. ‘సేవ్ ఆరావళి’, ‘అరావళి బచావో ఉద్యమం’ వంటి ఉద్యమాలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించాయి. పర్యావరణ కార్యకర్తలు కోర్టులను ఆశ్రయించి, మైనింగ్ వల్ల కలిగే నష్టాలను ఆధారాలతో నిరూపించారు. ఈ పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక తీర్పులు ఇచ్చాయి. ముఖ్యంగా 2009లో సుప్రీంకోర్టు హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో అనియంత్రిత మైనింగ్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నిషేధానికి మార్గం వేసింది.
ఆరావళిలో మైనింగ్ నిషేధం గొప్ప పర్యావరణ విజయం. ఆరావళి మరింత నాశనం కాకుండా అడ్డుకుంది. అయితే నిషేధం ఉన్నప్పటికీ, భూ ఉపయోగ మార్పులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, రహదారుల నిర్మాణం వంటి రూపాల్లో కొత్త ముప్పులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ‘నాన్-ఫారెస్ట్ యాక్టివిటీ’ పేరుతో ఆరావళి భూములను ఇతరత్రా వినియోగానికి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నిషేధ లక్ష్యాలకు విరుద్ధంగా కొనసాగుతున్న చర్యలు.
నిజానికి ఆరావళి పరిరక్షణ కేవలం నిషేధంతోనే సాధ్యం కాదు. అడవుల పునరుద్ధరణ, స్థానిక వృక్షజాలాన్ని తిరిగి పెంపొందించడం, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు అవసరం. ఆరావళి పరిరక్షణలో స్థానిక ప్రజలను భాగస్వాములుగా చేయడం అత్యంత ముఖ్యం. పర్యావరణ విద్య, పారదర్శక పాలన, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా విధానాల రూపకల్పన జరగాలి. ఆరావళిని ‘నో-గో జోన్’గా ప్రకటించి, దీర్ఘకాలిక పరిరక్షణ చర్యలను చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
ఇక ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం, న్యాయపోరాటం ఫలితం మాత్రమే కాదు. పర్యావరణ చైతన్యానికి ప్రతీక. ఈ విజయం శాశ్వతం కావాలంటే, భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించాలంటే, నిరంతర అప్రమత్తత అవసరం. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించినప్పుడే నిజమైన స్థిరమైన పురోగతి సాధ్యమవుతుంది. ఆరావళి పర్వత శ్రేణులను పరిరక్షించడమంటే, ప్రకృతిని మాత్రమే కాదు, మన భవిష్యత్తును కాపాడుకోవడమే.

