ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పత్తి రైతుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. తెల్లబంగారాన్ని పండించి లాభాలు పొందాలనుకున్న రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, మార్కెట్ అస్థిరత, విదేశీ దిగుమతుల ప్రభావం వల్ల చిత్తవుతున్నారు. ముఖ్యంగా సీసీఐ విధిస్తున్న కఠిన నిబంధనలు రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నాయి. అమెరికా, చైనా టారిఫ్ ల యుద్ధం నేపథ్యంలో భారతీయ పత్తి రైతులను కాపాడుతానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, పత్తిపై దిగుమతి సుంకాన్ని 11 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. దీంతో విదేశీ పత్తి వరదలా వచ్చిపడింది. దేశీయ పత్తికి డిమాండ్ తగ్గి, రైతు నష్టాల్లో కూరుకుపోయాడు.
రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోళ్ల సమస్యపై కనీస స్పందనను కబరచకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. సీసీఐ వరుసగా టెండర్లు పిలిచినా మిల్లులు పాల్గొనకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆలస్యంతో రైతులు పత్తిని ఆరబెట్టుకునే అవకాశాలు కోల్పోయి, తేమ శాతం పెరగడంతో పత్తి కొనుగోలు తిరస్కరణకు గురవుతున్నది. ఎనిమిది నుంచి 12 శాతం తేమ ఉన్నా, తూకంలో కోతలు పెట్టడం, 12 శాతం దాటితే కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురవుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలు, చలికాలం కావడంతో మంచుతో తేమ శాతం సహజంగానే పెరుగుతోంది. ఇదంతా తెలిసినా, ప్రభుత్వం కానీ, సీసీఐ కానీ కఠిన నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఇవ్వకపోవడం వల్ల రైతులకు దెబ్బ మీద దెబ్బలా మారింది.
కపాస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు జరుపుతామని సీసీఐ షరతు పెట్టడం, కొనుగోళ్ళకు మరో పెద్ద అడ్డంకిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు లేని రైతులు, నెట్వర్క్ సమస్యలు, నమోదు ప్రక్రియలో, యాప్ వినియోగం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పీకులాటలకు తాళలేక రైతులు, ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అటు సీసీఐ నుంచి కానీ, ఇటు ప్రైవేటు వ్యాపారుల నుంచి కానీ రైతులకు లభించడం లేదు. పైగా రైతులు దోపిడీకి గురై తీవ్ర నష్టాల్లోకి నెట్టబడుతున్నారు.
ఎకరాకు గరిష్టంగా 12 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చే పత్తిపై, సీసీఐ చివరి నిమిషంలో ఎకరాకు 7 క్వింటాళ్లకే పరిమితం చేయడం రైతులను మరింత నిరాశకు గురి చేసింది. అంటే ఎంత పండినా, ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ళ చొప్పుననే సీసీఐ కొనుగోలు చేస్తుంది. మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలన్న ప్రశ్నకు సమాధానం లేదు. కొంత సీసీఐ వద్ద, మరికొంత ప్రైవేట్ కంటే మొత్తానికి మొత్తం ప్రైవేట్ వ్యాపారులకే తెగనమ్ముకుంటున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.8,110 అయినప్పటికీ, తేమ, రంగు మార్పు పేరుతో కోతలు పెట్టి రైతు చేతికి వెయ్యి రూపాయల వరకు తగ్గిస్తున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి పత్తి సాగును పూర్తిగా సంక్షోభంలోకి నెట్టాయి. సీసీఐ అవకతవకలను నియంత్రించేందుకని నిబంధనలు తెచ్చినా, అవే రైతుల పాలిట శాపంగా పనిచేస్తున్నాయి. కపాస్ యాప్ ను పంజాబ్ రైతులు తిరస్కరించారు. అయినా కేంద్రం ఆ యాప్ ను కానీ, రైతు సమస్యలను కానీ తిరిగి విచారించలేదు. దేశవ్యాప్తంగా పత్తి మార్కెట్ నే కుదిపేస్తున్న ఈ పత్తి కొనుగోళ్ళ సమస్యలను అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి.
పత్తి రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కేంద్రం అత్యవసర చర్యలు తీసుకోవాలి. దిగుమతుల నియంత్రణ, తేమ శాతం సడలింపు, మద్దతు ధర అమలు, యాప్ నిబంధనల సవరణ వంటి సమస్యల పరిష్కారం ఆలస్యం అయితే తెల్లబంగారం సాగు పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది.

