బీహార్ శాసనసభ ఎన్నికల్లో రాజకీయం వేడెక్కింది. పరస్పర విమర్శలతో ప్రచారం జోరందుకుంది. ప్రజల్ని ప్రభావితం చేసేందుకు పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. పొత్తులు పొసగని కూటమి మహాగఠ్ బంధన్, పరస్పరం నమ్మకంలేని ఎన్డీఏ కూటమిల మధ్య పోరు రసవత్తరంగా మారింది. మరోవైపు నక్కజిత్తుల నితీశ్ కి చెక్ పెట్టేందుకు బీజేపీ సహా, అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది. వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్న పీకేకు రెండు బలమైన కూటములను నిలవరించడం అంత ఈజీ కాదు.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
బీహార్ శాసనసభ ఎన్నికల్లో రాజకీయం వేడెక్కింది. పరస్పర విమర్శలతో ప్రచారం జోరందుకుంది. ప్రజల్ని ప్రభావితం చేసేందుకు పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి.‘ఆర్జేడీ పరిపాలన నాటి అవినీతి గురించి వందేళ్లయినా చర్చించుకుంటా’రని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘అసలు డబుల్ ఇంజిన్ సర్కార్తో బీహార్కు ఒరిగిందేమిటి?’ అని ఘాటుగా నిలదీశారు ఆర్జేడి నేత తేజస్వి యాదవ్.
బీహార్ లో ఇండియా బ్లాక్ మహా గఠ్ బంధన్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను ప్రకటించి అధికార జేడీయు నేతృత్వంలోని ఎన్డిఎకి తిరుగులేని సవాల్ విసిరింది. అయితే కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు. అందుకే పలుచోట్ల పరస్పర పోటీకి దిగారు. దీనికితోడు ప్రచార పోస్టర్లలో రాహుల్ బొమ్మ లేకుండానే ఆర్జేడీ ప్రచారం చేస్తోంది. ఇవే అంశాలను ప్రచారాస్త్రాలుగా ఎన్డిఎ ఎత్తిచూపుతోంది. పొత్తులు పొసగని కూటమి మహాగఠ్ బంధన్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈసారి బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది. వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్న పీకే ఈ రెండు బలమైన కూటములను నిలవరించడం అంత ఈజీ కాదు.
బీహార్లో గత దశాబ్దంన్నర కాలంగా నితీష్ చతురతతో వ్యవహరిస్తున్నారు. పదవే లక్ష్యంగా కూటములు ఫిరాయించిన చరిత్ర ఆయనది. ఆయన విధానాన్ని బీజేపీ బలంగా ఉపయోగించుకుంది. 2020 అక్టోబర్, నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత బీజేపీ పంచన చేరి నితీష్ సీఎం అయ్యారు. ఆ పార్టీ తనను ఇబ్బంది పెడుతోందని పదవికి రాజీనామా చేసి మహా గఠ్ బంధన్ వైపు వచ్చి తిరిగి సీఎం అయ్యారు. రెండేళ్లన్నా గడవక ముందే, సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట 2024 జనవరిలో ఎన్డిఎ తీర్థం పుచ్చుకొని పదవిని కాపాడుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కావాల్సిన సీట్లు తగ్గగా తన సీట్లతో భుజం కాసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ పార్టీకి బీజేపీ కంటే తక్కువ సీట్లొచ్చినా ఆయన్నే సీఎం కుర్చీలో కూర్చోబెట్టామంటున్న బీజేపీ, ప్రస్తుత ఎన్నికల్లో తన గొంతును సవరించుకుంటోంది. మొత్తం 243 సీట్లలో బీజేపీ, జేడీయు చెరో 101 సీట్లకు పోటీ చేసి, మిగతా స్థానాలను తమ భాగస్వామ్య పార్టీలకు కేటాయించాయి. కూటమి విస్తృత ప్రయోజనాల కోసం తాము గతంలో పోటీ చేసిన సీట్ల కంటే తగ్గించుకున్నామని బీజేపీ చెబుతున్నదాంట్లో నిజం కనిపించదు.
రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ జేడీయును మింగేసి ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తోందని కొన్నేళ్ల బీహార్ రాజకీయ పరిణామాలను బట్టి తెలుస్తుంది. నితీశ్ను నమ్మినట్లు కనిపిస్తున్నా, నమ్మక ద్రోహానికి బీజేపీ ఎప్పుడైనా సిద్దంగానే ఉంటుంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తే నితీశ్ను పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ రాజకీయ ఎత్తులు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రుజువయ్యాయి. మహారాష్ట్రలో సిఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఎన్డిఎ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో సీఎం పదవిని బీజేపీ తీసుకొని, కూటమి పొత్తు ధర్మానికి నీళ్లొదిలింది. బీహార్లోనూ నితీష్ కి బీజేపీ, అలా చేయదన్న గ్యారంటీ లేదు.
బీహార్ ఎన్నికలకు ముందుగానే తమ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడైన ముఖేష్ సహానీ పేరును సైతం ప్రకటించి మహా గఠ్ బంధన్ ఎన్నికల సమరానికి సై అంది. అయితే మహా గఠ్ బంధన్ లోని ఆర్జేడీని గత పాలన పాపాలు, కుంభకోణాలు వెన్నాడుతున్నాయి. ఇక తమ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఎలాంటి ఇబ్బందులూ లేవని డాంబికాలు పలుకుతున్న ఎన్డిఎ తమ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చలేదు. పైగా ఎన్నికల అనంతరమే ప్రకటిస్తామని బీజేపీ, అమిత్షా దాటవేస్తూ వచ్చారు. జేడీయు చీఫ్, సీఎం నితీష్ నేతృత్వంలో ఎన్డిఎ ఎన్నికలకు వెళుతోందని అంటూనే, నితీష్ సీఎం అవుతారన్న గ్యారంటీని మాత్రం చెప్పడం లేదు. దీన్ని బట్టి నితీష్ మెడపై బీజేపీ కత్తి వేలాడతీసిందని అర్థమవుతుంది.
బీహార్లో గెలిచేందుకు బీజేపీ తొక్కని అడ్డదార్లు లేవు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి, ప్రత్యేక ఓటర్ల సవరణ-ఎస్ఐఆర్ను ప్రయోగించింది. ఈసీకి ఎంతమాత్రం సంబంధం లేని పౌరసత్వ నిర్ధారణ అంశాన్ని చేర్చేలా పావులు కదిపింది. ప్రతిపక్షాలు సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఏకంగా 65 లక్షల ఓట్లు తొలగించారు. విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించినా ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగనే లేదు. ఓట్ల చోరీపై మహా గఠ్ బంధన్ పెద్ద ఆందోళనే చేసింది.
ఇక నితీష్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని ఇప్పటికే ముందస్తు సర్వేలు చెప్తున్నాయి. బీహార్లో బీజేపీ, దాని మిత్రులను ఓడిస్తేనే కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు కొంత మేరకైనా బ్రేకులు పడతాయని విపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. ఆ లక్ష్య సాధన కోసం తమలోని చిన్న చిన్న ఇబ్బందులను పరిష్కరించుకొని మహా గఠ్ బంధన్ పని చేయాలని ఆపార్టీ కోరుకుంటోంది.
అయితే ఈసారి బీహార్లో పరిస్థితులు ఎవరికీ అంత అనుకూలంగా లేవు. అలాగే ఎవరిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారో, అంగీకరిస్తున్నారో కూడా చెప్పలేక పోతున్నారు. ఈ పరిస్థితుల్లో రేపటి ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు? నిలుస్తారన్నది వేచి చూడాలి.

