విద్యతోపాటు వైద్యం కూడా ప్రజల ప్రాథమిక హక్కే. వీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వాల విధి. కానీ, ప్రభుత్వాలు తమ బాధ్యతల్ని మరచి, వాటిని ప్రైవేట్ పరం చేయడం లేదా కొర్పోరేట్ల చేతుల్లో పెట్టడం, అజమాయిషీ చేయకపోవడం జరుగుతూనే ఉంది. కార్పోరేట్లకు ప్రజా ధనాన్ని దోచిపెట్టడం, ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం షరా మామూలైపోయింది. కేవలం ఓట్ల కోసం ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్ కి ఏటా వేల కోట్లను దోచిపెట్టడం విచిత్రం, విడ్డూరం, దారుణం, దౌర్భాగ్యం మరెక్కడా లేదు. పైగా అవి బ్లాక్ మెయిల్ చేస్తే, అవి చెప్పినట్లా తలాడించడం ఏలుతున్న వారికి సిగ్గుచేటు. ఒక్క ఏడాది ప్రభుత్వాలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి దోచిపెడుతున్న డబ్బుల్ని ప్రభుత్వ వైద్యానికి వినియోగిస్తే, అసలు ప్రైవేట్ వైద్యం అవసరం ప్రజలకెందుకుంటుంది? వేల, లక్షల కోట్లు వెచ్చించి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టడమెందుకు? వైద్యులను తయారు చేయడమెందుకు? ప్రైవేటుగా దోచుకోమని చెప్పడానికా?
అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో మొదలైన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజల రోగాల కంటే, ప్రైవేట్ హాస్పిటల్సే ఎక్కువగా బాగుపడుతున్నాయి. ఈ పథకం కింద పెట్టే ఖర్చుతో జిల్లాకో పది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని నిర్మించవచ్చు. కానీ, ప్రైవేట్ మాఫియా గుప్పిట్లో ఉన్న ప్రభుత్వాలు ఈ పథకం పేరుతో ప్రజాధనాన్ని ప్రైవేట్ వైద్యశాలలకు దోచి పెడుతున్నాయి. నిజానికి ఫీ రియంబర్స్మెంట్ పథకం కూడా ఇలాంటిదే. నేరుగా విద్యార్థులకు అందించాల్సిన ఫీజులను కాలేజీలకు చెల్లించడమేంటి? అవి కోట్లకు పడగలెత్తి ప్రభుత్వాల్ని బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేయడమేంటి? ఈ రెండు పథకాలు రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నాయి.
పోనీ, హాస్పిటల్స్, కాలేజీలేమైనా రోగులను, విద్యార్థులను గౌరవిస్తున్నాయా? అంటే అదీ లేదు. సెకండ్ గ్రేడ్ సిటిజన్ల కింద చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు గౌరవ ప్రదమైన వైద్యం అందడం లేదు. ఈ పథకం కింద వచ్చే వారికి బిల్లులో మదింపు చేసి ఎక్కువ చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిని నాసిరకంగా ట్రీట్ చేస్తున్నారు. ప్రత్యేక వార్డులు, ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చికిత్సలో డబ్బులున్న వారికి ఓ రకంగా, ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లను మరోరకంగా ట్రీట్ చేస్తున్నాయి. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. జనాభాకు తగ్గట్లుగా హాస్పిటల్స్ ను నిర్మించి, ఆరోగ్యశ్రీ భారాన్ని తొలగించుకోవాల్సిన అసవరం ఉంది. ఆరోగ్యశ్రీ డబ్బులతో వందలాది దవాఖానాల నిర్మాణం చేయవచ్చు. అలాగే నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులను త్వరగా పూర్తి చేయాలి.
ఏపీలో పీపీపీ కింద వైద్యశాలల నిర్మాణంపై వస్తున్న విమర్శలను పరిశీలించాలి. ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం పేరిట ప్రైవేటుపరం చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. వైద్య విద్యను పూర్తి ప్రభుత్వ రంగంలోనే నిర్వహిస్తూ, ఇప్పటి లాగే, ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయాల్సి ఉంది. వైద్య విద్యను సమర్థంగా నిర్వహించాలి. సరైన ఫ్యాకల్టీని, వైద్యులను కూడా సిద్దం చేసుకోవాలి. సంక్షేమం పేరిట దుబారా ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు విద్యా, వైద్యరంగాలను బలోపేతం చేసేందుకు అధిక నిధులను వెచ్చించాలి. బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ప్రజలు ప్రైవేటు రంగం వైపే ఎందుకు ఆకర్షితులవుతున్నారన్న దానిపై అధ్యయనం చేయాలి. అందుకే ప్రభుత్వ వైద్యశాలలను ముందుగా బలోపేతం చేయాలి. ప్రైవేట్ కు దీటుగా పోటీగా అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి.
విద్యా రంగంలోనూ ప్రైవేట్ మాఫియా బలంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్చడానికే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో తెలుసుకోవాలి. అనేక సదుపాయాలు కల్పించినా, విశాలమైన గదులు, తర్ఫీదు పొందిన, అత్యధిక జీతాలు తీసుకుంటున్న టీచర్లున్నప్పటికీ ఫలితం కానరావడం లేదు. ఫీ రియంబర్స్ మెంట్ వంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వ బడుల్లో, కాలేజీల్లో చదివే విద్యార్థులకే అందించాలి. ప్రభుత్వం ప్రైవేట్ వైద్యశాలలు, కాలేజీలకు ఫీ రియంబర్స్ మెంట్ అందిస్తున్నదంటే, ప్రైవేట్ కంటే ప్రభుత్వంవి అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరిస్తున్నట్లే గదా?
ప్రభుత్వ విద్యా, వైద్యరంగంలో జవాబుదారీతనం రావాలి. సదుపాయాలు, అజమాయిషీ పెంచాలి. ప్రజల్లో విశ్వాసం పెంచాలి. ఫీ రియంబర్స్ మెంట్ పథకం వల్ల, ఇంజనీరింగ్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చాయి. ఫలితంగా విద్యా ప్రమాణాలు, నాణ్యత దెబ్బతింది. అనేక కళాశాలలు మూతపడ్డాయి. ఆ నాణ్యతలేని విద్యనభ్యసించిన లక్షలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలారు. అందుకే ప్రభుత్వ విద్య, వైద్య ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ యాజాన్యాలను కట్టడి చేయాలి. ఆ మాఫియా బెదిరింపులకు లొంగకుండా ప్రజాధనాన్ని ప్రజలకే ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. కనీసం ఈ రెండు రంగాల్లోనైనా ప్రైవేట్ లేకుండా చేస్తే మంచిది.

