ప్రజా సంక్షేమ, ఉచిత పథకాలు, నగదు బదిలీలు రాష్ట్రాలను దివాళా తీయిస్తున్నాయి. ఆయా పథకాల అమలు కోసం చేసే అప్పులు, వాటికి వడ్డీలు, వడ్డీలకు వడ్డీలు తడిసి మోపెడై, ఆర్థిక వ్యవస్థే అస్తవ్యస్థమైపోతున్నది. అయినా, ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాల్లో భాగంగా ఆయా పథకాలనే నమ్ముకుంటున్నాయి. వెనుకటికి రాజుల పైసలు రాళ్ళ పాలు అనే వారు. ఇప్పుడు ప్రజల పైసలు ప్రజలకే పెడుతున్నామని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ, ఉచితానుచితాలను సమీక్షించుకోవడం లేదు. దీంతో ఉద్యోగులకు జీత భత్యాలు కూడా సమయానికి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలుంటున్నాయి. ఆర్థిక నిర్వహణ భారంగా మారి, ప్రజలకు, వారి ఆస్తులకు కేర్ టేకర్ గా ఉండాల్సిన ప్రభుత్వాలు, ప్రైవేట్ లిమిటెడ్, రియల్ ఎస్టేట్ కంపెనీని తలపిస్తున్నాయి. మిగులు రాష్ట్రాలు తరుగు రాష్ట్రాలుగా మారి, అప్పుల కుప్పలై పోతున్నాయి.
సాధారణంగా ఎన్నికల్లో పార్టీలు తమ మేనిఫెస్టోల ద్వారా ప్రజల ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నాలు ఎందాకా పోయాయంటే, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత గ్యాస్ సిలండర్ కు కాంగ్రెస్ రూ.500లకు ప్రకటిస్తే, బీఆర్ఎస్ రూ.400లకే ఇస్తామని హామీ ఇచ్చింది. సాధ్యాసాధ్యాలను ఏ పార్టీ చూడటం లేదు. హామీలిచ్చామా? అధికారంలోకి వచ్చామా? ఆ తర్వాత అధికారాన్ని నిలుపుకోవడానికి ఏమైనా చేద్దామా? అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ప్రజలు కూడా మేమేంటి? మాకేంటి? అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఊరు, వాడ, సమాజం, రాష్ట్రం, దేశం అనే విశాల భావాలను పక్కనపెట్టి ఆలోచిస్తున్నారు. ఇదే అదనుగా రాజకీయ పార్టీలు, నేతలు అధికారానికి ముందు ఓట్లు, తర్వాత నోట్లు దండుకుంటున్నారు. ఒక్కసారి అధికారం వస్తే చాలు లక్షల కోట్లకు పడగలెత్తుతున్నారు.
తాజాగా ఏపీలో ఆటో డ్రైవర్లకు ‘చేయూత’ కింద ఒక్కొక్కరికి రూ.15వేల నగదు జమ చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభంలోనే ఓ మహిళా డ్రైవర్, తమ ఇంట్లో ఎన్ని ఉచిత పథకాలు అందుతున్నాయో తెలిపారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా నగదు అందుతూ పోతే, రాష్ట్రం దివాళా తీయకుండా ఉంటుందా? పాలకులు దీన్ని ఎలా సమర్థించుకుంటారు?
ఇప్పటికే ఉభయ తెలుగు రాష్టాల్రు దివాళా దిశగా పయనిస్తున్నాయి. ఒకవైపు ఉచిత పథకాలు, మరోవైపు రాజకీయ నాయకుల ఖర్చులతో రాష్ట్రాలు కుదేలవుతున్నాయి. కేసీఆర్, జగన్ల కారణంగా ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి రూ.15 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. డ్రైవర్లకు రూ.15వేల నగదు బదిలీలు, మహిళలందరికీ ఉచిత బస్సులు, పెన్షన్లు, దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ రేషన్ కార్డులు, కిలో రూపాయికి సన్న బియ్యం పథకాలు, ఆరోగ్యశ్రీలు, ఉచిత విద్యుత్, రైతు రుణ మాఫీలు, రైతు భరోసాలు, రైత బీమాలు, ఫీ రియంబర్స్ మెంట్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ కార్డు హోల్డర్లకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు నెలనెలా రూ.2,500, స్కూల్ కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు, యువతకు ఉపాధి హామీ, నిరుద్యోగ భ్రుతి… మహిళలకు ఉచిత బస్సు…డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు పథకాల కంటే ఇవే ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యంపోనవసరం లేదు. ఒక్క ఉచిత బస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.300కోట్లు ఖర్చు చేస్తున్నది.
ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉద్యోగాధికారులకు లక్షల్లో జీతాలు, రెండు పెన్షన్లు, రకరకాల ఖర్చులు, హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లో నేతల పర్యటనలు వంటివన్నీ కలిసి తడిసి మోపెడు అవుతున్నాయి. దారిద్య రేఖకు ఎగువన ఉన్నవారు కూడా తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా వాటి పరిశీలనలే లేవు. రేషన్ కార్డుల సంస్కరణ నేటికీ చేపట్టకపోగా, అడిగిన వారికల్లా ఇస్తున్నారు. దీంతో రాష్ట్రాల్లో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డుల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని నిర్మించాలనే విషయంలో కూడా శాస్త్రీయత పాటించడం లేదు. ఇందిరమ్మ ఇళ్లకోసం నిజమైన అర్హులు అన్నది పక్కకు పోయి నేతలు ఎంపిక చేసిన వారి పేర్లు ముందుకు వచ్చాయి. రాష్ట్రమంతటా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే రాష్ట్ర బ్జడెట్ కూడా సరిపోదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియక ఇచ్చిన హామీలు ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడపలేని స్థితి ఏర్పడింది. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక సీఎంలు తలలు పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యాపిస్తోంది. మరోవైపు ఉచిత పథకాల లబ్దిదారుల్లోనూ సంత్రుప్తి లేదు. తెలంగాణలో దాదాపు రూ.25వేల కోట్ల మేర రుణమాఫీ చేసినా ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేర లేదు. ఇటీవలి వరదల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేంద్రంపై ఆధారపడడం తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా చేసిందేవిూ లేదు. అందుకే రైతులు కూడా సంతృప్తిగా లేరు. రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారంలో, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు స్వీకరణలో కూడా సరైన కసరత్తు జరగలేదు.
ఎపిలో పేదలకు ఇళ్ల విషయం లోనూ ఇదే జరుగుతోంది. అక్కడంతా అమరావతి, పోలవరం చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణ చేస్తున్నారు. చీప్ లిక్కర్ కేసులో ఇప్పుడు సొంతపార్టీ నేతలే దొరకడంతో తెలుగుదేశం ఇరకాటంలో పడింది. గతంలో రాష్ట్రాలను దివాళా తీయించిన కేసీఆర్, జగన్ బాటలోనే ప్రస్తుత సీఎంలు పయనిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దశలో ఆర్థిక భారంగా మారిన పథకాలను సమీక్షించాలి. ఉచిత పథకాలను రద్దుచేయాలి. లేదా క్రమబద్దీకరించాలి. రెండు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికైనా పరిస్థితులను మదింపు చేసుకుని, తగు దిదిద్దుబాటుకు దిగకపోతే, తెలుగు రాష్ట్రాలు మరింత దివాళా తీసే పరిస్థితి దాపురిస్తుంది.

