షాంఘై సదస్సు ఫలితాల ప్రభావం ఎలా ఉన్నా, అది జరిగిన తీరుతెన్నులు మాత్రం ఇండియా ఆశించినట్లుగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు కొంత అవమానకర పరిస్థితి ఉదురైంది. అలాగే ట్రంప్కు కళ్ళు కుట్టేలా, దిమ్మతిరిగేలా ప్రధాని మోదీ, జిన్పింగ్, పుతిన్లతో కలివిడిగా కనిపించారు. నిజానికి భారత్, చైనాల మధ్య సంబంధాలు పెద్దగా సఖ్యతగా లేవు. ఇదే సమయంలో జరిగిన షాంఘై సదస్సు చైనా భారత్ సంబంధాలు మెరుగు పడేలా, ట్రంప్కు చెక్ పెట్టేలా, పుతిన్ తో మరింతగా స్నేహం పెరిగేలా జరిగాయి. సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్కు ఇది మింగుడు పడని వ్యవహారమే. ఇదిలావుంటే అమెరికాలో ట్రంప్ వ్యతిరేక వర్గం కూడా ఈ సదస్సు తమ దేశానికి తీవ్ర నష్టం కలిగించేదిగా జరిగిందని భావిస్తోంది. ఇదే అదనుగా కొందరు అప్పుడే విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ భారీ సుంకాల మోతల దశలో చైనా వేదికగా సాగిన షాంఘై భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాకు హెచ్చరికగా నిలిచింది.
పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ సమక్షంలోనే షాంఘై సదస్సు వేదికపై భారత్ కు అత్యంత కీలకమైన దౌత్య విజయం దక్కింది. కశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సు సంయుక్త తీర్మానంలో స్పందన వెలువడింది. ఇతర అంతర్జాతీయ అంశాలతో పాటు ఈ ఉగ్రదాడిని ప్రస్తావించిన షాంఘై సదస్సు మన దేశానికి పూర్తి సంఫీుభావం, సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించింది. రెండు నెలల క్రితం క్వింగ్డావో షాంఘై సదస్సులో తమ పట్టు నెగ్గకపోవడంతో వాకౌట్కు దిగిన భారత్, ఇప్పుడు తన పంతం నెగ్గించుకుంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిని సభ్యదేశాలన్ని ఖండిస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులకు ప్రేరకులు, పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా, ఎంతటివారైనా తగిన శిక్షలకు, విచారణకు అర్హులని తేల్చారు. ఉగ్రవాదం వేర్పాటువాదం, తీవ్రవాదం పట్ల ఎటువంటి ఉపేక్ష తగదు. ఏ దేశమైనా ఉగ్రవాద స్థావరాలకు వేదికలు కారాదు. ఎక్కడ ఆ ప్రయత్నాలు తలెత్తినా, అలాంటి చర్యలను ఆయా దేశాల ప్రభుత్వాలు మొగ్గలోనే తుంచాలని ప్రకటించారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను కూడా ఉగ్రవాద దేశాలుగా ప్రకటించాలన్న భారత్ వాదనకు షాంఘై సదస్సు మద్దతు పలికింది. ఉగ్రవాదం ఏ రూపంలో, ఏ కోణంలో ఉన్నా, అది గర్హనీయం అవుతుంది. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలు, సాకులు వెతకడం కుదరదు. కేవలం ఈ జటిల సమస్య పరిష్కారమే లక్షంగా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా సాగాల్సి ఉందని ఈ సదస్సు పిలుపునిచ్చింది. ఇది ఓ రకంగా పాక్కు చెంపదెబ్బ. పాక్ను సమర్థించిన చైనాకు కూడా ఓ హెచ్చరిక. మొత్తంగా ఈ రెండు విషయాల్లో భారత్ ఓ రకంగా దౌత్య విజజయం సాధించిందనే చెప్పాలి.
షాంఘై వేదిక పై ప్రసంగించిన ప్రధాని మోదీ, ఉగ్రవాదం అణచివేతలో శషభిషలు వద్దు, దాటివేతలు, ద్వంద్వ ప్రమాణాలు పనికి రావని తేల్చిచెప్పారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేలవ హాజరీ మధ్య, చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్ ఇతర దేశాల అధినేతలతో జరిగిన వార్షిక సదస్సులో భారత ప్రధాని మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పోరు, కలిసికట్టుగా మానవీయ కోణంలో జరిపే విద్యుక్త ధర్మంగా గుర్తు చేశారు. పాకిస్థాన్కు, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోన్న ఇతరులకు ప్రధాని మోదీ ఈ వేదిక నుంచి నిర్థిష్ట హెచ్చరికలు గట్టిగానే చేశారు.
ఉగ్రవాదాన్ని భారత్ తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే భారత్ మే 10వ తేదీన ఆపరేషన్ సిందూర్ను నిర్వహించింది. ఇందుకు కారణమైన పక్క దేశం పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. మిత్రదేశాల కలయికతో సాగే ఎస్సిఒ అంటే సెక్యూరిటీ, కనెక్టివిటి ఆపర్చూనిటీ అని భద్రతా అనుసంధాన సమాన అవకాశాల వేదిక ఇది కావాలని పిలుపు ఇచ్చారు. ఎస్సిఒ మరింత కీలక శక్తి కావల్సి ఉంది. ఇక్కడ నుంచి ప్రాంతీయ సహకారానికి, ప్రపంచ శాంతి సుస్థిరత భద్రతలకు సరైన పిలుపు వెలువడాల్సి ఉందన్నారు. ఎస్సిఒ నుంచి నాగరికతల పరిరక్షణ వేదిక కూడా ఏర్పాటు కావల్సి ఉందని చెప్పారు.
మరోవైపు చైనాలోనే జరిగిన ఈ వేదిక ద్వారా ప్రధాని మోదీ, చైనా ప్రతిపాదిత బెల్ట్ రోడ్ ఇన్షియేటివ్ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఇతర దేశాల సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రాదేశికతకు సవాలు చేసే, అంశాలు, పరస్పరం విశ్వాసం కోల్పోయే స్థితిక తీసుకువస్తాయని హెచ్చరించారు. ఈ దశలో ఆయన పాక్, చైనాలను కలిపి విమర్శించారు. ప్రధాని మోదీ తమ ప్రసంగంలో భారతదేశ ప్రగతి ప్రస్థానం వివరించారు. రిఫార్మ్, పర్ఫాం, ట్రాన్స్ ఫామ్, ఆర్పీటీతో కదులుతున్నామని, దీనిని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియచేస్తానని వివరించారు.
మొత్తంగా షాంఘై సదస్సు ద్వారా భారత్ ప్రపంచానికి గట్టి సమాధానమే ఇచ్చింది. ఇది మన దౌత్య విజయం కూడా. అలాగే మన వ్యవహారాలు ఎలా ఉన్నా, కలసి నాడవాలని చైనాకు కూడా సూచించారు. రష్యాతో తమ బంధం విడదీయరానిదని తేల్చి చెప్పారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలను కలసికట్టుగా ఎదుర్కొనే అవకాశాలను పరోక్షంగా షాంఘై సదస్సు ప్రపంచానిక తెలిపింది. మిగతా దేశాలు కలిసి నడిస్తే నీ పెత్తనం సాగదన్న హెచ్చరికను తెలివిడారు.
భారత్ దౌత్య విజయంగా షాంఘై సదస్సు!|EDITORIAL

