తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు. కవులకు, కళాకారులకు కాణాచి కరీంనగర్ జిల్లా చెంజర్లలో 10.10.1940న రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు తమ, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదర్శించే వీధి బాగోతాలు, హరికథల పట్ల అభిమానాన్ని, ఆదరాన్ని పెంచుకున్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా నియమితులై ఇటు విద్యావ్యాసంగాన్ని అటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ, ఎం.ఏ., పిహెచ్.డి పూర్తి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకులుగా పదవీ విరమణ పొందారు. సంగని మల్లయ్య అనే తన పేరును “మలయశ్రీ”గా మార్చుకొని, 1968లో “కావ్య సుందరి” ఖండ కావ్య రచనతో సాహితీ సేద్యానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుండి ఆయన నాటౌట్ బ్యాట్స్మెన్ గా తుది శ్వాస వరకు రచనా వ్యాసంగం చేస్తూనే ఉన్నారు.
ఇప్పటివరకు అచ్చయిన, కానివి కలుపుకుని 150 రచనలు చేశారు. అందులో ధర్మ శ్రీ, సురభి, తొలిసంధ్య, మలి సంజ లాంటి పద్య కావ్యాలు, నారాయణ రెడ్డి గారి కర్పూర వసంత రాయలు ప్రభావంతో రాసిన “రాగశిఖ”లాంటి గేయ కావ్యం, మల్లెలు మందారాలు, రాగవల్లరి వంటి లలిత గేయాలు, పేదల పాటలు, ఎన్నికల పాటలు, రైతు పాటలు, రంగుల పిట్టలు, బంగారు బొమ్మలు, చుక్కల లోకం, పాల మనసులు వంటి బాలసాహిత్య రచనలు, కాళిదాసు మేఘ సందేశానికి యక్ష సందేశం పేరుతో ఆయన చేసిన అనువాదం, ఐరేని కుండలు కథలు, కలవారి కష్టాలు, విచిత్ర ప్రేమ, వెన్నెల వాన, తిరుగుబాటు, నిర్ణయం వంటి నవలలు రాశారు. అలాగే పిల్లల కోసం అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ మొదలైన దేశభక్తుల జీవిత చరిత్రలను ప్రచురించారు. శాంతి పథం, ప్రజాకవి వేమన, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు వంటి నాటకాలు రాశారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి అన్నట్లు మలయ శ్రీ క్రీ.శ 950-1995 నడుమ వచ్చిన కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్యం పై “కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర” అన్న శీర్షికతో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రముఖ పండితులు డాక్టర్ కే.రాజన్న శాస్త్రి గారి పర్యవేక్షణలో డాక్టరేట్ పట్టాన్ని పొందారు. ఈరోజు తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సారస్వత పరిషత్తు పక్షాన వెలువడుతున్న రచనలకు ఇది మార్గదర్శకమైంది. మలయశ్రీ ఈ విషయమై చేసిన పరిశ్రమ, పరిశోధన స్ఫూర్తిదాయకమయ్యాయి. 1970 దశకంలో రాష్ట్రంలో నెలకొన్న విప్లవోద్యమాల మూలంగా సమాజ పరిస్థితులను గమనంలో పెట్టుకొని ప్రభుత్వం విద్యార్థులలో శాంతి అహింసలను ప్రబోధించడానికై పాఠ్యాంశ ఎంపిక కోసం నిర్వహించిన పోటీలో మలయ శ్రీ రాసిన బౌద్ధ సంబంధమైన “శాంతిపథం” అనే నాటకం ఎంపిక అయి ఇంటర్ విద్యార్థులకు ఉపవాచకంగా నిలిచింది.
ఆయనకు మొదటి నుండి లేఖ సాహిత్యం అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఆయన రాసిన “తెలుగులో లేఖా సాహిత్యం ” అనే గ్రంథాన్ని పాఠక జనాదరణ గ్రంథంగా భావించి తెలుగు అకాడమీ ప్రచురించింది. ఈ విషయమై తెలుగులో వెలువడిన మొదటి గ్రంథం ఇదే. 1989లో తెలుగు విశ్వవిద్యాలయం తరపున నిర్వహించిన చరిత్ర-సంస్కృతి విషయ పోటీలో మలయశ్రీ రాసిన “కాకతీయుల కాలంనాటి సామాజిక జీవితం” అనే గ్రంథం ప్రథమ బహుమతిని సాధించింది. అలాగే ఆయన రాసిన తిరుగుబాటు నవలకు విశాలాంధ్ర , నిర్ణయం నవలకు మండలి వెంకటకృష్ణారావు స్మారక పురస్కారం లభించాయి. రాష్ట్రస్థాయికి చెందిన రసమయి వారి సాహితీ అవార్డు, బి. ఎన్ .శాస్త్రి, పి. యశోదా రెడ్డి, డాక్టర్ ద్వానా శాస్త్రి సాహిత్య పురస్కారాలను, ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య పరిశోధన పేర ఏర్పరిచిన పురస్కారాన్ని అందుకున్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలైన వినోద్ కుమార్ శుక్ల రచించిన హిందీ రచనకు”ఆ గోడపై ఒక కిటికీ ఉండేది” అనే పేరుతో తెలుగులో రచించి కేంద్ర సాహిత్య అకాడమీ వారికి అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని పొందారు. సత్యార్థి, భౌతికవాది అనే పత్రికలను నెలకొల్పి, కొనసాగించారు. 1996లో నవ్య సాహిత్య పరిషత్తును స్థాపించి తన రచనలతో పాటు ఇతరుల రచనలను కూడా వెలువరించారు. సంస్థ తరపున కవులకు, చరిత్రకారులకు, పరిశోధకులకు, గాయకులకు పురస్కారాలు అందించారు. మలయశ్రీ అవార్డును అందుకున్న వారిలో బోయ జంగయ్య, జి.వై.గిరి, వంగపండు ప్రసాదరావు, టి. రాజారాం సింగ్, సుప్రసిద్ధ కథకులు కాలువ మల్లయ్య, ఉద్యమ గాయకులు గూడ అంజయ్య, అందెశ్రీ, కవులు అని శెట్టి రజిత, అన్నవరం దేవేందర్ మొదలైన వారు ఉన్నారు.
ఉద్యోగరీత్యా నేను ఈ జిల్లాలో పని చేస్తున్న కాలంలో మలయశ్రీతో ఏర్పడిన పరిచయమే నన్ను పరిశోధనకు పురికొల్పింది. దానితో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచ్య భాషా అధ్యయనశాఖలో “మలయశ్రీ కావ్యాలు-పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి 2006లో డాక్టరేట్ డిగ్రీ ని అందుకున్నాను. 20.6.2009న హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి గ్రంధాన్ని ఆవిష్కరించారు. అలాగే ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్య విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహకారాన్ని అందించిన కరీంనగర్ కు చెందిన డా. కె. శ్యాంసుందర్ కు గ్రంథాన్ని అంకితం ఇచ్చాను. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేసిన ప్రొఫెసర్ ననుమాస స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో నా పర్యవేక్షకులు డాక్టర్ అప్పం పాండయ్య, పుస్తక పరిచయ కర్తలుగా మిత్రులు పల్లెర్ల రామమోహన్ రావు ప్రభృతులు పాల్గొన్నారు.
మలయశ్రీని దగ్గరగా గమనించినప్పుడు ఆయన కేవలం కవి, రచయిత మాత్రమే కాదు ఆచరణశీలి. తన రచనలలో ఆయన ఏమి ప్రబోధించాడో వ్యక్తిగతంగా తన జీవితంలోనూ కుటుంబంలోనూ వాటిని పాటించాడు. నిరంతర రచన, అధ్యయనం, పరిశోధన, ప్రచురణ, పర్యటనలతోనే ఆయన జీవితం గడిచేది. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను వాటి సిద్ధాంతాలను, వస్తున్న ధోరణులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు అనుగుణంగా కాలంతో పోటీ పడుతూ రచన వ్యాసంగాన్ని కొనసాగించేవాడు. మినీ కవితలు, నానీలు వస్తున్న రోజుల్లో ఆయన త్రిపదలు రాశాడు. హేతువాదిగా ఉంటూ మానవతావాదిగా జీవించారు. సాహిత్యం, చరిత్ర, పరిశోధన, బౌద్ధం, సైన్సు అన్నవి ఆయన అభిమానాంశాలు. వాటిని మూల బిందువుగా చేసుకునే ఆయన సాహిత్య వ్యాసంగం కొనసాగింది. సినారె అన్నట్లు “మలయశ్రీ సృజన శీలానికి అంచనావేయలేనన్ని అంచులు ఉన్నాయి.” ఇంతటి బహుముఖ ప్రతిభాశాలిని కారుణ్యంలేని కాలం 10.4.2026 న కాటేసింది. “నేను అచ్చంగా భౌతిక నైతిక వాదిని. బతుకు-బతుకనివ్వు సిద్ధాంతం నాది” అని ప్రకటించుకున్న మలయశ్రీ దివ్యస్మృతికి ఇదే నా అక్షర నివాళి.


