ప్రపంచ దేశదేశాల నుండి పల్లెలతో నిండి ఉన్న మనదేశం, రాష్ట్రాల వరకు ఆర్థిక వ్యవస్థలన్నీ అత్యంత విచారకరంగా ఉన్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా అప్పుల్లోనో, దివాళాలోనే ఉన్నాయి. అవాంఛనీయ ఆర్థిక దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. వాటిలో చాలావరకు దివాళా దశకు చేరుకున్నాయి. సరిదిద్దాల్సిన ప్రభుత్వాలు వీటిపై స్పందిచడం లేదు. ఆ ప్రభుత్వాలు, పాలకులే ఆర్థిక సంక్షోభాలకు కారణమవడం విచారకరం.
ఆర్థిక పాలన, పరిపాలనా వ్యవస్థలో అసమానతలు, అసమతౌల్యతలు, అక్రమాలను, పాలనా వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీలు తమ ఆర్థిక బాధ్యతలను నిర్వహించలేకపోతే, అది కేవలం వాటి పరాజయం మాత్రమే కాదు. అది మొత్తం సమాజం, ప్రజలు, రాష్ట్రం, దేశం, ప్రజాస్వామిక వ్యవస్థ మొత్తం ఓటమి కిందే లెక్క. ప్రభుత్వ సంస్థలు, విమానయాన సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ప్రాంతీయ రవాణా సంస్థలు, బ్యాంకులు, పరిశ్రమలు, కొర్పొరేట్ సంస్థలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోతున్నాయి. నష్టాల్లో ఉంటూ, వేతనాలకే దిక్కులేని స్థితిలో ఉన్నా, పాలకులు మౌనం పాటించడం ప్రజల్లో అనుమానాలు, అసహనాన్ని కలిగిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక లెక్కల్లో పారదర్శకత లేకపోవడం, ఆడిట్ నివేదికలను ప్రజల ముందు ఉంచకపోవడం మనకు కనిపిస్తోంది. కొన్ని ప్రభుత్వాలు అర్థవంతమైన వ్యయ నియంత్రణను పాటించక పోగా, దుబారాలు చేస్తున్నాయి. ప్రజావసరాలను, ఆర్థిక వ్యవస్థ మంచిచెడులు పట్టించుకోకుండా, పెద్ద ప్రాజెక్టులపై మరీ ఎక్కువ ఖర్చు చేయడం మూలంగా అప్పుల భారం పెరిగింది. మరోవైపు ఆర్థిక లావాదేవీలు, నిజ పరిస్థితిని ప్రజల ముందు పెట్టకుండా, ఎక్కడ తమ అవినీతి, దుబారా, అక్రమాలు బయటపడతాయోనన్న భయం, ప్రజల్లో తమ నమ్మకం పోతుందన్న అనుమానంతో పాలకులు అసలు సమస్యను పరిష్కరించడానికంటే దాని నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు మిషన్ భగీరథ పథకంపై అప్పులు తెచ్చేప్పుడు ప్రజలకు నీటిని సరఫరా చేసి, డబ్బులు వసూలు చేసి కడతామన్న ప్రభుత్వమే, ప్రజలకు ఉచితంగా నీరిస్తున్నామని ఇచ్చేసి, అసలు విషయాన్ని మరుగున పడేసింది. చివరకు ఆ అప్పు ప్రజలకు భారంగా మిగిలింది. ప్రజలకు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, ఖర్చు, ఆస్తులు, అప్పులు వంటి ప్రక్రియల గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల పాలకులు ఆడింది ఆటగా, పాడింది పాటగా మారతోంది. అందుకే ఈ భారీ లోటు బడ్జెట్ లు. ఎక్కడి నుంచే డబ్బులు వస్తాయని ఊహించి, కాకిలెక్కలతో మిగులు, అధిక కేటాయింపులు చూపించి, చివరకు ఎవరికీ ఏమివ్వకుండా చిప్ప చేతికిచ్చి, ఆదాయానికి మించిన ఖర్చులు, అప్పులు, వడ్డీలు చూపిస్తున్నారు నేటి పాలకులు.
ఇక ఈ నష్టాల బడ్జెట్ లు ప్రభావాలు కేవలం సర్కార్ కో, ఆయా సంస్థలకో పరిమితం కావు. అవి ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు, వేతనాలు కూడా ఇవ్వలేని దైన్యం దాపురిస్తుంది. అధిక వ్యయం, పన్నుల భారం, సేవలలో నాణ్యత లోపం, అనేక అభివ్రుద్ధి పనులకు ఆర్థిక అడ్డంకులు వంటి రూపాల్లో ప్రత్యక్షంగా సామాన్య ప్రజలపై పడతాయి.
అమెరికా, జర్మనీ, జపాన్ వంటి అభివ్రుద్ధి చెందిన దేశాలు ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు సంభవించినప్పుడు న్యాయ విచారణలు చేపట్టడం, వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం, వంటి చర్యలకు పూనుకుంటున్నాయి తప్పితే, మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా మౌనం పాటించడం లేదు. నెపాలు అన్యులపై నెట్టడం లేదు. నీతి లేని రాజకీయాల, నిజాయితీలేని రాజకీయాలు చేయడంలేదు. ఇది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, దేశానికి కూడా అంత మంచిది కాదు. దేశ, రాష్ట్రాల అంతర్గత, బహిర్గత సంక్షోభాలకు దారి తీసే ప్రమాదం ఉంది.
ఈ అంశాలపై మీడియా పాత్ర కూడా సంశయాత్మకంగానే కనిపిస్తోంది. పార్టీలకే మీడియా సంస్థలుండటం, మీడియా సంస్థలు పార్టీల వారీగా అనుకూలంగా, వ్యతిరేకంగా విడివిడిగా ఉండటం వల్ల వాస్తవాంశాలు కాకుండా, ఆయా పార్టీల అనుకూలాంశాలుగా వార్తా కథనాలు వస్తున్నాయి. దీంతో మీడియా తమకవసరమైన మేర తప్ప, అప్రమత్తంగా ఉండకపోవడం, కొన్నిసార్లు తప్పుడు వార్తలే రాయడం, సృష్టించడం, మౌనం పాటించడం వల్ల ప్రజలకు కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. సమస్య తాలూకు తీవ్రత అర్థం కావడం లేదు. మీడియా సంస్ధలు ప్రజా ప్రయోజనాలకంటే, స్వప్రయోజనాలకే మొగ్గు చూపడం వంటివి ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా మారింది.
పారదర్శకంగా పరిపాలన ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక లెక్కలను ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వాలకు జవాబుదారితనం ఉండాలి. పాలనా వైఫల్యాలపై నిజాయితీగా న్యాయ విచారణలు జరిపించాలి. ఆర్థిక పరిపుష్టి ఉన్నసంస్థలతో నష్ట సంస్థలను అనుసంధానించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ మేనేజ్మెంట్ తరహాలో నైపుణ్యంగా, జవాబుదారితనంతో పని చేసే వ్యవస్థను రూపొందించాలి. ఆర్థిక సంస్కరణలను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి. పాలకులు ఏకస్వామ్యంగా నడుపుతోన్న ప్రస్తుత ప్రజాస్వామిక వ్యవస్థలో ఆర్థిక నష్టాలకు, అసహనాలకు గురయ్యే ప్రజలు తిరుబాటు చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే తగిన శాస్తి తప్పదు.

