జీవితమే ఓ ఆట! అందుకే ఆటలకు జీవితంలో అంత ప్రాముఖ్యం. అందుకే ఆటలకు అంత ఆదరణ. ఆట జీవితాలకు అద్దం పడుతుంది. ఆటుపోటులు, గెలుపోటములు. పడి లేవడాలు, సర్దుకుపోవడాలు… గెలిచి తీరడాలు, ఓటమిని అంగీకరించడాలు, క్రీడా స్ఫర్తిని చాటడాలు… ఇలా జీవితంలో ఉండే నాటకీయ పరిణామాలన్నీ ఆటల్లో ఉంటాయి. పోనీ, ఆటల్లో ఉండే ఈ నాటకీయత జీవితంలోనూ ఉంటుంది. అన్ని ఆటల్లోకి క్రికెట్ ఎక్కువ మంది జీవితాల్లోకి వచ్చేసింది. క్రికెట్ ఆటని అంతా ఆస్వాదిస్తున్నారు. అందులోని మజాను అనుభవిస్తున్నారు. 1983లో వన్డే క్రికెట్ లో పురుషుల జట్టు ప్రపంచకప్ గెలిచిన నాటి ఆనందాన్ని 2025లో మహిళల జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా అంతా ఆనందిస్తున్నారు. నిజంగా ఈ రెండు మొట్టమొదటి కప్ లే కావడం విశేషం. కాగా, సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత మన మహిళలు సాధించిన ప్రపంచ టైటిల్, అది సాధించడానికి చూపిన పోరాట పటిమ భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా, గర్వకారణంగా నిలిచింది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
జీవితమే ఓ ఆట! అందుకే ఆటలకు జీవితంలో అంత ప్రాముఖ్యం. అందుకే ఆటలకు అంత ఆదరణ. ఆట జీవితాలకు అద్దం పడుతుంది. ఆటుపోటులు, గెలుపోటములు. పడి లేవడాలు, సర్దుకుపోవడాలు… గెలిచి తీరడాలు, ఓటమిని అంగీకరించడాలు, క్రీడా స్ఫర్తిని చాటడాలు… ఇలా జీవితంలో ఉండే నాటకీయ పరిణామాలన్నీ ఆటల్లో ఉంటాయి. పోనీ, ఆటల్లో ఉండే ఈ నాటకీయత జీవితంలోనూ ఉంటుంది. అన్ని ఆటల్లోకి క్రికెట్ ఎక్కువ మంది జీవితాల్లోకి వచ్చేసింది. క్రికెట్ ఆటని అంతా ఆస్వాదిస్తున్నారు. అందులోని మజాను అనుభవిస్తున్నారు. 1983లో వన్డే క్రికెట్ లో పురుషుల జట్టు ప్రపంచకప్ గెలిచిన నాటి ఆనందాన్ని 2025లో మహిళల జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా అంతా ఆనందిస్తున్నారు. నిజంగా ఈ రెండు మొట్టమొదటి కప్ లే కావడం విశేషం. కాగా, సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత మన మహిళలు సాధించిన ప్రపంచ టైటిల్, అది సాధించడానికి చూపిన పోరాట పటిమ భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా, గర్వకారణంగా నిలిచింది.
ఇటీవలి మహిళా క్రికెట్ కప్ విజేతల ప్రయాణం అందరికీ ఆదర్శం. ఆడిన వాళ్ళంతా దేశం కోసం ఎన్నో త్యాగాలతో చెమటోడ్చారు. దేశ కీర్తిపతాకను ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడించారు. ఐదు దశాబ్దాల కలను సాకారం చేశారు. ఆకాశమే హద్దుగా అద్భుత ప్రదర్శనతో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని అమ్మాయిల జట్టు ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచింది. అడ్డంకులన్నీ అధిగమించి, బలమైన దక్షిణాఫ్రికా జట్టును 52 పరుగులతో ఓడిరచడం ద్వారా భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. అయితే దీని వెనక ఒక్కో అమ్మాయి వ్యథా భరిత జీవితం ఉంది. క్రికెట్లో తాము రాణించడానికి వ్యక్తిగతంగా పడ్డ కష్టం ఎంతో ఉంది.
1973లో మనదేశంలో మహిళా క్రికెట్ సంఘం ఏర్పడిన తర్వాత అంతర్జాతీయ పోటీల్లో భారత మహిళల ప్రస్థానం మొదలైంది. తొలితరం క్రికెటర్లు సొంత బ్యాటు, కిట్టు లేకపోయినా, జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ సొంత డబ్బులపైనో, చందాలపైనో ఆధారపడి దేశం తరపున ఆడారు. ఆ తరువాత స్పాన్సర్లు ముందుకు రావడం, 2005లో బీసీసీఐ పరిధిలోకి రావడం, 2022లో పురుషుల, మహిళల జట్ల మధ్య వేతన సమానత్వాన్ని, మహిళల ప్రీమియర్ లీగ్ను ప్రవేశపెట్టడం, అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడే అవకాశం లభించడం, ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రావడం వంటి పరిణామాలతో మహిళల క్రికెట్ రాటుదేలింది.
వరుసగా రెండుసార్లు అండర్ 19 అమ్మాయిల జట్టు ప్రపంచకప్ నెగ్గడం, తాజాగా సీనియర్ జట్టు విజయం సాధించడం మహిళా క్రికెట్లో ఉజ్వల భవితకు పునాది. ప్రపంచకప్లో వరుసగా మూడు పరాజయాలతో డీలాపడిన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో అమోల్ మజుందార్ కోచ్గా, మెంటార్గా అందించిన ప్రోత్సాహం ఆటగాళ్లలో మానసిక దృఢత్వాన్ని తీసుకొచ్చింది. వన్డే ప్రపంచకప్ టైటిల్ కొట్టడంలో ఆటగాళ్ల పాత్ర ఎంత కీలకమో, తెర వెనుక కోచ్ పాత్ర అంతకుమించి కీలకంగా ఉంటుంది. క్రీడాకారిణుల ఫిట్నెస్, జట్టు ఎంపిక, కెప్టెన్, ఆటగాళ్లకు దిశా నిర్దేశం, ఆడుతున్న సమయంలో కెప్టెన్కు ఎత్తుగడలను చేరవేయడం.. ఇలా ప్రతి విభాగంలో కోచ్ పాత్ర మరువలేనిది. ఈ ప్రోత్సాహం, ప్రోద్బలం, వ్యూహాలు, వాటి అమలు, ప్రదర్శనల ఫలితమే వన్డే ప్రపంచకప్.
ఫైనల్ లో గెలిచిన వెంటనే టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పరిగెత్తుకొని వెళ్లి ఒక వ్యక్తి కాళ్లకు నమస్కరించి, ఆలింగనం చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వ్యక్తి, శక్తి మరోవరో కాదు, టీమిండియా హెడ్ కోచ్ అమోల్ మజుందార్. క్రికెటర్గా 21ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో ఏనాడూ జాతీయ జట్టుకు ఎంపకవ్వని ఆయన, ఇప్పుడు కోచ్గా మహిళా జట్టుకు దిశానిర్దేశం చేస్తున్న తీరు అభినందనీయం. ఈ విజయం వెనుక చోదక అతడే. మజుందార్ దేశవాళీ క్రికెట్ ఆడే క్రమంలో భారత క్రికెట్ జట్టులో మరో సచిన్ అవుతాడని భావించారు. సచిన్ కు జూనియర్ అయిన అమోల్, దేశానికి ఆడకపోయినా, దేశాన్ని ప్రపంచ విజేతగా నిలపడంలో అనన్య సామాన్యమైన విజయాన్ని సాధించాడు.
ఈ టోర్నీ సెమీ ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్, అప్పటికే ఓసారి ఓడించిన ఆస్టేల్రియా 338 రన్స్ చేయడంతో భారత్ ఓడిపోతుందని క్రీడా పండితులు అంచనా వేశారు. ప్రత్యర్థులంతా చుట్టుముడుతున్నా సహచరులు ఒక్కొక్కరు అవుటవుతున్నా అవరోధాలకు ఎదురొడ్డి ఆస్టేల్రియాపై అజేయంగా 127 పరుగులు చేసి భారత్ను ఫైనల్ కు తీసుకెళ్ళడంలో జెవిూమా రోడ్రిగ్స్ పోరాట పటిమను ఎంత పొగిడినా తక్కువే. అసలు టీమ్ లోనే లేని షెఫాలీ వర్మ, ఫైనల్ లో బ్యాట్ తోనే గాక, బంతితో ఆడిన ఆటను చూసి తీరాల్సిందే. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దీప్తి శర్మ ఆటకు ఆచ్చెరువొందకుండా ఉండలేం.
ఏపీ రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల నల్లపురెడ్డి శ్రీచరణి లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్గా 9 మ్యాచ్లు ఆడి, 14 వికెట్లు తీయడం ద్వారా ప్రపంచకప్లో నాలుగో స్థానంలో నిలవడం ద్వారా రాష్టాన్రికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు సైతం ఆమె బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడటం ఆమె నైపుణ్యానికి నిదర్శనం. 22 వికెట్లతో మన దేశానికే చెందిన దీప్తిశర్మ మొదటిస్థానాన్ని దక్కించుకుని, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను సొంతం చేసుకుంది. అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా వైస్ కెప్టెన్ స్మృతి మందాన నిలిచింది. గ్రూప్ దశలో బ్యాటింగ్లో స్మృతి మంధాన, ప్రతీకా రావల్, అమన్జోత్, రిచా ఘోష్, బౌలింగ్లో దీప్తి శర్మ, క్రాంతిగౌడ్, రేణుకాసింగ్ సత్తా చాటారు. ఫైనల్స్ లో షఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్, దీప్తి శర్మ ఆల్రౌండ్ షో, హర్మన్ ప్రీత్కౌర్ కెప్టెన్సీ ఇలా అందరి సమిష్టి కృషే జగజ్జేతగా నిలిపింది.
జట్టులోని చాలామంది దిగువ మధ్యతరగతివారే. శ్రీచరణి తండ్రి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిన్న ఉద్యోగి. గ్రామీణ నేపథ్యం నుంచి కెప్టెన్గా హర్మన్ ప్రీత్ ఎదిగింది, మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి, ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న రేణుక, పోలీస్ కానిస్టేబుల్ కుమార్తె క్రాంతిగౌడ్, తన తండ్రి చెక్కిన బ్యాట్తో కెరీర్ మొదలు పెట్టిన అమన్జోత్ లాంటి వారంతా అనేక కష్టాలను ఎదురొడ్డి నిలిచిన వారే. ఇన్ని కష్టాల మధ్య కుటుంబ సభ్యులు, కోచ్ల ప్రోత్సాహంతో రాణిస్తున్నారు.
క్రీడలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, క్రీడాకారులు రాణించడానికి కావలసిన ప్రోత్సాహం ప్రభుత్వాల నుంచి మరింతగా రావాలి. అప్పుడే క్రీడాకారులు రాణిస్తారు. ఆటలకు మరింత ఆదరణా పెరుగుతుంది.

