పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావం మన దేశంతోపాటు అన్ని దేశాలపైనా, మన రాష్ట్రాలు, చివరకు మన వంటింటి వరకు స్పష్టంగా కనిపిస్తోంది.
దేశంలో ఒక రోజుకు 55 వేల నుంచి 60వేల మెట్రిక్ టన్నులు వినియోగిస్తున్నాం. రోజుకు 40 లక్షల సిలిండర్లకు సమానం. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా 10–12% వరకు ఉంటుంది. ఏపీ (1.61 కోట్లు), తెలంగాణా (1.3 కోట్లు) ల్లో 3 కోట్ల కనెక్షన్లుండగా, ఏపీలో రోజుకు 2.8 కోట్ల ఎల్పీజీ సిలిండర్లను, తెలంగాణలో 2.15 ల సిలిండర్లను వినియోగిస్తున్నారు.
అయితే యుద్ధ ప్రభావం, సరఫరా లోపాలు, అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. సిలిండర్ ధర రూ.900–1000 మధ్యకు చేరుకోవడం సామాన్య ప్రజలపై భారంగా మారింది. మరోవైపు గ్యాస్ కొరతతో కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు కట్టెల పొయ్యిలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ స్టవ్ల వినియోగం పెరిగినా, నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడం సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది.
ఈ సంక్షోభంలో కీలకంగా నిలుస్తున్నది కెజి బేసిన్. ‘తలాపునే నీళ్ళు.. తలకు పోసే దిక్కులేదన్నట్లు’ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సహజవాయువు నిల్వలలో ఒకటైన ఈ బేసిన్ నుంచి రోజుకు 20 వేల నుంచి 21వేల టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతోందని అంచనా. అయితే ఈ ఉత్పత్తిలో గణనీయమైన భాగం రాష్ట్రానికి అందకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పైపులైన్ల ద్వారా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలకు గ్యాస్ సరఫరా చేస్తూ వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నది.
స్థానిక వనరులపై స్థానిక ప్రజల హక్కు ఎంతవరకు అమలవుతోంది? ఒకవైపు రాష్ట్రం సహజవనరులను అందిస్తుండగా, మరోవైపు ప్రజలు గ్యాస్ కొరత, అధిక ధరలతో ఇబ్బందులు పడటం అన్యాయమే. గ్యాస్ ఉత్పత్తిలో కనీసం 50 శాతం అయినా, రాష్ట్ర అవసరాలకు కేటాయిస్తే, ప్రస్తుత డిమాండ్లో పెద్ద భాగాన్ని తీర్చగల సామర్థ్యం కెజి బేసిన్ కు ఉంది.
12వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, సహజవనరుల వినియోగంలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఈ అంశంపై పెట్రోలియం శాఖను ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ, అమలులో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా ప్రతిఫలించలేదు.
గ్యాస్ కొరత ప్రభావం విద్యుత్ రంగంపైనా తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు సరైన ఇంధనం లేక మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో డిస్కంలు అధిక ధరలకు విద్యుత్ కొనాల్సి వస్తోంది. దీని ప్రభావం వినియోగదారులపై పడటం సహజం. అయితే కెజి బేసిన్ గ్యాస్లో కొంత భాగాన్ని రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తికి మళ్లిస్తే, యూనిట్ విద్యుత్ ధరను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.
రాష్ట్ర రాజకీయ నాయకత్వం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించి, రాష్ట్రానికి తగిన వాటా సాధించేందుకు కృషి చేయాలి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి నాయకులు కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని బలంగా కేంద్రానికి చేర్చాలి. అవసరమైతే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం అవసరం.
ఇక ప్రజా ఉద్యమాలు కూడా కీలకం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రజా సంఘాలు, సంస్థలు సహజవనరులపై హక్కుల కోసం పోరాడిన అనుభవం ఉంది. అదే స్పూర్తితో మళ్లీ చైతన్యం అవసరం. “మన గ్యాస్ మనకే” అనే నినాదం కేవలం భావోద్వేగం కాకుండా, ఆర్థికంగా కూడా బలమైన వాదనగా నిలుస్తుంది.
సహజవాయువు కేవలం వనరు మాత్రమే కాదు. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన ఆధారం. సరైన విధానాలతో వినియోగిస్తే గ్యాస్ ధరలను రూ.300–350కి తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అలాగే పీఎన్జీ సరఫరా విస్తరించి గృహ వినియోగాన్ని మరింత సులభతరం చేయవచ్చు.
సహజవనరుల వినియోగంలో సమన్వయం అవసరం. జాతీయ ప్రయోజనాలను కాపాడుతూ, రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉత్పత్తి అవుతున్న సహజవాయువులో తగిన భాగం రాష్ట్ర ప్రజలకు అందితే, గ్యాస్ కొరత, విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది సాధ్యంకావాలంటే ప్రభుత్వ సంకల్పం, రాజకీయ చిత్తశుద్ధి, ప్రజా ఒత్తిడి… ఈ మూడు కలిసికట్టుగా పనిచేయాలి.

