భక్తుల స్మరణతో పులకించిన సోమన్న గుట్ట
ఘనంగా సోమన్న కళ్యాణం
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని
సోమన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు
జనగామ జిల్లా, పాలకుర్తిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పారవశ్యంతో కళకళలాడింది. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ప్రధాన వీధులు, రాజీవ్ చౌరస్తా నుంచి గుడివాడ చౌరస్తా వరకు రాత్రంతా భక్తుల రద్దీ కనిపించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా సమీప జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే సుమారు మూడు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు చెప్తున్నారు. కల్యాణోత్సవాన్ని లక్షకు పైగా భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు.
భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న, ఇతర ఆలయ అధికారులు గత మూడు రోజుల నుండి ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇచ్చాయి. కానీ భక్తుల రద్దీ పెరగడంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన తల్లులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్ వంటి అంశాల్లో సరైన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం సఫలీకృతమైందని కొందరు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని చేసినా… భక్తులలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. “ఓం నమశ్శివాయ” నినాదాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శర్మ, అర్చకులు డివిఆర్ శర్మ, అనిల్ కుమార్ శర్మ, మత్తగజం నాగరాజు శర్మ, నాగరాజు శర్మ, సునీల్ శర్మ, సంతోష్ శర్మ, శ్యామ్ శర్మ, తదితర అర్చకులు శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయం రాత్రంతా కిటకిటలాడగా, భద్రతా పరంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసిపి నర్సయ్య, సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సైలు,తదితర సిబ్బంది, 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
మహా అన్నదానం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి సహకారంతో పాలకుర్తిలో 10 వేల మందికి మహా అన్నదానం నిర్వహించారు. క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న విశాలమైన ప్రాంగణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కుమారస్వామి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా భారీ ఎత్తున భక్తులు స్వీకరించారు. పలువురు దాతలు వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. మొత్తంగా మహాశివరాత్రి సందర్భంగా పాలకుర్తి ఆధ్యాత్మిక క్షేత్రంగా మారి భక్తి భావంతో కళకళలాడింది.


