ఎదురుదాడి రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీలు ఆరితేరినట్లు కనిపిస్తున్నాయి. తాము చేసిన తప్పులు, అప్పుల గురించి ఎవ్వరూ చర్చించుకోవద్దన్న స్వార్థంతో ఈ రెండు పార్టీలు ఎదుటి పార్టీలపై బురదజల్లాలనే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. ఏపీలో అప్పులు చేసి, బటన్ నొక్కుళ్లతో రాష్ట్రాన్ని దివాళా తీయించి, సొంత ఖజానా నింపుకున్న వైసీపీ, తెలంగాణలో ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని అప్పులు చేసి, అవీనీతికి కేరాఫ్ అడ్రస్ గా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమ నిలువలు పెంచుకున్న పార్టీ బీఆర్ఎస్ లు ప్రజల మనసుల్లో చెరిపేయలేని ముద్రను వేసుకున్నాయి. విచిత్రంగా ఆ రెండు పార్టీలు కుటుంబ పాలననే సాగించాయి. ఆ రెండు పార్టీలూ ఒకే కుటుంబానికి చెందినవి కాగా, ఆ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డట్లుగా ఆరోపణలు ఎదర్కొంటుండటం విశేషం. ఆ రెండు కుటుంబాలకు చెందిన పార్టీల బ్యాంకు బాలెన్స్ పెరగడం, లక్షల కోట్లకు వారి కుటుంబాల ఆస్తులు పెరగడమే ఇందుకు నిదర్శనంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రాలు దివాళా తీసి, వాళ్ళ కుటుంబాలు మాత్రం లక్షల కోట్లకు పడగలెత్తడమే అందరినీ ఆశ్చర్యపరస్తున్న అంశాలు.
ఇదిలా వుంటే, ఆ రెండు కుటుంబ పార్టీలను ప్రజలు తిరస్కరించారు. వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజాతీర్పుని వెలువరించారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు సహజంగానే వాళ్ళ అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు విచారణలు చేపట్టాయి. నివేదికలు కూడా వస్తున్నాయి. ఈ నివేదికలు మరింత నివ్వెర పరస్తున్నాయి. ఈ దశలోనే దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా ఆ పార్టీలు, ఆ కుటుంబాలు నానా గగ్గోలు పెడుతున్నాయి. లెక్కకు మిక్కిలి అప్పులు చేసి ఇప్పుడేమో, అక్రమాలకు పాల్పడి, అవినీతితో పాలన చేసి, ఇప్పుడు మాకా సంగతే తెలియదన్న రీతిలో గందరగోళం చేస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ మౌనం దాలుస్తారు. ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి నోరు తెరుస్తారు. నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటారు. ఇక వారి కుమారుడు కీటీఆర్, అల్లుడు హరీశ్ రావు లు నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతుంటారు. ఈ మూడేళ్ళు గడిస్తే, మళ్లీ తమదే అధికారం అన్న అతిశయంతో, తర్వాత ఇవేవీ బయటపడవన్న దీమాతో మాట్లాడుతున్నారా? అనిపిస్తోంది. తమంత తాముగా వాళ్ళే పెంచి పోశించకుని, శత్రువుగా మార్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవేవీ పట్టించుకోకుండా, వారి అవినీతిని వెలికితీసే పనిలో పడ్డారు. దీంతో వారి అవినీతి అక్రమాలు వెలువడక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది.
అయితే, వీటి అన్నింటిపై నుంచి ప్రజల ఆలోచనలను తప్పించడమే లక్ష్యంగా రోజుకో అంశాన్ని ఎంచుకుని నోళ్ళను నెత్తిపై పెట్టుకుంటున్నారు. గురుకులాలు, హాస్టళ్లు, రైతులు, బనకచర్ల, విద్యుత్ పంపిణీ వంటి అనేక అంశాలపై వీరు చేస్తున్న విమర్శలు అంతా చూస్తున్నవే. నిజంగానే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇవన్నీ బాగా ఉండి వుంటే, ఈ ఏడాదిన్నర, రెండేళ్ళల్లోనే రాష్ట్రం ఇంత నాశనం అయిందా? అన్న అనుమానాలు రాకమానవు. అన్నింటికీ మించి లక్ష కోట్ల కాళేశ్వరం ఏమైంది? ఎందుకలా అయింది? ముడుపులు ముడితే చాలు ఏమయితే మనకేంటన్న ధోరణిలోనే కాళేశ్వరం కూలేశ్వరం అయిందా? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే ఇవన్నీ ప్రజలు చర్చించుకోవద్దన్న భావనలో రోజూ బనకచర్లను ముందుకేసి విమర్శలు చేస్తున్నారా? ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎం ప్రజల్లోకి రావడమెందుకు, ఆయన ప్రజలను కలవాల్సిన పనేముంది? అని వాదించిన కేటీఆర్ ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.
ఏపీలో జగన్ తీరు కూడా దాదాపు ఇలాగే ఉంది. అయితే కాళేశ్వరం నివేదిక చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి సీఎం కేసీఆర్ పాత్రే కీలకమని జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ తేల్చింది. హరీశ్రావు, ఈటల రాజేందర్ సహా, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, కార్యదర్శి జోషీ, ఈఎన్సీలు, సీఈ వంటి అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంటూ నివేదిక రూపొందించింది. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదని తెలిపింది. బ్యారేజీలపై ముందుగానే నిర్ణయం తీసుకొని.. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సీడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజీల నిర్మాణానికి ముందు భూ భౌతిక పరీక్షలను శాస్త్రీయ్ర ప్రమాణాలతో జరపలేదని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన కమిషన్ గురువారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. దానిని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని, మంత్రివర్గ ఉపసంఘం వేసినా.. దీనికి, ఆ బ్యారేజీలకు సంబంధమే లేదని కమిషన్ తేల్చిందని తెలుస్తోంది. వీటి గురించి కేటీఆర్, హరీశ్ మాట్లాడరు. నోరులేని గొర్రెల పంపిణీలో వేయికోట్ల మోసం అంటే వీళ్ళు ప్రజల్ని గొర్రెలుగా చూశారా? ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేయకుండా వారి నమ్మకాన్ని బీఆర్ఎస్ దెబ్బతీయడం కాక మరేంటి? ప్రభుత్వమే ఒక కుటుంబానికి వ్యాపార సామ్రాజ్యంగా మారిందనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి?
బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకే గట్టిగా రంకెలు వేస్తోంది. ఒక్కో అవినీతి బయటపడ్డ కొద్దీ జీర్ణించుకోలేక పోతున్నది. పరిపాలనలో తప్పులు జరిగితే వాటిని వెలికితీయడం లేదా ప్రశ్నించడం మీడియా బాధ్యత, కానీ మీడియా ఆ బాధ్యతను నెరవేరుస్తన్నదా? కొందరికి తాబేదారులుగా మారి, తమ మనుగడ కోసం ప్రజల మనుగడను బలిపెట్టే అధికారం నేతలకే కాదు మీడియాకు కూడా లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ పత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా మీడియా మీద చేసిన వ్యాఖ్యలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రతిస్పందించలేదు. మీడియా సంఘాలు కార్మిక సంఘాలకంటే దిగజారి పోయాయా? నిజంగానే మీడియా దిగజారిందా? పైగా సీఎం అన్నదాంట్లో తప్పేముంది? అనే ధోరణి మీడియా వర్గాల్లోనే వ్యక్తం అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రశ్నించాల్సిన వేళ్ళు ముడుచుకుపోతే రేపటి భవిష్యత్తేంటి? అధికారంతోనే పోలీసులు సహా, అధికారులు అంటకాగుతున్నారు. నేతలు అవినీతిలో కలిసి పోతున్నారు. మీడియా కూడా వాళ్ళతో కలిసిపోతే ఎలా? ఇక్కడ బీఆర్ఎస్, వైసీపీల పాలననను తిడుతున్నామంటే, కాంగ్రెస్, కూటమి పాలనను సమర్ధిస్తున్నామని కాదు. ఎవరు తప్పు చేసినా? ప్రజల కోణంలోంచి దోషులే? ప్రజల తరపున ప్రశ్నించాల్సిందే. అయినంత మాత్రాన ఎవరికో వ్యతిరేకమో, మరెవ్వరికో అనుకూలమో అని కాదు. ప్రజల్ని చైతన్యం చేయడం, వారి తరపున మాట్లాడటం, నిలువడం, నిలదీయడం అంతా ప్రజల కోసమే, ప్రజాస్వామ్యం కోసమే.
…..

