దేశంలో, రాష్ట్రాల్లో పేరుకుపోతున్న అవినీతిని అరికట్టడానికి ఏసీబీ, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. అలాగే రాజకీయ అవినీతిని అరికట్టడానికి లోక్ పాల్, లోకాయుక్త వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. అదికార పార్టీలకు కీలు బొమ్మల్లా పై నిఘా సంస్థలు పని చేస్తున్నాయన్న విమర్శలున్నప్పటికీ ఎంతో కొంత మేర అవి పని చేస్తున్నాయి. కానీ రాజకీయ అవినీతిని నిర్మూలించడం సంగతి అటుంచి, నియంత్రించే పనిని కూడా లోక్ పాల్, లోకాయుక్త సంస్థలు చేయలేకపోతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తుంటాయి. చివరకు అవి కూడా రాజకీయాధికారం చెప్పుచేతుల్లోనే బందీ అవుతుండటం అత్యంత విచారం, విషాదం.
ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ వంటి అవినీతి నిరోధక సంస్థలు విడుదల చేసే నివేదికల ప్రకారం, మన దేశంలో అవినీతి స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి, 2024లో ప్రపంచ అవినీతి అవగాహన సూచీ (సీపీఐ) ప్రకారం భారత్ 180 దేశాలలో 96వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా తీసకుంటే దేశంలో వరసగా రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, యూపీ, తెలంగాణలున్నాయి. ఏపీ 13వ స్థానంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అవినీతిని పరిశీలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికంగా అవినీతి జరిగిందని తేలింది. 67శాతం మంది లంచాలిచ్చే పనులు చేసుకున్నామని, 27శాతం మంది పలుమార్లు లంచాలిచ్చామని సర్వేలో చెప్పారు. అంటే 94శాతం మందికి లంచాలతోనే పనులయ్యాయన్నమాట! ఇందులో అధికారుల అవినీతికంటే రాజకీయ అవినీతిదే అగ్రస్థానం అని వేరే చెప్పక్కరలేదు.
అవినీతి నిర్మూలనకు దేశంలో అనేక చట్టాలున్నాయి. అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు, సమాచార హక్కు చట్లం, ప్రజా వేగుల చట్టం, లోక్ పాల్, లోకాయుక్త చట్టం వంటివెన్నో ఉన్నాయి. కానీ అవినీతి నిర్మూలన లేదా నియంత్రణ మాత్రం జరగకపోగా, పెరుగుతూ ఉన్నది. పాలకుల్లో ప్రధానంగా ఆర్థిక నియంత్రణ లేకుండా పోతోంది. దుబారా ఖార్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేతలు తమ రక్షణకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. జీత భత్యాలు కూడా విపరీతమే. మరోవైపు బంధుప్రీతి, అవినీతి, లెక్కకు మించిన ఆదాయాలు, ఎన్నికల్లో ఖర్చు చేయడం, తిరిగి సంపాదించుకునే పనిలో ఉండటం వంటివెన్నో కారణాలున్నాయి. ఒక్కసారి అధికారం అందితే చాలు తరతరాలు బతికేంతగా సంపాదించడమే పనిగా రాజకీయ నేతలు పని చేస్తున్నారు.
ఇక ఓట్ల కోసం అలవిగాని హామీలివ్వడం, వాటిని అమలు చేయడం ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. వాటిని అమలు చేసే క్రమంలో మళ్ళీ అవినీతే చోటు చేసుకుటున్నది. అవినీతి చుట్టూ రాజకీయం, రాజకీయం చుట్టూతా అవినీతే పెనవేసుకుని కనిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుబరా చేయడం, దుర్వినియోగం చేయడం మాములైపోయింది. అధికారంలో ఉండగా అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించడం, నియంతృత్వంగా ప్రజాధనాన్ని మంచినీళ్ల కంటే అధ్వాన్నంగా ఖర్చు పెట్టడం చేస్తున్నారు. ఒక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అవినీతి అక్రమాలకు లెక్కలేకుండా పోతోంది. అధికారంలో ఉండగా చేసిన తప్పులన్నీ, అధికారం పోయాక వెలుగు చూస్తున్నాయి. కాకపోతే, వారికి తగిన శిక్షలే పడటం లేదు. రాజకీయ అవినీతి కేసులేవీ నిలవడం లేదు. దొందూ దొందే అన్నట్లు, తోడు తొంగల్లాగా అధికార, విపక్షాలు ఒకరినొకరు సహకరించుకుంటూ, కాపాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు.
రాజకీయ అవినీతిని పూర్తిగా అరికట్టడం కష్టమైనప్పటికీ, ఎంతో కొంత తగ్గించడానికి, నియంత్రించడానికి చేసిన చట్టాలే వారికి చుట్టాలైపోతున్నాయి. అయినప్పటికీ కొన్ని పద్ధతుల్లో అవినీతిని అరికట్ట వచ్చు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచాలి. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి, అధికారుల జవాబుదారీతనాన్ని పెంచాలి. అవినీతి నిరోధక చట్టాలను కఠినంగా రూపొందించి అమలు చేయాలి. అవినీతిపరులకు కఠినమైన శిక్షలు పడితే మిగతావారు అవినీతికి పాల్పడకుండా ఉంటారు. లోక్పాల్, లోకాయుక్త వంటివ స్వతంత్ర సంస్థలను సమర్థవంతంగా పనిచేయనివ్వాలి. అవినీతి నిర్మూలనలో ప్రజలు, పౌర సమాజ సంస్థలు భాగస్వామ్యాన్ని పెంచాలి. సాంకేతికతను వినియోగించుకోవాలి. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్, ఆన్లైన్ చేయడం వల్ల కూడా అవినీతిని అరికట్టవచ్చు. ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా నైతిక విలువలను పెంపొందించాలి.
అయితే, తాజా గణాంకాలింకా అందుబాటులోకి రానప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వాలను అభినందించడం కాదు కానీ, గత ప్రభుత్వాల హయాంలో అవినీతి అధికంగా జరిగినట్లుగా సర్వే సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో గత 12 ఏళ్ళుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. కాబట్టి గత, ప్రస్తుత అవినీతికి ఆ కూటమి తప్పకుండా బాధ్యత వహించాల్సిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలిస్తే, 2023 నవంబర్ వరకు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో 2014లో చంద్రబాబు, 2019లో జగన్, తాజాగా మళ్ళీ చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కొద్ది అటు ఇటుగా మారుతున్నప్పటికీ, దాదాపుగా రెండు కూటమిలు, రెండు మూడూ పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ప్రభుత్వ, రాజకీయ అవినీతికి ఆ పార్టీలు, వాటిని నడుపుతున్న నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అంటే ఆ పార్టీలు లేదా ఆ పార్టీలను నడిపే నాయకులే అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాలను అవినీతి మయం చేశారు. చేస్తున్నారు. అంతేగాక దేశాన్ని, రాష్ట్రాలను దోచుకున్నారనే నిజం మింగుపడటం కష్టమే. అయితే ఒకవైపు అవినీతి, మరోవైపు దోపిడీ, ఇంకోవైపు అప్పులు చేసి దివాళా తీయించడం లాంటి అన్నింటికీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ కంటే కూడా అటు ప్రపంచం ముందు దేశాన్ని, దేశం ముందు రాష్ట్రాల పరువును అవినీతి మయంగా తీసేసిన మన పార్టీలు, మన నాయకులను బోనెక్కించాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకోవాలి. అంతకంటే ముందు వారికి ప్రజాక్షేత్రంలోనేగాక, చట్ట పరిధిలో కూడా శిక్షలు పడేలా చేయాలి. అందుకు తగిన చట్టాలతోపాటు, అవినీతి నిర్మూలనకు నడుం కట్టే నవ యువ నాయకత్వం రావాల్సి ఉంది.

