ప్రపంచ జనాభా ఇప్పటికే 800 కోట్లు దాటింది. భారతదేశ జనాభా అధికారికంగా 146కోట్లకు చేరుకుంది. చైనా పకడ్బందీ జనాభా నియంత్రణతో 2వ స్థానానికి చేరుకుంది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని, 1989లో ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా జనాభాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు1989 జూలై 11వ తేదీన ’ప్రపంచ జనాభా దినోత్సవాన్ని’ నిర్వహించడం మొదలు పెట్టింది. ఆనాటి నుండి ప్రతి ఏటా జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు వంటి వివిధ జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడం ప్రపంచ జనాభా దినోత్సవం లక్ష్యం. 2025 ఏడాదికి ‘న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో యువతకు వారు కోరుకున్న కుటుంబాల్ని స్రుష్టించే అధికారాన్ని ప్రసాదించడం’ అనే థీమ్ ని నిర్ణయించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మన దేశం (146 కోట్ల జనాభా) మొదటి స్థానంలో ఉంది. చైనా (142 కోట్ల జనాభా) రెండో స్థానంలో ఉంది. వరసగా అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, ఇథియోపియా దేశాలు మిగతా స్థానాల్లో ఉన్నాయి. జనాభా వృద్ధి రేటులో భారత దేశం 4వ స్థానంలో ఉండగా, చైనా -0.23శాతం ఉండటం విశేషం. ప్రపంచ జనాభాతో పోల్చినప్పుడు భారత దేశ వృద్ధిరేటు 18.3 శాతం ఉండగా, చైనా వృద్ధి రేటు 17.7శాతంగా నమోదైంది.
ఇక దేశంలో జనాభా పెరుగుదలలో రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వరసగా మొదటి పది స్థానాలను ఆక్రమించాయి.
అధిక జనాభా ఆహారం, నీరు, గృహనిర్మాణం, ఉద్యోగాల కొరత వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థలపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అధిక జనాభా వల్ల పర్యావరణ, కాలుష్య సమస్యలు కూడా సంభవిస్తాయి. అధిక జనాభాను అరికట్టడానికి అవగాహన, కుటుంబ నియంత్రణ, స్థిరమైన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే, అధిక జనాభా ప్రభావం భవిష్యత్ తరాల జీవన ప్రమాణాలకు ముప్పు కలిగిస్తుంది.
ముఖ్యంగా మన దేశంలో స్థిరమైన అభివృద్ధి వైపు పయనించాలంటే జనాభా నియంత్రణ అత్యంత కీలకం. జనాభా నియంత్రణ లేకుండా, సహజ వనరులు, ఉద్యోగాలు, గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటివి సాధించడం అసాధ్యమవుతుంది. జనాభా నియంత్రణ ద్వారా పేదరికాన్ని నిర్మూలించగలం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచవచ్చు.
మనం నివసిస్తున్న ఈ భూమొత్తాన్ని ఉపయోగించుకోవాల్సిన వనరుగా కాకుండా, సంరక్షించాల్సిన ఇల్లుగా పరిగణించాలి. లింగబేధం లేకుండా అందరికీ విద్యను అందించాలి. ప్రతి ఒక్కరూ గౌరవంగా, భద్రత, సమాన అవకాశాలతో జీవించగలిగే సమాజాన్ని సృష్టించాలి.
నియంత్రణ లేకపోవడంతో ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగి పోతున్నది. పెరిగిన జనాభా వలన పలు ప్రపంచ దేశాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రజలకు కనీస మౌలిక సదుపా యాలు కల్పించ లేక సతమతమ వుతున్నాయి. విద్య,వైద్యం,ఆరోగ్యం, త్రాగునీరు, పారిశుధ్యం వంటి అనేక అంశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నాయి. పెరుగుతున్న జనాభా కారణంగా కనీస వసతుల కల్పన ఏ ప్రభుత్వానికైనా తలకుమించిన భారంగా మారుతోంది. గృహకల్పన, అక్షరాస్యత, నిరుద్యోగం, పౌష్ఠికాహారం, ఉద్యోగ కల్పన వంటి అంశాలు విషమ సమస్యలుగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలతో అనేక దేశాలు సతమతమవు తున్నాయి. చాలా దేశాల్లో ఈనాటికీ కనీస విద్య గగనకుసుమంలా మారింది. ఆహార సమస్యతో అనేక దేశాలు అలమటిస్తున్నాయి.
మనదేశంలో త్వరలోనే జన, కుల జన గణన జరుగనుంది. జనాభాపై పూర్త క్లారిటీ రానుంది. పెరుగుతున్న జనాభాకనుగుణంగా మన ప్రభుత్వాలు ఏం చేయనున్నాయన్నది కీలకంగా మారనుంది. జనాభా నియంత్రణపై దృష్టి సారించాలి. లేకుంటే దేశ వనరులు బతకడానికి కూడా సరిపోవు. జనభా నియంత్రణపై మన ప్రభుత్వం చైనా లాగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యానికి ఇంకా దూరంగా వుండడానికి అధిక జనాభాయే కారణం. అయితే కొన్ని అంశాలలో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్నా…నేటికీ సామాన్యులకు అది కలగానే మిగిలింది. ఫార్మా, వ్యాక్సిన్ల రంగాల్లో ముందంజ వేస్తున్నా, జనాభాకు సరిపడా అందించలేని దుస్థితిలో ప్రపంచం ఉంది. అధిక జనాభా ఆరోగ్యరంగం అసమానతలకు కారణంగా మారింది. ప్రపంచంలో జనాభా పెరుగుదలను కట్టడి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు లేకపోవడం ఈ దారుణానికి కారణంగా చూడాలి.
ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టడం లేదు. దీంతో పెరుగుతున్న జనాభాతో వనరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇది వెంటనే చర్చించాల్సిన అతిపెద్ద సమస్యగా చూడాలి. జనాభా పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయని గుర్తించాలి. ప్రతి కుటుంబం తమకు తాముగా జనాభా నియంత్రణకు కట్టుబడాలి. ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేయాలి.

