దేశ ప్రజల ఆకలి బాధలు, జీవన ప్రమాణాల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండానే కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్ను యథావిధిగా ప్రవేశపెట్టింది. రూ. 53.47 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కాగితాల మీద భారీగా కనిపించినా, సామాన్య ప్రజల జీవితాల్లో ప్రతిఫలించేదేమిటి? గత తొమ్మిదేళ్లుగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ల ఫలితాలను సమగ్రంగా పరిశీలిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థలో సమతౌల్య అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఆస్కారమే లేకుండా పోతోంది.
ప్రస్తుతం దేశంలో ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆర్థిక మందగమనం. జాతీయ స్థాయిలో వినియోగం తగ్గిపోవడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసర వస్తువుల నుంచి ఔషధాల వరకు ధరలు విపరీతంగా పెరిగాయి. కోవిడ్ అనంతరం, కొన్ని కీలక ఔషధాల ధరలు 200 నుంచి 500 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ డేటా సూచిస్తోంది. ఫలితంగా వైద్యం చేయించుకోవడం దూరమైతే, కనీసం మందులు కొనుగోలు చేసే స్థితిలోనూ సామాన్యుడు లేకుండా పోయాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజంగా ప్రగతిశీలమైతే, దాని ప్రభావం ప్రజల జీవితాల్లో కనిపించాలి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆశించిన మార్పు రావడం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడంతో గ్రామాల నుంచి పట్టణాల వైపు వలసలు పెరుగుతున్నాయి. సంపాదించిన ఆదాయం తిండికే సరిపోని పరిస్థితి విస్తరిస్తోంది. గ్రామీణ వినియోగం తగ్గిన తీరే ఇందుకు నిదర్శనం.
ఈ బడ్జెట్లో మరో ప్రధాన అంశం ఆర్థిక క్రమశిక్షణ. కార్పొరేట్లు, కోటీశ్వరులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సినప్పుడు ఈ క్రమశిక్షణ గుర్తుకు రాలేదు. కానీ కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ వ్యయాలు పెంచాల్సిన సందర్భంలో మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముందుకు వచ్చింది. ఫలితంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు కేటాయింపుల్లో కోతలు పడ్డాయి. మహిళా సంక్షేమం కోసం ఉద్దేశించిన జెండర్ బడ్జెట్ నిధుల్లోనూ కోత పడటం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తోంది.
బడ్జెట్పై ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇచ్చే నిపుణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగం, అధిక ధరలు, జీవన వ్యయాల పెరుగుదల తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిలో ఆదాయ పన్ను, జీఎస్టీ మార్పులతో కొంతమేర ఉపశమనం కల్పించిన ప్రభుత్వం, ఈసారి వాటి జోలికి వెళ్లకపోవడం మధ్యతరగతిపై భారాన్ని మరింత పెంచింది. పరోక్ష మినహాయింపులు ప్రకటించినా, అవి ప్రజల జేబుల్లోకి డబ్బు తెచ్చే స్థాయిలో ఉంటాయా? అన్నది అనుమానమే.
అయితే, బడ్జెట్లో కొన్ని ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. కేన్సర్ చికిత్సకు ఉపయోగించే 17 కీలక ఔషధాలపై దిగుమతి సుంకాల మినహాయింపు, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మరో 7 ఔషధాలపై సుంకాల తగ్గింపు నిర్ణయం ఊరట కలిగించే అంశం. ఇవి ఔషధాల ధరలను తగ్గించి బాధితులకు ఉపశమనం కలిగించే అవకాశముంది. కానీ ఇది సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానానికి ప్రత్యామ్నాయం కాదన్నది గుర్తించాలి.
ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించిన ‘సంస్కరణల ఎక్స్ ప్రెస్’, ‘మూడు కర్తవ్యాలు’ గత తొమ్మిదేళ్లుగా విన్న పదాలే. కానీ, వాటి ఫలితాలు గ్రామాల్లో, పేదల జీవితాల్లో ఎందుకు కనిపించడం లేదు? ఇంకా కోట్లాది మందికి ఉచిత బియ్యం అందించాల్సిన పరిస్థితి ఉంటే, దేశ ఆర్థిక బలం గురించి గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాల్సిన అంశమే.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోకుండా, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోకుండా ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా భారత పురోగతి కాగితాలకే పరిమితం అవుతుంది. ‘సంస్కరణల ఎక్స్ ప్రెస్’ వేగం పెరిగిందని చెప్పడం కంటే, ఆ ఎక్స్ ప్రెస్ ఎవరిని తీసుకెళ్తోంది? ఎవరిని వదిలేస్తోంది? అన్నదే తేలాల్సిన ప్రశ్న? మరి సమాధానం మన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా?

