భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై, డిసెంబర్ 19న ముగిశాయి. ఈ సెషన్, దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలం జరిగినవాటిలో ఒకటిగా నిలిచింది. అతి ముఖ్యమైన అంశాలు చర్చకు రాకుండాపోయి, చర్చలేకుండానే బిల్లులు ఆమోదం పొందిన అరుదైన సెషన్ కూడా ఇదేనేమో! ప్రధాని, ప్రతిపక్ష నేతలు లేకుండానే ముగిసిన సెషన్ కూడా ఇదే!! ఈ స్వల్పకాలిక సెషన్లో 13 బిల్లులు ఆమోదం పొందాయి. ముఖ్యంగా అణుశక్తి, ఉన్నత విద్య, ఉపాధి హామీ చట్టం, పన్నులకు సంబంధించిన బిల్లులు చర్చకు వచ్చాయి. ఉపాధి హామీ పేరు మార్చి జీ రాం జీ చట్టం వచ్చింది. అయితే, ఈ చర్చల్లో ఢిల్లీ కాలుష్యం వంటి కీలక అంశాలను విస్మరించడం కూడా విశేషమే.
తొలి రోజు నుంచే గందరగోళం, ఆందోళనలు, వాకౌట్లు, ధర్నాలతోనే సమావేశాలు సాగాయి. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వం, పాలకపక్షాలతోపాటు, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్షాలు కూడా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించలేకపోయాయి. ఒకప్పుడు పార్లమెంటులో విపక్షాలదే పైచేయిగా ఉండేది. ఈసారి విపక్షాల్లో చొరవలేమి, అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపించాయి. ఫలితంగా అధికార ఎన్డీఏ కూటమి తనకు అనుకూలమైన అజెండాతోనే సునాయసంగా సమావేశాలను నడిపించి, ముగించింది.
వందేమాతరంపై ఇష్టానుసారంగా చర్చించిన, ప్రభుత్వం, ఎన్నికల సంస్కరణలపై చర్చను తూతూ మంత్రంగా ముగించింది. 9 రాష్టాల్రు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న రెండవ విడత ఓటర్ల జాబితా సవరణ పై ఎన్నికల సంస్కరణ పేరుతో చర్చించినా విపక్షాలు సఫలం కాలేదు. దేశంలో సర్ కారణంగా 11 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినా, ఎవరి ఓటు ఎలా ప్రభావితమవుతుందో అర్థం చేయలేకపోయారు.
సెల్ఫోన్ల ద్వారా వ్యక్తుల రహస్యాలను సేకరించేందుకు ఉద్దేశించిన ’సంచార్ సాథి’ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించి, ప్రతిఘటనతో వెనక్కు తగ్గారు. 71 పాత చట్టాలను రద్దు లేదా సవరణ చేసే మరో బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లు, రక్షణ వైఫల్యాలు, ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వ చర్యల గురించి పార్లమెంట్కు చెప్పాల్సిన బాధ్యతను ప్రభుత్వం, చెప్పించాల్సిన బాధ్యతను విపక్షం విస్మరించింది. ‘వికసిత్ భారత్’ రాజధాని ఢిల్లీలో ఒకరోజు నివసిస్తే 15 సిగరెట్లు కాల్చిన దానికి సమాన నష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇంతటి కాలుష్య నియంత్రణను కూడా వదిలేశారు. డాలర్తో మారకంలో రూపాయి విలువ 91 రూపాయలకు పడిపోవడం వల్ల ముడిచమురు, పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, కనీస ప్రస్థావనకు రాలేదు.
ఇక కార్మిక చట్టాల సవరణలు, 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించిన బిల్లు, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించినా, చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. 1962 నాటి అణుశక్తి, 2010 నాటి పౌర అణు నష్టబాధ్యత చట్టాలను సవరిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించారు. అణుశక్తి, బీమా వంటి వ్యూహాత్మక, కీలక రంగంలోకి తమకిష్టమైన కార్పొరేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చి అణురక్షణ, దేశ భద్రతను ప్రమాదంలో వేశారు. అణు ప్రమాదాల సమయంలో పౌరులకు చెల్లించాల్సిన నష్టపరిహార బాధ్యతను కంపెనీల ఇష్టానికి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో జరిగిన పేలుళ్లు, రక్షణ వైఫల్యాలు, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై కూడా కేంద్రం సమగ్ర వివరణ ఇవ్వలేదు.
కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించి 5 వేల విమాన సర్వీసులను రద్దు చేసి దేశ ప్రతిష్టను దిగజార్చిన ప్రైవేట్ విమాన సర్వీసు ’ఇండిగో’ గురించి, హెచ్1 బి వీసా, సుంకాల పెంపు, రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రభావంపై చర్చ జరగనేలేదు. ఇవన్నీ చర్చించి, ప్రజల మనసులు గెలవాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ అనుభవ రాహిత్యం, ఆయన అనుచరుల వ్యూహాత్మక తప్పిదాల కారణంగా అనేక సమస్యలు ఎప్పటిలానే వెనకబడి పోయాయి. ఇందుకు ప్రభుత్వాన్ని నిందించడం కన్నా, విఫలం అయినందుకు విపక్షాన్ని విమర్శించాల్సిందే. దునుమాడాల్సిందే.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ, అనేక కీలక అంశాలు చర్చించాల్సిన సమయంలో, ప్రధాని మోదీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ విదేశీ పర్యటనల్లో ఉండటం విమర్శలకు దారితీసింది. వారు తమ ప్రధాన బాధ్యతను విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తంగా ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, రాజకీయ వ్యూహాలు, అనుభవ రాహిత్యం మధ్య శీతాకాల సమావేశాలు ముగియడం ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ పాత్రపై ఆందోళనను కలిగిస్తున్నాయి.

