ఇటీవల కాలంలో భారత రూపాయి విలువ పతనం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ రూపాయి బలహీనపడటం సామాన్య ప్రజల నుంచి ఆర్థిక నిపుణుల వరకూ చర్చనీయాంశంగా మారింది. దిగుమతులు అధికమవడం, ఎగుమతులు తగ్గిపోవడం, వాణిజ్య లోటు పెరగడం వంటి అంతర్గత కారణాలతో పాటు, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు కూడా రూపాయి పతనానికి దోహదమవుతున్నాయి.
గత పదేళ్ళల్లో రూపాయి విలువ దాదాపు వంద శాతం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు డాలర్కు రూ.45 నుంచి రూ.50ల మధ్య ఉన్న మారకం రేటు ఇప్పుడు రూ.91లకు చేరడం ఆర్థిక పరంగా ఆందోళనకరమే. అయినప్పటికీ ప్రభుత్వం, అధికార, ఆర్థిక వర్గాల మౌనం అనుమానాలకు తావిస్తోంది. రూపాయి పతనాన్ని మనం తేలిగ్గా తీసుకోవాలా? లేక ఇది రాబోయే ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలకు సంకేతమా?
ఇటీవల ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆల్టైమ్ కనిష్ఠాలను నమోదు చేసింది. కేవలం పది ట్రేడింగ్ సెషన్లలోనే డాలర్ మారకంలో రూపాయి విలువ 90 నుంచి 91కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఐదు సెషన్లలోనే ఒక శాతం మేరకు నష్టం వాటిల్లింది. సాధారణంగా డాలర్ బలహీనత లేదా క్రూడాయిల్ ధరల తగ్గుదల రూపాయికి కొంత ఊరటనిచ్చే అంశాలే. కానీ ఈసారి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు తగ్గినా, రూపాయి పతనం ఆగకపోవడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో నెలకొన్న అనిశ్చితి కూడా రూపాయి పతనానికి ఒక ప్రధాన కారణంగా మారింది. భారత్ ప్రతిపాదనలను అమెరికా అంగీకరించలేదన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఒప్పందాలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయన్న భయాలు విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచాయి. ఇదే సమయంలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ ప్రత్యక్ష జోక్యం లేకపోవడంతో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించుకోవడం పరిస్థితిని మరింత దారుణంగా, కఠినంగా మార్చింది.
అయితే, ఈ పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంఠ్ మిశ్రా వంటి ఆర్థికవేత్తలు రూపాయి మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. భారత్ వద్ద 68 వేల 500 కోట్ల నుంచి 69వేల కోట్ల డాలర్ల మేర భారీ విదేశీ మారకపు నిల్వలు ఉండటం దేశ ఆర్థిక బలం అని వారు పేర్కొంటున్నారు. ఈ నిల్వలు ఉండటం వల్ల తాత్కాలిక ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం భారత్కు ఉందన్నది వారి వాదన.
భారత ప్రభుత్వం కూడా రూపాయి పతనానికి ప్రధాన కారణంగా వాణిజ్య లోటునే చూపుతోంది. రాజ్యసభలో ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి, ‘రూపాయి విలువను మార్కెట్ నిర్ణయిస్తుందని, ప్రభుత్వం ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదని’ స్పష్టం చేశారు. రూపాయి బలహీనత వల్ల ఎగుమతులు మరింత పోటీగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దిగుమతుల వ్యయం పెరిగి ద్రవ్యోల్బణం సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేం.
ఇదిలా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా డాలర్ ఆధిపత్యంపై చర్చ తీవ్రమవుతోంది. అమెరికా తనకు అనుకూలంగా లేని దేశాలపై డాలర్ను ఆయుధంగా ఉపయోగిస్తూ ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది. రష్యా, ఇరాన్, వెనెజువెలా వంటి దేశాలపై విధించిన ఆంక్షలు దీనికి ఉదాహరణ. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇతర దేశాలు డాలర్పై ఆధారపడటం తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. రష్యా ఇప్పటికే చైనా, భారత్ తదితర దేశాలతో స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం చేస్తోంది.
భారత్ కూడా ఈ దిశగా ఇప్పటికే 30 దేశాలతో రూపాయిలో లావాదేవీల కోసం ప్రత్యేక ఖాతాలు తెరిచింది. సింగపూర్, యుఏఈ, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో యూపీఐ చెల్లింపులు విస్తరిస్తున్నాయి. అయితే రష్యాతో వాణిజ్యంలో దిగుమతులే అధికంగా ఉండటంతో రూపాయలు అక్కడి బ్యాంకుల్లో నిలిచిపోతున్నాయి. వాటిని భారత్లో పెట్టుబడులుగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఒక్కసారిగా డాలర్కు దూరమైతే, చమురు వంటి కీలక దిగుమతుల ధరలతోపాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే డాలర్ ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించుకోవడమే వాస్తవిక మార్గం. ప్రస్తుతం ప్రపంచ లావాదేవీల్లో సుమారు 47శాతం డాలర్ ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి మరికొంతకాలం డాలర్ ఆధిపత్యం కొనసాగడం అనివార్యం.
ఈ పరిస్థితుల్లో భారత్ బలమైన ఎగుమతి వ్యూహం, వాణిజ్య లోటు నియంత్రణ, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రూపాయిని ముందుగానే బలోపేతం చేసుకుంటేనే, భవిష్యత్ ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలం.

