ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. సంక్షోభం తలెత్తి వారం గడస్తున్నా పరిష్కారాలేవీ లేకపోవడం, పైగా రోజు రోజుకు మరిన్ని విమాన సర్వీసులు రద్దవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 350 సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన 70, ఇక్కడి నుండి వెళ్ళాల్సిన 74 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇది ఇండిగో వైఫల్యంగానే కనిపిస్తోంది. ఇండిగో నిర్వాహకుల తప్పిదాలే ఈ సంక్షోభానికి కారణంగా కనిపిస్తోంది. ఈ సమస్య తలెత్తేనాటికి ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లంతా విదేశాల్లో ఉన్నట్లుగా తేలింది. అయితే సంక్షోభం తలెత్తిన నాటి నుండే బోర్డ్ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఇండిగో ప్రకటించింది.
ఇదిలా వుండగా, విమానాల రద్దు సమస్యకు ఇండిగోనే కారణమని భారత పౌరవిమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానంగా చెప్పారు. ఇండిగో ఎయిర్ లైన్స్ క్రూ, ఇంటర్నల్ ప్లానింగ్ లోపం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఎఫ్డీటీఎల్ అమలు చేయడంతో ఎలాంటి సమస్యా లేదన్నారు. ‘నెల రోజులుగా ఇండిగో సంక్షోభంపై విమానయానశాఖ పరిశీలిస్తూనే ఉంది. డిసెంబర్ 1న సంక్షోభం తీవ్రమైనప్పుడు యాజమాన్యంతో చర్చించాం. ఎలాంటి సమస్యా లేదు. కానీ, హఠాత్తుగా డిసెంబర్ 3న క్రైసిస్ పెరగింది. ఈ సమస్యను విచారిస్తున్నాం, తేలికగా తీసుకోమని’ ఆయన హెచ్చరించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతోందన్న అనుమానాలను కూడా మంత్రి వ్యక్తం చేశారు.
ఇండిగో ఎయిర్ లైన్స్ భారత దేశానికి చెందిన చౌకైన విమానయాన సంస్థ. గుర్గావ్ దీని ప్రధాన కేంద్రం. ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రాహుల్ భాటియా, అమెరికాలోని ఎన్ఆర్ఐ రాకేష్ ఎస్. గాంగ్వాల్ కలిసి 2006 లో ఇండిగోను స్థాపించారు. ఇంటర్ గ్లోబ్ సంస్థకు ఇండిగోలో 51.12% వాటా, గాంగ్వాల్ కు చెందిన సేలం ఇన్వెస్టిమెంట్ కంపెనీకి 48% వాటా ఉన్నాయి. 2014 డిసెంబరు నాటికే 36.1% వాటా కలిగిన అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగింది. ఎయిర్ బస్ A320 కుటుంబానికి చెందిన 91 విమానాలు ఈ సంస్థలో ఉన్నాయి. భారత వైమానిక మార్కెట్ వాటాలో నాలుగో వంతుతో, కేవలం 6 ఏళ్ళల్లోనే ఇండిగో ఘనత సాధించడం విశేషం. ఇతర దేశాల్లోని 37 కేంద్రాల నుంచి ప్రతి రోజూ 550 విమానాలతో ఇండిగో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ పాత విమానాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది. 2015, ఫిబ్రవరి 6 నాటికి ఇండిగో నడిపిస్తోన్న వాటిలో 91 విమానాల సగటు విమాన వయస్సు కేలం 2.9 ఏళ్ళే. అనేక అవార్డులూ రివార్డులూ గెలుచుకుంది.
అయితే, డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకు సాధారణంగా ఉన్న వ్యవస్థ, ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణాలపై విమానాయన సంస్థ లోతుగా దర్యాప్తు చేస్తున్నది. నిజానికి ఇండిగోలోనే అత్యధికంగా 2,260 మంది పైలెట్లు ఉన్నారు. పెరుగుతున్న డిమాండ్కనుగుణంగా ఇండిగో ఎయిర్ బస్ నుంచి 100 విమానాలు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా 500, ఆకాశ 100, స్పైస్ జెట్ కూడా 50 విమానాలు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాయని తేలింది. ప్రస్తుతావసరాలకు అనుగుణంగా రెండు, మూడు సంస్థలు అనుమతి పొందినా. మార్కెట్ లో విమానాలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు విమానయాన సంస్థల్లో ఆహారం, నీరు, టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, సీటు కోసం మళ్లీ నగదు వసూలు చేస్తున్న వ్యవహారంపైనా పూర్తి విచారణ జరగాల్సి ఉంది. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు రిఫండ్ చేసే విషయంలోనూ పౌర విమానయాన శాఖ చర్యలు తీసుకోవాలి.
ఇండిగో సంక్షోభం దేశ విమానయాన రంగంలోని లోపాలను మరోసారి బయటపెట్టింది. 140 కోట్ల జనాభా ఉన్న జనాభాకనుగుణంగా విమానయాన వ్యవస్థ విస్తరణ జరగకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడం, ప్రైవేట్ రంగంపై నియంత్రణ లేకపోవడం విమానయాన రంగాన్ని బలహీనపరుస్తున్నాయి. పైలట్లు, సిబ్బంది కొరత లేకున్నా, సంస్థలు సంక్షోభాల్లోకి ఎందుకు జారుతున్నాయన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు కావాలి.
వరుసగా చోటు చేసుకున్న బాంబు బెదిరింపులు, సాంకేతిక సమస్యలు, కార్యకలాపాల లోపాల వంటివన్నీ చూస్తూ, ఏదో పెద్ద కుట్ర కోణం దాగి ఉందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. సమగ్ర దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికి తీయాలి.
ఇండిగో సంక్షోభం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, విమానాయాన సంస్కరణలకు అవకాశం కూడా. ఇప్పటికైనా విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధానాలు రూపుదిద్దాలి. లేకపోతే రాబోయే రోజుల్లో చిన్న చిన్న లోపాలే పెద్ద పెద్ద సంక్షోభాలుగా మారే ప్రమాదం తప్పదు.

