మావోయిస్టుల చరిత్ర ముగిసిందా? ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఇప్పుడు గతచరిత్రగా మిగిలిపోనుందా? ప్రజా సంబంధాలు, వారి సమస్యలపై పోరాటం ఉన్నంత వరకు వారు బలంగా ఉన్నారు. ప్రజల అండదండలతో ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. మారిన ప్రపంచ పరిస్థితులు, పెరిగిన సాంకేతిక, నిర్బంధంతో, అడవికే పరిమితమై, ప్రజలకు దూరమైన సాయుధ మావోయిస్టులు.. జరుగుతున్న మానవ, మారణహోమంలో సమిధలైపోతున్నారు. సమూల మార్పుల కోసం ఆయధం పట్టిన అన్నలు సమూలంగా చంపబడుతున్నారు. భారత దేశంలో అనేక ఉత్థాన పతనాలు చూసిన మావోయిస్టు విప్లవోద్యమం అంతర్థానం అవుతోందా? అంతరించిపోతోందా?
సమస్యలున్నంత వరకు తిరుగుబాట్లు, ఉద్యమాలుంటాయన్నది నిజమే కానీ, వేళ్ళ మీద లెక్కకు తక్కువ ఉన్న నేతలతో ఉద్యమం కొనసాగుతుందా? అసలు వాళ్ళు బతికే ఉంటారా? రాజ్యం బతకనిస్తుందా? ఒకవేళ బతికే ఉన్నా విప్లవోద్యమానికి తిరిగి పూర్వ వైభవం తేగలరా? అది సాధ్యమేనా?
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
మావోయిస్టుల చరిత్ర ముగిసిందా? ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఇప్పుడు గతచరిత్రగా మిగిలిపోనుందా? ప్రజా సంబంధాలు, వారి సమస్యలపై పోరాటం ఉన్నంత వరకు వారు బలంగా ఉన్నారు. ప్రజల అండదండలతో ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. మారిన ప్రపంచ పరిస్థితులు, పెరిగిన సాంకేతిక, నిర్బంధంతో, అడవికే పరిమితమై, ప్రజలకు దూరమైన సాయుధ మావోయిస్టులు.. జరుగుతున్న మానవ, మారణహోమంలో సమిధలైపోతున్నారు. సమూల మార్పుల కోసం ఆయధం పట్టిన అన్నలు సమూలంగా చంపబడుతున్నారు. భారత దేశంలో అనేక ఉత్థాన పతనాలు చూసిన మావోయిస్టు విప్లవోద్యమం అంతర్థానం అవుతోందా? అంతరించిపోతోందా?
1927లో చైనా అంతర్యుద్ధం సమయం నుంచి ఇప్పటి దాకా ప్రపంచంలో చైనా, బర్మా, దక్షిణ వియత్నాం, లావోస్, నికరాగువా, మలేషియా, థాయిల్యాండ్, ఖ్మేర్ రిపబ్లిక్, ఫిలిప్పీన్స్, టర్కీ, బ్రెజిల్, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్, పెరూ, ఇరాన్, ఇక్వెడార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి అనేక దేశాల్లో మావోయిస్టులు ఇంకా విస్తరించి, ఉనికిలో ఉన్నారు. భారత దేశంలో 1967లో మే 18న పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరిలో ప్రారంభమైంది. చారు మజుందార్, కానూ సన్యాల్, జంగల్ సంతాల్ ల నేతృత్వంలో మే 25, 1967న నక్సల్బరి గ్రామంలో స్థానిక అధికారులు ఒక భూమి సమస్య విషయమై ఒక గిరిజనునిపై దాడి చేయడంతో ప్రారంభమైంది. గిరిజనులు వ్యతిరేకవర్గమైన భూస్వాములపై తిరుగుదాడి చేయటంతో హింస హెచ్చరిల్లింది. 1969లో శ్రీకాకుళంలో నక్సల్బరీ మొదలైంది. మజుందార్ నాయకత్వానికి వ్యతిరేకంగా సత్యనారాయణ సింగ్ తిరగబడటంతో 1971లో సి.పి.ఐ(ఎంఎల్) రెండుగా చీలింది. 1980 ఏప్రిల్ 22న కొండపల్లి సీతారామయ్య, కొల్లు చిరంజీవిలు పీపుల్స్ వార్ ని స్థాపించారు. తర్వాత తొమ్మిది రాష్ట్రాలలోని 76 జిల్లాల నుండి 12 రాష్ట్రాలలో 118 జిల్లాలకు వ్యాపింపజేశారు. ఆతర్వాత 160 జిల్లాలకు దేశంలో ఐదో వంతు అటవీ భాగానికి విస్తరించింది. రెండు ప్రముఖ నక్సలైటు వర్గాలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) పీపుల్స్ వార్ (పి.డబ్లు.జి), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎం.సి.సి.ఐ) ఏకమై 2004 సెప్టెంబరు 21న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది.
ఈ ఉద్యమం మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంతాలపై ఆధారపడి, సాయుధ పోరాటం ద్వారా ప్రభుత్వ వ్యవస్థను కూల్చివేసి, సమసమాజాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాలక్రమేణా ఇది దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది.
కొండపల్లి సీతారామయ్య మొదలు, గణపతి వరకు పీపుల్స్ వార్ బలమైన విప్లవపార్టీగా వెలుగొందింది. వరంగల్ ఆర్ఈసీ, రాడికల్స్ ఉత్పత్తి కర్మాగారంగా మారింది. గ్రామస్థాయిలో ప్రజల మన్ననలు పొందింది. ఉద్యమాన్ని నిర్మించింది. నాయకులు గ్రామాలకు వెళ్లాలంటేనే భయపడేలా చేసింది. భూకామంధులు పట్టణాలకు పారిపోయారు. ప్రజల్లో చైతన్యం తేవడం, వారికి అండగా ఉండటం ద్వారా బలమైన విప్లవపార్టీగా నిలిచింది. కాలక్రమంలో పరిస్థితులు మారాయి. ఉద్యమం కూడా మారింది. సమాజంలో సమస్యలు సమసిపోవడమో, తగ్గిపోవడమో జరుగుతుండగా, ప్రజల్లో వచ్చిన మార్పులు ఉద్యమ ప్రభావాన్ని, ప్రాభవాన్ని తగ్గిస్తూ వచ్చాయి.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం1977 నాటికి భారత దేశంలో 59.07 శాతం మంది దారిద్య్రంలో ఉంటే, ఇది 2022 నాటికి 5.25 శాతానికి తగ్గింది. 1960ల చివర్లో ప్రారంభమైన హరిత విప్లవం 1980ల చివరినాటికి ఆహార కొరత సమస్య నుంచి బయటపడటానికి దారి తీసింది. అంతకు ముందు మావోయిస్టులకి సన్నిహితంగానో, సానుకూలంగానో ఉన్న మేధావి వర్గం మద్దతు తగ్గిపోయింది. 2009లో బాలగోపాల్ తన ఈపీడబ్ల్యూ వ్యాసంలో, ‘‘దాదాపు 40 ఏళ్ల నక్సలైట్ ఉద్యమాన్ని పునరావలోకనం చేస్తే, ఎంత తక్కువగా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగలిగారు, అడ్డుకోగలిగారు అనేది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది’’ అని రాశారు.
నక్సలైట్లకు మధ్యతరగతి ప్రజలు దూరమయ్యారు. ఏదో ఒక పని, విదేశీవిద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయి. ప్రజాస్వామ్యంలో సాయుధ పోరాటమేంటని ప్రశ్నించేవారు పెరిగారు. 1990ల్లో స్త్రీ, దళిత అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నాయి. అంబేద్కరిజం బలపడుతూ వచ్చింది. కోబాడ్ గాంధీ చెప్పినట్లు, ‘ఉద్యమం తన లక్ష్యాలను సాధించలేకపోవడానికి కేవలం అంతర్గత బలహీనత ఒక్కటే కాక, సంక్లిష్ట సామాజిక సన్నివేశం, రాజ్యానికున్న అమితమైన బలం’ కారణాలయ్యాయి. ఇందుకు ‘తగిన ఎత్తుగడలు వేయడంలో విఫలం, కులాన్ని తగిన రీతిలో అడ్రస్ చేయలేకపోవడమన్నది ఉద్యమంలో ప్రాథమిక లోపమని, అట్టడుగు వర్గాలను ఈ పోరాటంలోకి తీసుకురాగల అవకాశాలను ఇది దెబ్బతీసింద’ని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
2004 నాటి శాంతి చర్చల విఫలం, ఉద్యమానికి తీవ్ర నష్టం చేశాయి. సాంకేతికత పెరిగి నక్సల్స్ ఉనికి రాజ్యానికి తెలిసిపోవడం మొదలైంది. నక్సల్స్ వ్యతిరేక ‘సాల్వాజుడుం’ను సుప్రీం కోర్టు వ్యతిరేకించగా, ఆదివాసీ యువకులతో ఏర్పడిన ‘డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు’తో ఆదివాసీలే ఆయువు పట్టుగా ఉన్నమావోయిస్టులకు తమ వేలుతో తమ కన్నే పొడుచుకున్నట్లయింది.
మార్చి 2026 కల్లా దేశంలో మావోయిజమే లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. 2000-2025 మధ్య 5ఏళ్ళల్లో, మావోయిస్టు సంబంధిత హింసలో 4,128 మంది పౌరులు, 2,717 మంది భద్రతాసిబ్బంది, అలాగే 4,944 మంది మావోయిస్టులు, గుర్తించని వారు 252 మంది కలిపి మొత్తం 12,041 మంది మరణించారు.
ఒకవైపు రిక్రూట్మెంట్లు పూర్తిగా ఆగిపోయాయి. ఉన్నవారు అడవులకు పరిమితం అయ్యారు. నిర్బంధాల వల్ల విస్తరణ లేకుండా పోయింది. అగ్రనేతల దూరదృష్టి లోపం, విభేదాలు, లొంగుబాట్లు.. ఇలా అంతా కలసి నిర్వీర్యం అయ్యింది. నమ్ముకున్న గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరుతో మట్టుపెట్టడం కూడా మావోయిస్టులకు నష్టం చేసింది.
తాజాగా హిడ్మా ఎన్కౌంటర్తో అగ్రనేతలంతా మట్టికరిచినట్లే. కొందరు లొంగిపోయారు. మరికొందరు నేలకొరిగారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ ఎక్కడ? అన్నది అంతుచిక్కకుండా ఉంది. సమస్యలున్నంత వరకు తిరుగుబాట్లు, ఉద్యమాలుంటాయన్నది నిజమే కానీ, వేళ్ళ మీద లెక్కకు తక్కువ ఉన్న నేతలతో ఉద్యమం కొనసాగుతుందా? అసలు వాళ్ళు బతికే ఉంటారా? రాజ్యం బతకనిస్తుందా? ఒకవేళ వారు బతికే ఉన్నా, విప్లవోద్యమానికి తిరిగి పూర్వ వైభవం తేగలరా? అది సాధ్యమేనా?

