ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టళ్ళుగా మారుతున్నాయి. ఉమ్మడి ఏపీలోలాగే, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ పెద్దగా మార్పేమీ లేదు. హాస్టళ్ళ ఏర్పాటు, వసతులు, సదుపాయాల కల్పన, ఆహారం, చదువులు, పుస్తకాలు, కాపీలు, నిర్వహణలన్నీ ఓ కల్పనగానే మిగిలిపోతున్నాయి. పైగా ఉన్నతాధికారులు, ప్రభుత్వాల అజమాయిషీ లోపంతో కొందరు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయింది. పిల్లల పేరు చెప్పి కొందరు పందికొక్కుల్లా బలుస్తున్నారు. వార్డెన్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్ళల్లో కాలం వెళ్లదీస్తున్న పిల్లల జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని అయోమయం నెలకొంది. అమ్మాయిలైతే బలవంతపు అత్యాచారాలకు గురవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కురుపాం మండల కేంద్రంలోగల గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇద్దరు బాలికలు చనిపోవడం, 138 మంది పచ్చ కామెర్లతో హాస్పిటల్ పాలు కావడం సంక్షేమ హాస్టళ్ళలోని పరిస్థితులకు, నిర్వహణా తీరుకు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు అద్దం పడుతున్నది. క్వాంటం కంప్యూటింగ్, ఎఐ అంటూ నిత్యం వల్లె వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ హాస్టళ్ళ దుస్థితి కనిపించకపోవడం దురదృష్టకరం.
గురుకులాలు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో ఎక్కువ శాతం కనీస సౌకర్యాల లేవు. బాలికల వసతి గృహాలు సరిపడినన్ని లేక, ఉన్నవి అత్యంత దయనీయంగా వున్నాయి. బోధన, వసతి, సదుపాయాలు అన్నింటికీ ఒకటి రెండు గదులతో సరిపుచ్చు తున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎ.ఎన్.ఎం లు లేరు. గురుకులాలలో ఉన్నప్పటికీ తగిన మందులు, సౌకర్యాలు లేవు.
పాలకులు మారుతున్నా పరిస్థితులు మారడం లేదు. వార్డెన్ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన లేనందున ఉపాధ్యాయులే ఒకవైపు బోధన మరోవైపు, పిల్లల బాధ్యత చూస్తున్నారు. మెడికల్ ఖర్చు భరించేందుకు తగిన నిధిని సమకూర్చడం లేదు. పిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు గాని, టీచర్లు గాని ప్రత్యేకంగా లేకపోవడం వల్ల పిల్లల మానసిక, శారీరక, విద్యా, వైద్య తదితర అంశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
సరైన ఆహారం ఉండదు. సరైన వసతి ఉండదు. నాసిరకం ఆహారంతో వాంతులు విరేచనాలతో పిల్లలు హాస్పిటల్స్ పాలు కావడం, అందులో కొందరు మృత్యువాత పడడం, తల్లిదండ్రులకు క్షోభ మిగులుస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళు అధ్వాన్నంగా ఉన్నాయి. గత పాలన, పదేళ్ళ పాలన, ప్రస్తుత పాలనలో చర్విత చరణంగా అవే తప్పులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం, ప్రతిపక్షంలోకి రాగానే గగ్గోలు పెట్టడం మన పాలకులకు అలవాటైపోయింది. ఏపీలోనూ ఇదే తతంగం నడుస్తోంది. విద్య, వైద్యానికి పెద్దపీట వేయాల్సిన పాలకులు ఓట్ బ్యాంకు రాజకీయాలతో సంక్షేమ, ఉచిత పథకాలను కొనసాగిస్తున్నారు.
మారుమూల అటవీ ప్రాంత గిరిజనులకు అక్షరాస్యత అందించాలనే లక్ష్యంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 గిరిజనులకు విద్య, రక్షణ, సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. గిరిజనుల విద్య కోసం ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పి గాలికి వదిలేస్తున్నారు. గిరిజనుల వైద్యాన్ని కూడా పట్టించుకోవడం లేదు. నేటికీ డోలీల్లో సుదూర ప్రాంతాలకు వైద్యానికి గిరిజనులు వెళుతున్నారు. మన్నానికి జ్వరమొచ్చిందనే వార్తాలు ఇంకా వస్తూండటం పాలకులకు సిగ్గుచేటు. షెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రకటించింది. అయినా వారి గూడాలకు నేటికీ రోడ్డు లేదు. చదువు, వైద్యం లేదు. ఈ నిర్లక్ష్యం సంక్షేమ హాస్టళ్ళపై కూడా కొనసాగుతున్నది. ఆశ్రమ పాఠశాలల్లో తాగునీరు లేక, మరుగుదొడ్లు లేక రోగాల బారినపడి చనిపోయిన ఘటనలను చూస్తున్నాం.
నిజానికి గిరిజనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందివ్వాలి. తద్వారా సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టాలి. బడులు లేక, ఉన్నా బడుల్లో టీచర్లు లేక, అసంపూర్ణ భవనాలు, చాలీచాలని వసతుల దుస్థితికి స్వస్తి పలకాలి. విష జ్వరాలు, పచ్చకామెర్లు, మలేరియా వంటి అనారోగ్యాలతో పిల్లలు పిట్టల్లా రాలిపోవడాన్ని తక్షణమే అరికట్టాలి. ఎప్పటికప్పుడు మౌలిక వసతులు కల్పనకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, పోషక విలువలతో కూడిన మెనూ చార్జీల పెంపునకు నిధులు ఇవ్వాలి. భావి భారత ఆశాకిరణాలైన పిల్లల భవిష్యత్తుపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆ భావి భారతాన్ని నేటి నుంచే తీర్చిదిద్దడం మొదలు పెట్టాలి.

