బంకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి బీజం వేసింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది.
వందేమాతర గీతం వరసను మారుస్తూ, గాడి తప్పిన పాలకులు దీన్ని ప్రేరణగా తీసుకుని భారత పునరుజ్జీవానికి అంకితం కావాలి. కేవలం గీతాలాపనతో సరిపుచ్చక భారత ఉజ్వల భవిష్యత్కు ప్రేరణగా తీసుకోవాలి. దేశం ముందు వందనం చేయడంతో పాటు, సంకల్ప సిద్ధి కోసం వందేమాతరం గీతాన్ని ఆలపించాలి. స్వదేశీ స్వయం సమృద్దికి నేటికీ, రేపటికి, ఎప్పటికీ వందేమాతరం ప్రేరణ మంత్రంగా నిలవాలని ఆశిద్దాం.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
1875లో కార్తీక శుక్ల నవమి, జగద్ధాత్రి పూజనాడు పురుడు పోసుకున్న వందేమాతరం గీతం, అదే ఏడాది నవంబర్ 7న, దాన్ని రాసిన బంకించంద్ర చటర్జీ తన ‘బంగ్ల దర్శన్’ అనే సాహిత్య పత్రికలో ప్రచురించారు. 1882 లో ఆయన రాసిన నవల “ఆనంద మఠ్”లో కూడా ఈ గేయాన్ని చేర్చారు. ఈ పాట స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతంగా, సందేశంగా మారింది. 1896లో రవీంద్రనాథ్ ఠాగోర్ ఈ పాటను భారత జాతీయ కాంగ్రెస్ కోల్కతా సమావేశంలో గాత్రంగా ఆలపించారు. 1905లో బెంగాల్ విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో ఈ పాట ప్రత్యేక ప్రేరణగా నిలిచింది. బ్రిటిష్ పాలకులు ఈ గీతాన్ని పాఠశాలల్లో పాడటాన్ని నిషేధించారు. అయినా ఈ పాట భారతావనిని ఏకం చేసింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, 1950 జనవరి 24న జరిగిన భారత రాజ్యాంగ సమావేశం ‘వందే మాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించింది.
వందేమాతర గీతానికి 150 ఏండ్లు కావస్తున్న సందర్భంగా 2025 నవంబర్ 7నుండి ఏడాది పాటు ‘ఒక మెలోడి ఒక చలనం’ పేరిట దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు, వివిధ చోట్ల విద్యార్థుల సమూహాలతో, జాతీయ చైతన్య ర్యాలీలు, ప్రదర్శనలు జరగనున్నాయి.
‘వందే మాతరం’ అన్నపదాలు మాతృభూమికి సలాం చేస్తూ.. భాష, ప్రాంతం, మతాన్ని దాటే ఒక వసుధైక భావనగా మారాయి. బంకించంద్ర ఛటర్జీ కలం నుంచి జాలువారిన వందేమాతర గీతం…స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.
స్వాతంత్రోద్యమ సమయంలో వందేమాతర గీతం మంత్రంగా పని చేసింది. దేశవ్యాప్తంగా మనం, మన దేశం, మన సార్వభౌమత్వం అనే ఉత్తేజాన్ని నింపింది. బ్రిటిష్ వారిని పారదోలేందుకు ఇది ఎంతగానో తోడ్పడింది. ప్రజలను ఏకం చేయడంలో వందేమాతర గీతం ఏక సూత్రంగా పని చేసింది. ఎక్కడిక్కడ వందేమాతరం గీతాలాపనతో ప్రజలు ఉద్యమంలో దుమికారు.
వందేమాతర గీతంలో భారతదేశ పురాతన సాంస్కృతిక మూలాలు ఈ గీతరచనకు ప్రేరణనిచ్చాయి. సర్వ మంగళ మాంగళ్యే శివే… అంటూ సాగే దేవీమాత స్తోత్రం వందేమాతరం గీతానికి ప్రేరణగా భావిస్తారు. అందుకే కొందరు దీనిని పాడడానికి ఇప్పటికీ ఇష్టపడరు. ఇది మనదేశ దౌరభాగ్యంగా చూడాలి. మతం ముసుగులో కొందరు దీనిని తృణీకరించినా అది ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఉత్తేజిత గీతంగా నిలిచింది. భారతదేశ చరిత్రలో మహోద్యమాలకు కళలూ పాటలూ అంతరాత్మగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాటే పరవళ్లు తొక్కింది. జాతి భావోద్వేగాలను వెన్నుతట్టి స్వాతంత్య్ర కాంక్ష అనే సమిష్టి కార్యాచరణకు పురిగొల్పడంలో వందేమాతరం గీతం కీలకభూమిక పోషించింది. అందుకే భారత స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ప్రత్యేకమైనదిగా వందేమాతరం గీతం నిలిచింది.
స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి బీజం వేసింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది. మహర్షి అరవిందుడు వర్ణించినట్లు బంకించంద్రుడు ఆధునిక భారత రుషి. ఆయన పదాలు జాతి ఆత్మను మళ్లీ మేల్కొలిపాయి. నిదురిస్తున్న జాతి తన ఆత్మబలాన్ని కూడగట్టుకుని, జాగృతం చేయడంలో వందేమాతరం గీతం ప్రముఖ భూమిక పోషించదనడంలో సందేహం లేదు.
బ్రిటిష్ పాలకుల ఇనుప ఉక్కు సంకెళ్ల కింద నలిగిపోతున్న తరుణంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం జాతికి ప్రభాత గీతమైంది. మన సంస్కృతి, నాగరికతల పట్ల గర్వాభిమానాలను రేకెత్తించే గానమైంది. అణువణువునా మాతృభూమిపై భక్తి, అనురక్తి ఉట్టిపడేలా మేల్కొలిపే రణనినాద గీతమైంది. వందేమాతరం భాషా ప్రాంతీయ భేదాలకు అతీతంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతిని జాగృతం చేసింది. 1946లో తిరుగుబాటు చేసిన రాయల్ ఇండియన్ నేవీలోని భారతీయ నావికులు వందేమాతరం అని నినదిస్తూ బ్రిటిష్ యుద్ధనౌకలపై జాతీయ పతాకను ఆవిష్కరించారు.
ఇన్నేళ్లయినా వన్నె తగ్గకుండా మనజీవితాల్లో అది పెనవేసుకుపోయింది. భారతజాతిని కలసి ఉంచే గీతంగా నిలిచింది. స్వాతంత్య్ర ఉద్యమంలో వెలిగిన ఈ గీతాజ్యోతి ఇంకా జాజ్వలామానంగా వెలుగుతోంది. ఇప్పుడు ఏడాది ఉత్సవాల్లో భాగంగా వందేమాతరం పూర్తి రూపంలో ప్రతిధ్వనిస్తూ యువత మనసుల్లో సాంస్కృతిక జాతీయవాదాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. వందేమాతరం కేవలం గత వైభవ స్మరణం, సంస్మరణం కారాదు. మనజాతిని మేల్కొలిపే ఉజ్జ్వల భవిష్యత్తుకు ప్రేరణగానూ తీసుకోవాలి.
భారత ఆత్మను ఆవహించుకునే గీతం కావాలి. వందేమాతరం పారతంత్ర భారతదేశానికి తొలి మేల్కొలుపు. మొక్కవోని దీక్షను చాటిన స్వేచ్ఛా గీతమది. భారతదేశపు ఆత్మ నుంచి జనించిన ఈ గీతం అజరామజరంగా నిలుస్తుంది. తరతరాలకు ఉత్తేజమిస్తుంది. భారతీయత అనే కోణం నుంచి మన చరిత్ర, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలను వీక్షించి… నిరంతరం స్ఫూర్తి పొంది… సదా కార్యాచరణలో నిమగ్నం కావాలని ప్రబోధించే దివ్య గానంగా వందేమాతరం నిరంతర స్మరణ కావాలి. వందేమాతర గీతం వరసను మారుస్తూ, గాడి తప్పిన పాలకులు దీన్ని ప్రేరణగా తీసుకుని భారత పునరుజ్జీవానికి అంకితం కావాలి. కేవలం గీతాలాపనతో సరిపుచ్చక భారత ఉజ్వల భవిష్యత్కు ప్రేరణగా తీసుకోవాలి. దేశం ముందు వందనం చేయడంతో పాటు, సంకల్ప సిద్ధి కోసం వందేమాతరం గీతాన్ని ఆలపించాలి. స్వదేశీ స్వయం సమృద్దికి నేటికీ, రేపటికి, ఎప్పటికీ వందేమాతరం ప్రేరణ మంత్రంగా నిలవాలని ఆశిద్దాం.

