చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నాయని స్వయంగా ప్రకటిస్తున్న పాలకులు అందుకు తగ్గట్లుగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కబ్జాకోరులకు రక్షణగా నిలుస్తున్నదెవరు? అసలు కబ్జాలకు పాల్పడుతున్నది ఎవరు? ప్రభుత్వాలు లేదా అధికారుల అండదండలు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అయినా, ప్రజల మొప్పు కోసం ఇలా మాట్లాడటం నాయకులకు అలవాటుగా మారింది. కబ్జాలు చాలా కాలంగా జరుగుతున్నవే. ప్రేక్షకులుగా చూస్తుండిపోయి, సహకరించిన వాళ్ళకు ముందుగా శిక్షలు పడాలి. కబ్జాదారులకు కళ్ళెం వేయాలి.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నాయని స్వయంగా ప్రకటిస్తున్న పాలకులు అందుకు తగ్గట్లుగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కబ్జాకోరులకు రక్షణగా నిలుస్తున్నదెవరు? అసలు కబ్జాలకు పాల్పడుతున్నది ఎవరు? ప్రభుత్వాలు లేదా అధికారుల అండదండలు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అయినా, ప్రజల మొప్పు కోసం ఇలా మాట్లాడటం నాయకులకు అలవాటుగా మారింది. కబ్జాలు చాలా కాలంగా జరుగుతున్నవే. ప్రేక్షకులుగా చూస్తుండిపోయి, సహకరించిన వాళ్ళకు ముందుగా శిక్షలు పడాలి. కబ్జాదారులకు కళ్ళెం వేయాలి.
నిజానికి చెరువులు, నాలాల కబ్జాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. వాటికి అనుమతులు ఇస్తున్నది అధికారులు. ఓట్ల కోసం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నది పాలకులు. పాలకులు లేదా ప్రభుత్వాలు తలచుకుంటే కబ్జాలను అరికట్టడం, తొలగించడం పెద్ద విషయమేమీ కాదు. ముందుగా నిబంధనలు కఠినం చేసి, వాటిని కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. ప్రస్తుత కబ్జాలను తొలగించాలి. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అది పోయాక మరొకలా మాట్లాడ కూడదు. అసలు సమస్యే ఈ రాజకీయ పార్టీలతో వస్తున్నది. చట్టాలు చేసేది, నిబంధనలను రూపొందించేదీ వాళ్ళే. ఆ చట్టాలను ఉల్లంఘించేదీ వాళ్ళే. లేదా వాళ్ళ అనుచరగణమే. ఇదో విషవలయంగా మార్చేసిన పాపం కూడా రాజకీయ పార్టీలదే. పైగా ఈ సమస్యలను అప్పుడే వచ్చినట్లు కొత్తగా వాటిని తొలగించాలని మాట్లాడేది కూడా వాళ్ళే. వాళ్ళ అవసరాల కోసం ఆరోపణలకు దిగడం, నానా రాద్ధాంతం చేయడం పార్టీలకు అలవాటుగా మారింది.
ఇక హైడ్రాను ఏర్పాటు చేసి, ఆక్రమణలను అడ్డంగా కూల్చేస్తున్న క్రెడిట్ ని దక్కించకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలి. వరంగల్ జిల్లాలో వరదనష్టం సందర్భంగా కబ్జాలపై వ్యాఖ్యలు చేసిన సీఎం, అందుకు తగ్గట్లుగా వెంటనే ప్రణాళికలు సిద్దం చేసి, అమలు చేసి, చిత్తశుద్ధిని చాటాలి. హైడ్రా ఏర్పాటు సందర్భంగా ఆయన ముందే చెప్పినట్లు హైడ్రాను హైదరాబాద్ కే పరిమితం చేయకుండా, నగరాలకు, పట్టణాలకు, మండలాలు, గ్రామాలకు తద్వారా తక్షణమే రాష్ట్ర వ్యాప్తం చేయాలి.
అయితే, తుఫాన్లు, ఉత్పాతాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా సాయం ప్రకటించడం, అందరినీ ఆదుకున్నామని గొప్పలు చెప్పుకోవడంతో సరిపెట్టేస్తున్నారు.ఆక్రమణలను తొలగించాలన్న దానికి కూడా ప్రణాళిక లేదు.
ఏపీలో తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో అధికారులు బాగా పనిచేశారని సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లు ఇచ్చారు. జీతాలు తీసుకుంటున్న అధికారులు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించడాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిందే. వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిందే.
ఇక తుఫాన్ గండం గడిచింది కనుక గ్రామాల వారీగా బాధితులను గుర్తించి ఆదుకోవాలి. అన్నదాతల విషయంలో అలసత్వం తగదు. తాజా మొంథా తుపాన్ కారణంగా వ్యవసాయం ముఖ్యంగా వరి, పత్తి తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కోస్తాతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ చూసినా నీట మునిగిన పైర్లు కనపడుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా నిండా మునిగిపోయిన తమను ఆదుకోవాలంటూ కన్నీటితో విజ్ఞప్తులు చేస్తున్న అన్నదాతలే కనిపిస్తున్నారు. కొబ్బరి, అరటి తోటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం పంటల బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలులో లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం తన వాటా కట్టకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది. అలాగే మత్య్సకారులు తుపాన్ వల్ల దాదాపు వారం రోజులుగా వేట ఆగిపోయింది. ఉవ్వెత్తున ఎగిసిన అలల కారణంగా తీరంలో కట్టిఉంచిన బోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రొయ్యల రైతులు కూడా భారీగా నష్టపోయారు. కేంద్రం నుండి ప్రకృతి విపత్తు సాయం ఇతోధికంగా అందేట్లు చూడాలి. కేంద్రం ఉదారంగా ముందుకు రావాలి.
ముందుగానే అంచనా వేసినట్లుగానే మొంథా అల్లకల్లోలం సృష్టించింది. తుఫాన్ కారణంగా ప్రాణ నష్టాన్ని గణనీయంగా నివారించడం ఒక సానుకూల పరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది తుఫాన్ బాధితులుగా మారినట్లు, 76 వేల మందికి పైగా పునరావాస శిబిరాలకు తరలించినట్టు, ముగ్గురు మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గతంతో పోలిస్తే అధికార యంత్రాంగం ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరించింది. ఇదే చొరవతో ఇప్పుడు బాధితుల కన్నీళ్లు తుడవాలి. అది ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం కావాలి.

