మొంథా తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. తుఫాన్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలను అతలాకుతలం చేసింది. వరంగల్ మహా నగరాన్ని నీట ముంచింది.ఇద్దరు మంత్రులు, ఇన్ చార్జీ మంత్రి ఉండి వరంగల్ లో పర్యటించలేదు. ప్రజలను పరామర్శించలేదు. సీతక్క, పొంగుటేలి జూబ్లీ ప్రచారానికి, కొండా సురేఖ తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. సీఎం కూడా వరంగల్ పశ్చిమకే పరిమితమై, తూర్పు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ దశలో ప్రజలకు దిక్కెవరు?
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
మొంథా తుఫాన్ మిగిల్చిన బీభత్సం ఇంకా ప్రజల్ని వీడలేదు. తుఫాన్ ఆగినా, దాని ప్రభావం తగ్గలేదు. ఆ తుఫాన్ తాకిడికి నీట మునిగిన ప్రాంతాలింకా నీటిలోనే ఉన్నాయి. ప్రభుత్వ తక్షణ సహాయక చర్యలింకా ప్రజలకు సరిగా చేరనేలేదు. మునిగిన ప్రాంతాల నుంచి నీటిని ఖాళీ చేసే ప్రక్రయలేవీ జరుగుతున్నట్లుగా లేవు. దీంతో గత మూడు రోజులుగా ప్రజలింకా తుఫాన్ మిగల్చిన వరద బురదలోనే కొట్టుమిట్టాడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ బురద కొట్టుకుపోయి ఉన్నాయి. జనజీవనం సాధారణ స్థాయికి రావడానికి ఇంకా రోజులు పట్టేలా కనిపిస్తున్నది.
రాష్ట్రం విలవిల్లాడినా, వరంగల్ నగరం మునిగి ప్రజలంతా నీటి పాలైనా, యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన తక్షణ సహాయక చర్యలు అంతంత మాత్రమే. ఇల్లూ, వాకిలి వదిలి వెళ్లిన ప్రజలు ఇంటికి వచ్చే వరకు సర్వం కొట్టుకు పోయింది. తాగడానికి నీళ్లు కూడా లేవు. సీఎం చెప్పే వరకు కనీసం భోజనవసతి కూడా కల్పించలేదు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. వారిని ఆదుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. గోపాలపురం, భీమారం, శివనగర్ వంటి లోతట్టు ప్రాంతాల పరిధిలోని కాలనీ ప్రజల వ్యథ అంతాఇంతా కాదు.
ఏపీలో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు నిముష నిముషానికి సమీక్షించి ప్రజలకు అండగా నిలిచారు. తుఫాన్ తీరం దాటిన తెల్లవారే చంద్రబాబు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రులు పర్యటించారు. కానీ ఓరుగల్లులో అలాంటి పరిస్థితి కానరాలేదు. కనీసం జిల్లాకు చెందిన మంత్రులు కూడా వరంగల్ ను సందర్శించలేదు. సీఎంతో పాటు వచ్చిన మంత్రులు అంతకుముందేం చేసినట్లు? జూబ్లీహిల్స్ లో పార్టీ ప్రచారంలో ఊరేగితే, రాష్ట్రంలో పాలన, ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకోవాలని, పరామర్శించాలని లేదా? హనుమకొండ, జులైవాడలో భారీగా కురిసిన వర్షానికి నీట మునిగిన కాలనీలతో పాటు అమరావతి నగర్, సమ్మయ్య నగర్, 100 ఫీట్ రోడ్డులో ప్రజలు ఆహాకారాలు చేస్తుంటే, పరిశీలించేందుకు మంత్రులు ఎవ్వరూ రాకపోవడం వింతే. సీతక్క జూబ్లీ ప్రచారంలో బిజీగా ఉండగా, మంత్రి కొండా సురేఖ మాత్రం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇన్చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పత్తాలేకుండా పోయారు.
మొంథా వరద బీభత్సంతో గ్రేటర్ వరంగల్ జల దిగ్బంధమైంది. నిత్యావసర వస్తువులు సహా, విలువైన టీవీ, బీరువాలు సైతం నీట మిగిని, కొన్ని కొట్టుకుపోయి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వృద్ధులు, వికలాంగులు, బాలింతలు రాత్రంతా నీటమునిగిన ఇళ్లల్లోనే గడిపారు. తుఫాన్ తీవ్రతను ముందస్తుగా గ్రహించి అంచనా వేయడంలో, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సమ్మయ్య నగర్ పూర్తిగా నీట మునిగి ప్రజలు సర్వం కోల్పోగా. పశువులు అరుస్తూ వరదల్లో కొట్టుకుపోవడం కలిచి వేసింది.
లోతట్టు ప్రాంతాల ప్రజల జీవనం దుర్భరంగా మారింది. శివనగర్, మైసయ్య నగర్, ఆర్ఎస్ నగర్, చింతల్ ప్రాంతాల్లోని అనేక కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. శివనగర్, మైసయ్య నగర్లలోని ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలోని గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు అన్నీ నీటిలో తడిచి ముద్దయ్యాయి. నిద్రలేని రాత్రులు గడిపి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.
అధికారులు ఆలస్యంగా శివనగర్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల్లో కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లమీద, డ్రైనేజీ, నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
మరోవైపు మొంథా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగు పాటుగా మారింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కేవలం పంటలే కాక, లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలు కూడా వరదనీటిలో చిక్కుకుపోయాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 17వ డివిజన్లోని విలీన గ్రామాల రైతులను తుఫాన్ నిండా ముంచింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తూ పూర్తిగా నేలకొరిగాయి. అలాగే, ఖిలా వరంగల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వందల ఎకరాల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయల తోటలు ఏకంగా 6 అడుగుల నీటిలో మునిగిపోయాయి. కళ్ల ముందే పంట నాశనం కావడంతో, వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మొంథా తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇంచార్జీ మంత్రి ఉండి కూడా కనీసం పాలనా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయలేకపోయారు.
పరిస్థితి ఇలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్ లో పర్యటించారు. ఆయన కూడా పశ్చిమ నియోజకవర్గానికే పరిమితమై, తూర్పు నియోజకవర్గాన్ని వదిలేశారు. మంత్రులు ముందుగానే చొరవ తీసుకుని ఉంటే, నష్టాన్ని తగ్గించగలిగే వారు. ఇప్పటికైనా ఆపన్నులను ఆదుకోవాలి. సర్వం కోల్పోయిన వారికి అండగా నిలవాలి. పరిహారాలిచ్చి రైతులను ఆదుకోవాలి.

