దీపావళి దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యాన్ని డబుల్ చేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ కూడా ఈ ట్రబుల్ నుంచి ప్రజల్ని బయటేయలేకపోయింది. ఢిల్లీని గాలి, నీరు, శబ్ధం, ట్రాఫిక్, పరిశ్రమలు, చివరకు ప్రభుత్వాలు, ప్రజలు కూడా కాలుష్యమయం చేస్తున్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేదు. ప్రజలకు స్వీయ నియంత్రణ లేకుండా పోయింది. దీంతో ఢిల్లీ రోజురోజుకు కాలుష్య కాసారంగా మారుతోంది. రెడ్ జోన్ లోకి వెళ్ళుతున్నా, ఢిల్లీని రక్షించేవారే కరువవుతున్నారు. మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
దీపావళి దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యాన్ని డబుల్ చేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ కూడా ఈ ట్రబుల్ నుంచి ప్రజల్ని బయటేయలేకపోయింది. ఢిల్లీని గాలి, నీరు, శబ్ధం, ట్రాఫిక్, పరిశ్రమలు, చివరకు ప్రభుత్వాలు, ప్రజలు కూడా కాలుష్యమయం చేస్తున్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేదు. ప్రజలకు స్వీయ నియంత్రణ లేకుండా పోయింది. దీంతో ఢిల్లీ రోజురోజుకు కాలుష్య కాసారంగా మారుతోంది. రెడ్ జోన్ లోకి వెళ్ళుతున్నా, ఢిల్లీని రక్షించేవారే కరువవుతున్నారు.
కాలుష్య కారక గాలిని పీల్చడం వల్ల ఢిల్లీలో సగటున ప్రతి మనిషి రోజుకు 9 సిగరెట్లు తాగిన దాంతో సమానమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. దీపావళి వేడుకలు జరిగిన మూడు రోజుల తర్వాత కూడా ఎయిర్ క్వాలిటీ దారుణంగా ఉన్నది. గురువారం ఉదయం 5.30 గంటలకు సగటున ఢిల్లీలో వాయు నాణ్యత 325 వద్ద నమోదైంది. ఢిల్లీని పొగమంచులా కాలుష్యం కమ్మేస్తోంది. పర్యావరణాన్ని కబళిస్తోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 300 నుంచి 400 మధ్య ఏక్యూఐ నమోదైంది. ఏక్యూఐ 511కు చేరింది.
అయితే, గాలి, నీరు, భూమి కాలుష్యంపై ఆధారపడి ఉంటాయి. వాయు కాలుష్యం కోసం, గాలి నాణ్యత సూచికని వాడతారు. ఇది సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, పీఎం2.5, పీఎం10, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ వంటి కాలుష్య కారకాల స్థాయిలను లెక్కిస్తుంది. నీటి కాలుష్యాన్ని రసాయన కాలుష్య కారకాలు, వ్యర్థాలు, ప్లాస్టిక్ స్థాయిలను కొలవడం ద్వారా లెక్కిస్తారు. శబ్ద కాలుష్యాన్ని డెసిబెల్స్ లో లెక్కిస్తారు. గాలి నాణ్యతను పీఎం2.5, పీఎం10 క్యూబిక్ మీటరుకు మైక్రోగ్రాములలో కణాల సాంద్రతను కొలుస్తారు. పీఎం2.5 అనేది 2.5 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన అతి సూక్ష్మ కణాలు. పీఎం10 అనేది 10 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన కణాలు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక ప్రకారం కాలుష్య కారక సూక్ష్మ కణాల స్థాయి పీఎం 2.5 గడిచిన ఐదేళ్ల కాలంలో అత్యధికంగా నమోదైంది. దీపావళి తరువాత 24 గంటల్లో సగటు పీఎం2.5 సాంద్రత ఒక క్యూబిక్ మీటర్కు 488 మైక్రో గ్రాములకు చేరింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన భద్రతా పరిమితికి దాదాపు 60 రెట్లు అధికం. దీంతో ఢిల్లీలో భయానక వాతావరణం నెలకొంది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడగా, అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నగరమంతా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చి సెంట్రల్ ఎయిర్ క్వాలీటి మేనేజ్మెంట్ ను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అదే సమయంలో భారీగా ఢిల్లీ ప్రజానీకం శ్వాసకోస సమస్యలతో దవాఖానాల ముందు బారులు తీరుతున్నారు. వీరిలో వృద్ధులు, పసిపిల్లలు ఎక్కువగా ఉన్నారంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నిజానికి కాలుష్య నివారణ పట్టుదల ప్రభుత్వాలలో పెద్దగా కనిపించదు. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినా ఢిల్లీ డబుల్ కాలుష్యంలోకి వెళుతుండటం విషాదమే. వరదలు వస్తే ఢిల్లీని ముంచెతుతున్నాయి. ఇవి మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న అనర్థాలు. వీటిని కఠిన నిర్ణయాలతో అరికట్టాలి. కానీ రాజకీయాల కారణంగా పనులు జరగడం లేదు. బీజేపీ చిత్తశుద్ధిని చాటుకుని ఢిల్లీ ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా మారింది.
ఢిల్లీకి వలసలు పెరగడమే ఇందుకు కారణం. ఆప్ అధికారంలో ఉన్నప్పుడు టపాసులను నియంత్రిస్తే, హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించిన బీజేపీ, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే జరుగుతోంది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల నియంత్రిత హామీల మేరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. వాతావరణాన్ని కలుషితం చేయమని ఏ మతం చెప్పదని, ప్రాథమిక హక్కు ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు కాపాడి తీరాలని చెప్పింది. సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కే అనుమతి ఇచ్చినప్పటికీ ఆ పేరుతో అన్ని రకాల బాణాసంచా ఢిల్లీ నగరంలోకి ప్రవేశించింది.
దీపావళికి ముందే దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. అయినా, కేంద్రం, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వాలు ఢిల్లీలో టపాసుల అమ్మకాల మీద నిషేధాన్ని ఎత్తివేయించేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాయి. కొన్ని పరిమిత గంటల్లోనే బాణాసంచా కాల్చడానికి ఇచ్చిన అనుమతి సైతం ఆచరణలో అమలు కాలేదు. ఇప్పుడు ప్రమాదం కనపడుతుండటంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా, పంజాబ్ రైతులను గడ్డి తగలపెట్టేలా ఆప్ నేతలు ఒత్తిడి చేశారని, దాని ఫలితంగానే ఢిల్లీలో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాల స్థాయిలో రాజకీయాలు ఇంత దరిద్రంగా దాపురిస్తే ప్రజలకు దిక్కేది?
రాజకీయాలను పక్కన ప ఎట్టి సమస్యలను అధిగమించే ప్రయత్నాలు ఇప్పటికైనా చేయాలి. దేశ రాజధాని కాలుష్యం నుంచి బయటపడేలా చేయాలి. రాజకీయాలకు ఇక కాలం చెల్లిందని పాలకులు, ప్రతిపక్షాలు గుర్తించి ఉమ్మడిగా కాలుష్య నివారణకు పాటుపడాలి.

