సుప్రీం కోర్టులో నిన్న జరిగిన అనూహ్య ఘటన యావత్ దేశానికి దిగ్భ్రాంతిని కలిగించింది. ఆ న్యాయవాది సంయమనం కోల్పోయినా, ప్రధాన న్యాయమూర్తి మాత్రం సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ ఘటన అత్యున్నత న్యాయస్థాన ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తోంది. సాధారణ పౌరులకు అతీతంగా వ్యవహరించాల్సిన న్యాయవాదులు, న్యాయమూర్తుల వ్యక్తిగత కష్టాలు, నష్టాలు, భావోద్వేగాలు, ఒత్తిడి, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతలను ప్రశ్నార్థకంగా మార్చింది. ఓర్పుగా, నేర్పుగా, కూర్పుగా జరగాల్సిన విచారణలు, తీర్పులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో సమాజంలో పెరుగుతున్న అసహనం, కోర్టుల్లో పేరుకుపోతున్న వాయిజ్యాలు, పెరుగుతున్నపని ఒత్తిడి, వృత్తిలో ఉండే విధులు, బాధ్యతలు, సమయ నియంత్రణలు, వివిధ పనుల మధ్య సమన్వయ లోపాలు, అయోమయం, భావోద్వేగాలు, వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య అసమతుల్యత మొదలైనవి మరోసారి తెరమీదకు వస్తున్నాయి. అన్నింటికీ మించి పరిమిత కోర్టులు, అపరిమిత కేసులు, న్యాయమూర్తులు, కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కోర్టులు, కేసులు, తీర్పులు న్యాయన్యాయాలు!
‘డాక్టర్ మార్గం – అడుగు’ ఎడిటోరియల్
సుప్రీం కోర్టులో నిన్న జరిగిన అనూహ్య ఘటన యావత్ దేశానికి దిగ్భ్రాంతిని కలిగించింది. అక్టోబర్ 6న ఓ కేసుపై విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, 71ఏళ్ళున్న రాకేశ్ కిషోర్ అనే న్యాయవాది, సీజేఐ పై బూటు విసిరే ప్రయత్నం చేశాడు. వెంటనే భద్రతా సిబ్భంది దీన్ని అడ్డుకున్నారు. సీజేఐ బీఆర్ గవాయి సనాతన ధర్మానికి అవమానం జరిగేలా వ్యాఖ్యానించారని ఆ న్యాయవాది అభియోగం. అయితే, గవాయి ఈ ఘటనను సీరియస్ గా తీసుకోకుండా, ‘ఇలాంటి చర్యలు నన్ను ప్రభావితం చేయవలేవు’ అంటూ విచారణను కొనసాగించారు. ఆ న్యాయవాది సంయమనం కోల్పోయినా, ప్రధాన న్యాయమూర్తి మాత్రం సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ ఘటన అత్యున్నత న్యాయస్థాన ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తోంది. సాధారణ పౌరులకు అతీతంగా వ్యవహరించాల్సిన న్యాయవాదులు, న్యాయమూర్తుల వ్యక్తిగత కష్టాలు, నష్టాలు, భావోద్వేగాలు, ఒత్తిడి, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతలను ప్రశ్నార్థకంగా మార్చింది. ఓర్పుగా, నేర్పుగా, కూర్పుగా జరగాల్సిన విచారణలు, తీర్పులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో సమాజంలో పెరుగుతున్న అసహనం, కోర్టుల్లో పేరుకుపోతున్న వాయిజ్యాలు, పెరుగుతున్నపని ఒత్తిడి, వృత్తిలో ఉండే విధులు, బాధ్యతలు, సమయ నియంత్రణలు, వివిధ పనుల మధ్య సమన్వయ లోపాలు, అయోమయం, భావోద్వేగాలు, వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య అసమతుల్యత మొదలైనవి మరోసారి తెరమీదకు వస్తున్నాయి. అన్నింటికీ మించి పరిమిత కోర్టులు, అపరిమిత కేసులు, న్యాయమూర్తులు, కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
మనదేశ జనాభా, పెరుగుతున్న వాయిజ్యాలకు తగ్గట్లుగా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయమూర్తులు లేరు. కేసుల సంఖ్యపెరిగి, ఒక్కో కేసుకు దశాబ్దాలు పడుతోంది. న్యాయమూర్తులపై ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ కేసులకే సమయం సరిపోవడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో సుప్రీం కోర్టుకు 34 మంది న్యాయమూర్తులు సరిపోతారా? ఇక హైకోర్టుల్లో 63 లక్షలకు పైగా, దిగువ కోర్టుల్లో ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ కేసులు కొండలా పేరుకుపోవడం ఆందోళనకరం. అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో ఎన్నడూ లేనంతగా 88,417 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
న్యాయం ఆలస్యం కావడమంటే అన్యాయం కిందే లెక్క. అండర్ ట్రయల్ ఖైదీలు కేసులు తెమలక ఏళ్లుగా జైళ్లల్లో మగ్గుతున్నారు. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కినా ఏళ్ల తరబడి కేసులు తెమలడం లేదు. రాజకీయ కేసులు తప్ప క్రిమినల్ తదితర కేసులు తేలడం లేదు. జాతీయ జ్యుడీషియల్ గ్రిడ్ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం 69,605 సివిల్, 18,887 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2020 వేసవి సెలవుల సమయంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రస్తుత సీజేఐ గవాయి వేసవి సెలవుల్లోనూ కోర్టులు పాక్షికంగా పనిచేసే పద్ధతిని తీసుకొచ్చారు. అయినా సరిపోవడం లేదు.
కొల్కతా, మహారాష్ట్ర హైకోర్టుల్లో కేసుల పెండింగ్ అత్యధికంగా ఉంది. జనాభాతో న్యాయమూర్తుల నిష్పత్తి మనదేశంలోనే అత్యల్పంగా ఉండటం కేసుల పెండింగ్కు కారణమనే వాదన ఉంది. అమెరికాలాంటి దేశాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150 మంది వరకూ న్యాయమూర్తులుండగా, మన దేశంలో 21 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. కోర్టుల్లో కేసులు భారీగా పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేసులతో న్యాయస్థానాలపై ఒత్తిడి పెరుగుతోంది. దేశంలో కార్పొరేట్, అవినీతి, నేర రాజకీయాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. చట్టసభల సభ్యుల్లో 45 % మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రాధాన్యతా క్రమంలో చట్ట సభల సభ్యులు, అధికారులపై కేసులను పరిష్కరించడం కూడా అత్యవసరం.
ఇక న్యాయవాదులు తరచూ వాయిదాలు కోరడం, స్థానికంగా పరిష్కరించదగినవి కూడా కోర్టుల దాకా వెళ్ళడం, వల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలు సివిల్ కేసుల విషయంలో వినియోగించుకుని, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను తేల్చాలనే సూచన ఉంది. ఏదేమయినా ఈ విషయంలో కేంద్రం ఇక ఎంతమాత్రం ఉపేక్షించకుండా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి , కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది.
కోర్టుల్లో తగినంతమంది న్యాయమూర్తులను, సిబ్బందిని నియమించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లోక్ అదాలత్లు లాంటివి నిర్వహించి ఇరుపక్షాలు అంగీకరించిన కేసులను పరిష్కరిస్తే కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. తీర్పులకు సమయం నిర్దేశించాలనే వాదన కూడా వుంది. న్యాయస్థానాలకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిన కేంద్రం అనేక సందర్భాల్లో అడ్డుపడటం, అడ్డగోలుగా విమర్శలు చేయడం పరిపాటిగా వుంది. న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేకంగా ఒక జ్యుడీషియల్ కమిషన్ ఉండాలన్న చర్చ చాలాకాలంగా వుంది. అయితే నేడు కొలీజియం వ్యవస్థ ఆ బాధ్యత నిర్వహిస్తోంది. కాని కేంద ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం నియామకాలను తీవ్రంగా జాప్యం చేస్తోంది. ఏవో సాకులు చూపి తిరస్కరిస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో కొలీజియం, కేంద్ర న్యాయశాఖ మధ్య సమన్వయం కుదరడంలేదు. పాలన, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య భారత రాజ్యాంగం స్పష్టమైన లక్ష్మణరేఖలను నిర్దేశించింది. పాలకులు వాటిని ఉల్లంఘించిన సందర్భాల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది.
నాగరిక సమాజంలో సత్వర న్యాయం అందించడం న్యాయవ్యవస్థ కనీస బాధ్యత. అందుకోసం సుప్రీంకోర్టు తీసుకుంటున్న చొరవకు కేంద్రం వీలైనంత తోడ్పాటు నందించాలి. అప్పుడే పెండింగ్కు అడ్డుకట్టపడటంతోపాటు సత్వర న్యాయం అందేందుకు అవకాశముంటుంది.

