2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగి, ఏపీ- తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత రెండు రాష్ట్రాలు కూడా భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. 2014-15లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర లోటు రూ.16వేల కోట్లుగా కాగ్ తేల్చింది. ఒకవైపు ఆదాయ మార్గాలు పెరుగుతున్నా, అంతకంతకూ పెరుగుతున్న ఉద్యోగులు, పాలకుల జీత భత్యాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రాలకు పెను భారంగా మారుతున్నాయి. విధానాల లోపాలు, ఆదాయ సముపార్జనలో వ్యూహాత్మక తప్పిదాలు, అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులు, అమలుకు అలవికాని ఉచిత సంక్షేమ పథకాలు, అన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి దాపురించడానికి కారణం పాలకుల, అధికారుల అసమర్థతే. ఈ పరిస్థితిలో రాష్ట్రాలు అప్పుల ఊబీ నుంచి గట్టెక్కడం ఎలా? వ్యూహాత్మక పరిష్కారాలు ఏంటి?
ప్రస్తుతం ప్రభుత్వమే బడ్జెట్ లో చెప్పిన విధంగా తెలంగాణ అప్పు భారం రూ.6.85 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 26.2%. సమానం. అప్పుల్లో ఎక్కువగా మంచినీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, వడ్డీ భారాలు, జీత భత్యాలు, పెన్షన్లు, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల ఖర్చులే ఎక్కువ. బడ్జెట్ లో సగం జీత భత్యాలకుపోను, రూ.56వేల కోట్లు సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయి. 2024 25 లో తెలంగాణ ఆదాయాల్లో 78% స్వంత వనరుల నుంచి వస్తోంది, మిగతా 22% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికికు పన్నుల వాటాగా 12%, గ్రాంట్ల రూపంలో 10% నిధులు వస్తున్నాయి.
ఏపీ లో అప్పులు రూ.4.86 లక్షల కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీకి 34.7% కు సమానం. ఇందులో ఉచిత, సంక్షేమ పథకాలకు 55వేల కోట్లు ఖర్చవుతున్నాయి. దీనికి గత ప్రభుత్వాల అధిక ఖర్చులు, ప్రాజెక్టుల మేనేజ్మెంట్ లోపాలు, ఆదాయ వృద్ధి తక్కువ ఉండటం, కేంద్ర సాయం గ్రాంట్లు తక్కువగా అందడం కారణాలు. 2023 24 లో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ఆదాయాల్లో 57% స్వంత వనరుల నుంచి, మిగతా 43% కేంద్రం నుండి వస్తోంది. అందులో రాష్ట్రానికి పన్నుల వాటాగా 20%, గ్రాంట్ల రూపంలో 23% నిధులు వస్తున్నాయి.
తాజాగా తెలంగాణ 16వ ఫైనాన్స్ కమిషన్ ముందు అప్పులను పునర్వ్యవస్థీకరించాలని, వడ్డీ తగ్గింపు, చెల్లింపు ప్రీమియం తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. కొన్ని అప్పులను కమర్షియల్ కాని బ్యాంకులకు బదలాయించాలని కూడా కోరింది.
అలాగే, ప్రస్తుత రాష్ట్రాల ఆదాయంలో కేంద్రం వాటా 41% ఉన్నా, తెలంగాణ ఆ పన్నుల వాటాను 50%కి పెంచాలని కోరుతోంది. ఇందువల్ల రాష్ట్రాలకు స్వతంత్ర వ్యయం నిలుపుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయి. కేంద్ర పథకాలను రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అమలు చేసే స్వేచ్ఛని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, సహాయ నిధులు అనుకున్న స్థాయిలో రాష్ట్రాలకు చేరడం లేదు.
అయితే, ఇవన్నీ కలిసి రాష్ట్రాలకు పెను సవాళ్ళను విసురుతున్నాయి. అప్పుల పెరుగుదల సంక్షేమ పథకాలపై అధిక ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టుల్లో ఖర్చు పెరిగిపోవటం, వాటిని బడ్జెట్ లో స్పష్టంగా తెలపడకపోవటం. ఆదాయ వృద్ధి తక్కువగా ఉండటం, ఉత్పాదకత, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి ఆలస్యం కావటం. పన్నుల వసూలు, ప్రభుత్వ ఆస్తులను వదిలేయడం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత లోపాలు ఉండటం వంటి సమస్యలు అనేకం ఉత్పన్నం అవుతున్నాయి.
మరి వీటి పరిష్కార మార్గాలు ఏమిటి? అంటే రాష్ట్రాలు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. దినసరి వేతనాలు, సామాజిక రంగ పంపిణీ పథకాలను సమీక్షించాలి. కొన్ని ఉచిత పథకాలు ప్రభుత్వానికి పెను భారాన్ని కలిగిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి అవసరమైన పెట్టుబడులు పెంచుకోవాలి. పన్నుల వసూలును సరళం చేయాలి. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం కాకుండా, వాటిని, ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగించాలి. ఆయా పథకాలను పున: పరిశీలించాలి. ప్రతి పథకం లాభ నష్టాలను బేరీజు వేయాలి. నష్టం చేసే పథకాలకు తిలోదకాలివ్వాలి. ప్రభుత్వ పథకాలు, ఆదాయ వ్యయాల్లో పారదర్శకతను పాటించాలి. ప్రతి పథకానికి ఆడిట్ ఉండాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సహాయం సహా, ఆర్థిక సంక్షేమ నివేదికలు రూపొందిస్తూ దశల వారీగా అప్పులను తగ్గించుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలి. కేంద్ర గ్రాంట్లు, ప్యాకేజీలు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం చూపేవిగా ఉండాలి. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే, కేంద్ర సహాయం, ప్యాకేజీలు పెరిగి, పన్నులు తగ్గి పురోగతికి ఆస్కారం ఏర్పడుతుంది.
అప్పులు అధికమైతే, అది రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను దెబ్బతీస్తాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు పార్టీలిచ్చే వాగ్దానాలు ప్రశ్నార్థకమవుతాయి. కేంద్రం ఇచ్చే సహాయం తాత్కాలికమే. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు స్వీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

