ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు నేర్పాయి.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ నాయకత్వంలో ఇరాన్ పై జరిపిన యుద్ధోన్మాద సైనిక చర్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
ఇరాన్పై దాడుల ద్వారా వ్యూహాత్మక విజయాన్ని సాధించాలని ప్రయత్నించిన అమెరికా-ఇజ్రాయిల్ కూటమి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇరాన్పై ఒత్తిడి తీసుకురావాలని భావించినా, పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ కుదేలైంది. ఈ మార్గం అంతరాయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు 10 నుండి 25 శాతం వరకు పెరిగినట్లు అంచనాలు సూచిస్తున్నాయి.
చమురు ధరల పెరుగుదల కేవలం ఇంధన రంగానికే పరిమితం కాలేదు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధరలు 30 నుండి 40 శాతం వరకు పెరిగాయి. అదే సమయంలో ఎరువుల తయారీ ఖర్చులు పెరగడంతో వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎరువుల ఉత్పత్తి 15 శాతం వరకు తగ్గినట్లు అంతర్జాతీయ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రభావంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పడిపోయి, ధరలు పెరిగే ప్రమాదం ఉంది.
ఈ పరిణామాల పర్యవసాల ఫలితంగా ప్రపంచ ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం 8 నుండి 12 శాతం మధ్య ఊగిసలాడుతుండగా, కొన్ని దేశాల్లో ఇది ఇంకా అధికంగా నమోదవుతోంది. కరెన్సీ విలువలు పడిపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో స్థానిక కరెన్సీలు డాలర్తో పోలిస్తే 5 నుండి 15 శాతం వరకు విలువ కోల్పోయాయి. ఈ పరిణామం దిగుమతులపై ఆధారపడే దేశాలకు మరింత భారంగా మారింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే చమురు ప్రాధాన్యతను గుర్తించాల్సిందే. చమురు కేవలం ఒక ఇంధన వనరు మాత్రమే కాదు. అది ప్రపంచ వాణిజ్యానికి కేంద్రబిందువు. ఉత్పత్తి, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాలు చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే చమురు ధరల్లో చిన్న మార్పు కూడా విస్తృతమైన విపరీత ప్రభావాన్ని చూపుతుంది. ముడి చమురు ధరలో 10 శాతం పెరుగుదల ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిపై 0.5 నుండి 1 శాతం వరకు ప్రభావం చూపగలదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈ సంక్షోభం మరో కీలక అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అది డాలర్ ఆధిపత్యం. ప్రపంచ చమురు వ్యాపారం మొత్తం డాలర్లలోనే జరుగుతుంది. అందువల్ల డాలర్ విలువ స్థిరత్వం చమురు మార్కెట్తో ముడిపడి ఉంటుంది. డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అమెరికా తీసుకుంటున్న రాజకీయ, సైనిక చర్యలు కూడా ఈ యుద్ధాలకు కారణం. ఈ నేపథ్యంలో చమురు వనరులపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటాన్ని కేవలం భద్రతా సమస్యగా కాకుండా ఆర్థిక ఆధిపత్య పోరాటంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.
అయితే, ఈ యుద్ధం అమెరికా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇరాన్పై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవడంతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిర సంక్షోభంలోకి నెట్టాయి. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆహార భద్రత, ఉపాధి, జీవన వ్యయం, చివరకు దేశ భద్రత దాకా అన్నీ యుద్ధం కారణంగా విపరీత ప్రభావానికి లోనయ్యాయి.
మరైతే ఈ యుద్ధాల వల్ల నిజంగా ఎవరు లాభపడ్డారు? అగ్ర రాజ్యాల యుద్ధోన్మాదం మిగిల్చింది విషాదమే. నష్టపోయింది ప్రపంచ ప్రజలే. ఎప్పటికైనా ఈ యుద్ధాల విరామాలు కాదు విరమణలు కావాలి. సమత, మమత, శాశ్వత శాంతిని నెలకొల్పాలి.
ప్రపంచ నాయకత్వం ఇప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. యుద్ధోన్మాదాన్ని విడనాడి, చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాల ద్వారా సమస్యలను పరిష్కరించాలి. ఇరాన్ సహా ప్రభావిత దేశాల పునర్నిర్మాణానికి అంతర్జాతీయ సహకారం అవసరం. లేకపోతే ఈ సంక్షోభం మరింత లోతుగా మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలిక మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉంది.
మొత్తానికి, ప్రస్తుత పరిణామాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. అంతిమంగానైనా సరే, యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదు. యుద్ధాన్ని మొదలు పెట్టడం సులువు. కానీ, దాన్ని విరమించడం చాలా కష్టం. అది మానవత్వాన్ని తుంచి, సమస్యలను మరింత పెంచుతుంది. శాంతి, సహకారం, సమాన అభివృద్ధి ఇవే ప్రపంచ భవిష్యత్తును రక్షించే మార్గాలు.

