ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. తెలంగాణలో మూసీ ప్రక్షాళన, ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు, జరుగుతున్న పరిణామాలు విపరీతంగా ఉన్నాయి. అభివృద్ధి అంశాలను రాజకీయ లాభనష్టాలతో బేరీజు వేసే ధోరణి పెరిగితే, దీర్ఘకాల ప్రయోజనాలు పక్కనపడి తాత్కాలిక ప్రయోజనాలే ప్రాధాన్యం సంతరించుకుంటాయి.
తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన అనివార్యం. అరమరికలు అవసరం లేని వాస్తవం. హైదరాబాద్ నగరం నుంచి రోజుకు 1,400 నుండి 1,600 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో ఎక్కువ భాగం నేరుగా మూసీలో కలుస్తోంది. ఇది పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రక్షాళన చర్యలు అత్యవసరం. అయితే, ఈ ప్రాజెక్ట్ పై రాజకీయ వివాదాలు నెలకొనడం ఆందోళనకరం. అధికార పార్టీ పట్టుదలతో ముందుకు వెళ్లాలనుకుంటే, ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపకుండా, కేవలం వ్యతిరేకతకే పరిమితం కావడం విడ్డూరం.
నిర్వాసితుల సమస్య సున్నితమైంది. ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ అయినా ప్రజల సహకారం లేకుండా సాధ్యం కాదు. అందుకే “ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి” అనే విధంగా సరైన పునరావాస విధానం ఉండాలి. గత అనుభవాల ప్రకారం సరైన పరిహారం ఇవ్వకపోతే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ వివాదాల కేంద్రంగా మారింది. 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, తరువాత దానిపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ నిలిచిపోయింది. 33 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వల్ల వారి ఆశలు కూడా నిలిచిపోయాయి. రాజధాని నిర్మాణం అంటే కేవలం భవనాలు కాదు. అది సామాజిక, ఆర్థిక, పరిపాలన అభివృద్ధికి కేంద్ర బిందువు.
అభివృద్ధి నిరంతర ప్రక్రియ. హైదరాబాద్ నగరం ప్రస్తుత స్థాయికి చేరుకోవడానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అదే విధంగా అమరావతి కూడా ఒక్కరోజులో మహానగరంగా మారదు. దీర్ఘకాల ప్రణాళిక, స్థిరమైన విధానాలు అవసరం. కానీ రాజకీయ మార్పులతో ప్రాజెక్ట్ ల దిశ మారిపోతే పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోతుంది. ప్రభుత్వాల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ప్రధాన ఆదాయ వనరు. కానీ, సమగ్రంగా అభివృద్ధి చెందిన రాజధాని నగరం ఉంటే, రాష్ట్ర ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. అంచనాల ప్రకారం, సరైన ప్రణాళికతో అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశముంది. ఇది ఉపాధి అవకాశాలను కూడా విస్తరించగలదు.
రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలను ముందుంచాలి. కేవలం సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి సాధ్యం కాదు. రేషన్, ఉచిత బస్సు, నగదు పంపిణీ వంటి పథకాలు తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు అవసరం. అదే సమయంలో సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం కూడా సరికాదు. రెండింటి మధ్య సమతౌల్యం, సమన్వయం అవసరం.
ఇందులో అధికార పక్షం సహా, ప్రతిపక్షాల పాత్ర కూడా కీలకం. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకు పరిమితం కాకుండా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి. ఇక ప్రభుత్వం కూడా పారదర్శకత. భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు వెంటనే స్పందించాలి. నిశ్శబ్దం అనుమానాలకు తావిస్తుంది. విశ్వసనీయత కోల్పోతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రశ్నార్థకంగా మారతాయి.
రాజకీయాలు అభివృద్ధిని నడిపించాలి గాని అడ్డుకోకూడదు. నాయకులు తాత్కాలిక రాజకీయ, లాభాల కోసం కాకుండా, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచించాలి. ప్రజలు కూడా భావోద్వేగాలకు లోనుకాకుండా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే రాష్ట్రాలు నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయి. లేదంటే రాజకీయాల కలుషిత ప్రభావంలో అభివృద్ధి అనే లక్ష్యం ఎప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోతుంది.

