దేశంలో రాజకీయ అవినీతి అంతుచిక్కని వ్యవస్థాగత దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ప్రభుత్వాలున్నాయి. చట్టాలున్నాయి, పోలీసులున్నారు. విచారణ సంస్థలున్నాయి. కోర్టులున్నాయి. తీర్పులను అమలు చేసే యంత్రాంగాలున్నాయి. అయినా రాజకీయ అవినీతికి శిక్షలు పడటం అత్యంత అరుదు. చిరుద్యోగి వెయ్యి రూపాయల లంచానికి పట్టుబడితే, లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న రాజకీయ నాయకులు మాత్రం విచారణల ముసుగులో ఏళ్ళ తరబడి బయటే దర్జాగా తిరుగుతున్నారు. పోటీలు చేస్తున్నారు. గెలుస్తున్నారు. రాజ్యాలేలుతున్నారు.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
భారత దేశంలో రాజకీయ అవినీతి అంతుచిక్కని వ్యవస్థాగత దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ప్రభుత్వాలున్నాయి. చట్టాలున్నాయి, పోలీసులున్నారు. విచారణ సంస్థలున్నాయి. కోర్టులున్నాయి. తీర్పులను అమలు చేసే యంత్రాంగాలున్నాయి. అయినా రాజకీయ అవినీతికి శిక్షలు పడటం అత్యంత అరుదు. చిరుద్యోగి వెయ్యి రూపాయల లంచానికి పట్టుబడితే, లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న రాజకీయ నాయకులు మాత్రం విచారణల ముసుగులో ఏళ్ళ తరబడి బయటే దర్జాగా తిరుగుతున్నారు. పోటీలు చేస్తున్నారు. గెలుస్తున్నారు. రాజ్యాలేలుతున్నారు. ఇది ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని, నిస్సహాయతను పెంచుతోంది.
భారత రాజ్యాంగం చట్టం ముందు అంతా సామానమేనని చెబుతోంది. రాజకీయ అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఎన్నికల చట్టాలన్నీ సాధారణ పౌరులతోపాటు రాజకీయ నాయకులకూ వర్తిస్తాయి. జైలు శిక్షలు, ఆస్తుల స్వాధీనం, పదవుల రద్దు వంటి కఠిన నిబంధనలు చట్టాల్లో స్పష్టంగా ఉన్నాయి. చట్టాల్లో లొసుగులు, న్యాయపరమైన చిక్కులు, అమలులో లోపాలు వెరసి, రాజకీయ సంకల్పం లేకపోవడమే అసలు సమస్యగా మిగిలిపోతున్నది.
రాజకీయ అవినీతి కేసులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల మధ్య పరస్పరం ఉండే అంతర్గత అవగాహన. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై కేసులు పెట్టినా, అధికార మార్పు తర్వాత అవే కేసులు నత్తనడకన సాగుతాయి లేదా నీరుగారిపోతాయి. నిర్వీర్యమవుతాయి. ‘ఈ రోజు నువ్వు – రేపు నేను’ అనే ధోరణి రాజకీయ వ్యవస్థను పీడిస్తోంది. విచారణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన చోట, అధికారంలో ఉన్నవారి ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాయనే విమర్శలు కొత్తవేమీ కావు.
అధికారంలో ఉన్నప్పుడే జీఓలు, ఫైళ్లు, కాంట్రాక్టులు, లావాదేవీలకు సంబంధించిన రికార్డులన్నీ మాయమవుతాయి. బినామీ లావాదేవీలు, షెల్ కంపెనీలు, విదేశీ ఖాతాల ద్వారా అక్రమ సంపదను దాచడం, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టడం వంటివి రాజకీయ అవినీతి రుజువును మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. కోర్టులలో కేసులు సాగడానికి దశాబ్దాలు పడుతుండటం వల్ల రాజకీయ వ్యవస్థపైనే గాక, న్యాయవ్యవస్థపై కూడా ప్రజలు విశ్వాసాన్ని కొల్పోతున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు తర్వాత అభివృద్ధి, పారదర్శక పాలన అంటూ ప్రజలకు హామీలు ఇచ్చారు. కానీ పదేళ్ల పాలన అనంతరం రెండు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు, కాంట్రాక్టులు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కారు రేస్ ల చుట్టూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా వాటిపై సమగ్ర విచారణలు, స్పష్టమైన శిక్షలు నేటికీ ఖరారు కాలేదు. విధాన సభలు, రాజకీయ వేదికలపై వినిపిస్తున్న ఆరోపణలు, సరైన సాక్ష్యాలు లేకపోతే చట్టపరంగా న్యాయ పరీక్షకు నిలవవు. ఆరోపణలు ఆయా పార్టీల రాజకీయ లాభనష్టాలకే పరిమితమవుతాయి. తాజాగా బీఆర్ఎస్ పై కవిత ఆరోపణలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
అసలు అవినీతిని బయటపెట్టే బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల అవినీతిని ప్రశ్నించకపోతే, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు మౌనం పాటిస్తే, అవినీతి రుజువెలా అవుతుంది? ప్రజాస్వామ్యం ఎలా పరిఢవిల్లుతుంది? రాజకీయ నాయకులు నిజంగా అవినీతిపై పోరాటం చేయాలంటే ఆరోపణలకే పరిమితం కాకుండా, తమ వద్ద ఉన్న ఆధారాలను విచారణ సంస్థలకు, కోర్టులకు సమర్పించాలి. అది జరగకపోవడం వల్లే, అవన్నీ రాజకీయ అరాచక నాటకాలుగానే మిగులుతున్నాయి.
ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు క్రీయాశీలతను కోల్పోతే, ప్రజలకు మిగిలిన ఏకైక ప్రభావవంతమైన ఆయుధం ఓటు. గతంలో అనేక సందర్భాల్లో ప్రజలు అవినీతి పాలనలను ఓటుతో శిక్షించారు. కానీ అది సరిపోవడంలేదు. రాజకీయ అవినీతిపై నిరంతర నిఘా, ప్రజా ఒత్తిడి అవసరం. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడం, మీడియా ద్వారా చర్చను నిలబెట్టడం, కోర్టులను ఆశ్రయించడం, శాంతియుత ప్రజా ఉద్యమాలు వంటివన్నీ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మార్గాలు. ముఖ్యంగా రాజకీయ పార్టీలను, నాయకులను గుడ్డిగా, భక్తిగా ఆరాధించడంకాక, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా ప్రశ్నించే సంస్కృతి సమాజంలో రావాలి.
రాజకీయ అవినీతికి అంతానికి శిక్షలున్నాయి. కానీ అవి అమలు కావడం లేదు అన్నదే చేదు నిజం. చట్టాలు కాగితాలకే పరిమితమై, రాజకీయ సంకల్పం లేనప్పుడు ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుంది. ఈ పరిస్థితి మారాలంటే వ్యక్తుల మార్పు కంటే వ్యవస్థాగత మార్పు అవసరం. ప్రజలు మౌనంగా వీడి, ప్రశ్నిస్తేనే, రాజకీయ అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.

