పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక పల్లెలు ప్రగతి రథ చక్రాలపై పరుగులు పెట్టాలి. ఇకిప్పుడు గ్రామ రాజకీయాల దిశ మారాలి. ఎన్నికల సమయంలో సహజంగా ఏర్పడిన పోటీ, విమర్శలు, విభేదాలు, శత్రుభావాలు అక్కడితోనే ముగించాలి. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఇప్పుడు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సంయమనంతో, సమన్వయంతో సముచితంగా సాగినప్పుడే నిజమైన గ్రామ ప్రగతి సాధ్యమవుతుంది.
గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాదులు. గ్రామ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ప్రజల దైనందిన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. రెండేళ్ళుగా గ్రామ పరిపాలకులు లేక, అధికారుల పాలనలో కునారిల్లిన పంచాయతీల్లో పలు సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. పైగా బకాయిలు పేరుకుపోయాయి. మంచినీరు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, వీధిలైట్లు, మరమ్మతులు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలన్నీ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాల్సి ఉంటుంది. వీటికి సరిపడా నిధుల అవసరం ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు కీలకం. పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే నిధులు వాటి నిర్వహణకే సరిపోవు. పైగా కరెంటు బిల్లులు, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది కొరత, వారి జీతభత్యాలు, అద్దె భవనాల్లో కార్యాలయాలు, వాటి నిర్వహణ వంటి అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే దిశగా పనులు జరగాలి. ఎన్నికల అనంతరం కూడా రాజకీయ విభేదాలు కొనసాగితే అభివృద్ధి పనులు నిలిచిపోతాయి. దీనివల్ల నష్టపోయేది రాజకీయ నాయకులు కాదు, సామాన్య ప్రజలే.
అయితే, గతంలోలా నిధులు వచ్చే అవకాశాలు తక్కువ. ఉపాధి హామీ నిధులు పంచాయతీలకు వరంగా ఉండేవి. కరువు పనిదినాలు, శ్రమకు తగ్గ మెటీరియల్ కాంపౌండ్, పనులు పూర్తి చేసిన కొద్దీ పెరిగే అపరిమిత నిధులను విపరీతంగా వినియోగించడం ద్వారా ప్రస్తుతం ప్రగతి జరిగింది. కానీ, కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని పేరుతోపాటు, విధి విధానాలను మార్చేసింది. 60%-40% కేంద్ర-రాష్ట్రాల వాటాగా నిర్ణయించింది. ఇది ఆశనిపాతం కాగా, ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వెక్కిరిస్తోంది. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ రెండేళ్ళుగా పంచాయతీలకు ఇవ్వాల్సిన 3వేల కోట్ల నిధులే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి. దీనికి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ మరో 3వేల కోట్లు కలిపితే, 6వేల కోట్లు అవుతాయి. ప్రభుత్వం విడుదల చేసే ఈ నిధులు సమర్థవంతంగా వినియోగించబడాలంటే గ్రామ స్థాయిలో ఐక్యత అవసరం. సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు పరస్పరం సహకరించుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ఏ గ్రామానికి ఏ అవసరం ఎక్కువగా ఉందో గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలి. కేవలం రాజకీయ లాభనష్టాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా, ప్రజల అవసరాలే కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవాలి.
అలాగే ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా ఎంతో కీలకం. తమ వాగ్దానాలను మరిచిపోకుండా అమలు చేయాలి. ఓడిన వర్గాలను కూడా కలుపుకొని గ్రామాభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలి. అప్పుడే గ్రామంలో సామరస్యం పెరుగుతుంది. ప్రజలు కూడా కేవలం విమర్శకులు, ప్రేక్షకులుగా కాకుండా, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి. గ్రామ సభలు, సమావేశాల ద్వారా తమ సమస్యలను స్పష్టంగా తెలియజేయాలి.
ఇక అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి. నిధుల కేటాయింపు, పనుల అమలులో పారదర్శకత ఉండాలి. అభివృద్ధి పనులపై సామాజిక పర్యవేక్షణ పెరిగితే అవినీతికి అవకాశం తగ్గుతుంది. ఇది గ్రామాభివృద్ధికి మరింత బలాన్నిస్తుంది.
ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే. కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎన్నికల తర్వాత కూడా విభేదాలను కొనసాగిస్తే గ్రామాలు వెనుకబడిపోతాయి. పార్టీలకతీతంగా ఆలోచించి, నిధులు–విధులు–ప్రగతి ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తేనే పల్లెలు నిజంగా ప్రగతి పట్టాలెక్కుతాయి. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేసినప్పుడే బలమైన, స్వావలంబన గల గ్రామ సమాజం నిర్మించగలుగుతాం.

