‘మహాత్మా గాంధీ ఉపాధి హామీ’ పథకాన్ని ‘బాపు గ్రామీణ్ రోజ్ గార్ యోజన’ పథకంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. భారతదేశంలో ఊళ్ళు, పట్టణాలు, ప్రభుత్వ పథకాలు, వీధుల పేర్లు మారుస్తూ ఉండటం ఇటీవలి కాలంలో ఒక ప్రధాన రాజకీయ, సామాజిక అంశంగా మారింది.
భారతదేశంలో పేర్ల మార్పు కొత్తేమీ కాదు. ఇంతకుముందు. 1956లో ట్రావెన్కోర్-కొచ్చిన్ను కేరళగా, 1996లో మద్రాస్ ను చెన్నైగా, 2001లో కలకత్తా ను కోల్కతా గా, 2011లో ఒరిస్సాను ఒడిషాగా, 2006లో పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు. 2016లో ప్రధాని అధికారిక నివాసం పేరును ‘లోక్ కళ్యాణ్ మార్గ్’గా, ‘రాజ్పథ్’ను ‘కర్తవ్య పథ్’గా, తాజాగా ప్రధాని కార్యాలయానికి ‘సేవాతీర్థ్’గా, రాష్ట్ర గవర్నర్ల నివాసాలు ‘రాజ్భవన్’లను ‘లోక్ భవన్’గా మార్చడం తెలిసిందే. ఇదే కోవలో ఉపాధి హామీ పథకానికి కూడా పేరు మార్చారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చిన పేర్లే ఎక్కువ వివాదాస్పదమవుతున్నాయి.
ఈ ప్రక్రియ కొందరికి చరిత్ర పునరుద్ధరణగా అనిపిస్తే, మరికొందరికి రాజకీయ దురుద్దేశంగా, ప్రజాధన దుర్వినియోగంగా కనిపిస్తోంది. పేరు కేవలం ఒక గుర్తింపేనా, లేక ప్రజల భావోద్వేగాలకు, చరిత్ర జ్ఞాపకాలకు, ప్రాధాన్యాలకు ప్రతీకనా? పేర్ల మార్పు సమంజసమా? నిజంగా మార్చాల్సిన అవసరం ఉందా? ఉంటే ఏ మేరకు?
దేశం సహా, రాష్ట్రాలు, ప్రాంతాలు, ఊర్లు, పట్టణాలు, గ్రామాలు, వీధులు, మనుషుల పేర్లకు భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంటుంది. వాటన్నింటి ప్రభావం ఆయా పేర్లపై ఉంటుంది. ఆర్యులు, ముస్లింలు, బ్రిటీషర్లు మొదలైన వలస పాలనల కాలంలో, అనేక పేర్లు మార్పు జరిగింది. ఆ పేర్లు ఇప్పుడు స్థానిక సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను ప్రతిబింబించవు అనే వాదన ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రాచీన చరిత్రను, స్థానిక గుర్తింపును ప్రతిఫలించే పేర్లను పునరుద్ధరించడం అవసరమా? ఇది నిజంగా ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించి, సాంస్కృతిక అవగాహనను బలపరుస్తుందా? అయితే, పేర్ల మార్పు అన్నది కేవలం రాజకీయ ప్రేరేపిత భావోద్వేగాల ఎజెంగా జరిగితే సమస్యలు తలెత్తుతాయి.
పేరు చరిత్రను ప్రతిబింబిస్తుంది. ఊరు, వీధి పేర్లు తరతరాలుగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. పేరు ద్వారా ఆ ప్రాంత చరిత్ర, సామాజిక పరిణామాలు, సాంస్కృతిక నేపథ్యం వెల్లడవుతాయి. అలాంటి పేర్లను తరచూ మారిస్తే చరిత్రను చెరిపేయడమేనా? చరిత్రలోని తప్పులను సరిదిద్దడమే లక్ష్యమైతే, పేర్ల మార్పు కంటే చరిత్రపై అవగాహన పెంపొందించడం, విద్య ద్వారా నిజాలను ప్రజలకు తెలియజేయడం ఉత్తమ మార్గం కాదా?
ప్రభుత్వాలు తమ భావజాలానికి అనుగుణంగా పేర్లు మార్చడం ద్వారా తమ రాజకీయ అజెండాను అమలుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో సహజమేనని కొందరు వాదిస్తే, మరికొందరు దీనిని అధికార దుర్వినియోగంగా చూస్తారు. ప్రజల ప్రాథమిక సమస్యలు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు. వీటిని విస్మరించి, పేర్ల మార్పులపై దృష్టి పెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమనే విమర్శ బలంగా వినిపిస్తోంది.
పేర్ల మార్పు పరిపాలనా వ్యయభారం. ఒక ఊరు లేదా పట్టణం పేరు మారితే, ప్రభుత్వ పత్రాలు, మ్యాపులు, బోర్డులు, రికార్డులు, డిజిటల్ డేటాబేసులు అన్నీ మార్చాల్సి వస్తుంది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఖర్చవుతుంది. ఆ ఖర్చు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. పేరు మార్పు వల్ల ప్రయోజనం లేకపోతే, ఆ వ్యయం న్యాయసమ్మతమా? ఆలోచించాలి.
సాధారణంగా ప్రభుత్వ పథకాల పేర్లు ప్రజలకు గుర్తుండేలా, ఆకర్షణీయంగా పెడతారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పథకాల పేర్లు మారితే, ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. అసలు సమస్య పథకం పేరు కాదు, ఆ పథకం అమలు. పేర్లు మారుస్తూ పాత పథకాలను కొత్తవిగా చూపించడం వల్ల ప్రజలకు వాస్తవ ప్రయోజనం కలగదు. ఇదంతా ‘పేర్ల రాజకీయం’గా మాత్రమే మిగిలిపోతుంది.
అదేవిధంగా, చరిత్రను పూర్తిగా తిరస్కరించడం కూడా సరైనది కాదు. చరిత్రలో మంచి, చెడులుంటాయి. పేర్ల మార్పు ద్వారా చరిత్రను సరిదిద్దగలమనే భావన భ్రమ మాత్రమే. బదులుగా, చరిత్రను విమర్శనాత్మకంగా అధ్యయనం చేసి, ప్రజలకు అవగాహన కల్పించడమే మేలైన మార్గం.
పేర్లు మార్చడం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సమంజసమే అయినా, అది ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం కాదు. పేర్ల మార్పు కన్నా విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలు రాజకీయ లాభనష్టాలకంటే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

