ప్రకృతి ప్రకోపిస్తే, వికృత విలయతాండవం చేస్తే, ఈ ప్రపంచానికి, ప్రాణులకు విస్మృతి ఉంటుందా? చేతనైతే ఎదుర్కోవడం, లేదంటే తలొగ్గడం తప్ప చేయగలిగింది ఏముంటుంది? ఆ ప్రళయ ఫలితాల్ని అనుభవించడం తప్ప. అయితే, ప్రకృతి విధ్వంసానికి కారకులం మనమే కావడం విషాదం. ఆ ఫలితాలు మనమే అనుభవించాల్సి రావడం విచారం. ఆ ప్రభావాన్ని తగ్గించి, రక్షించి, పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలుండటం ఉపశమనం. కష్టాలకు, కన్నీళ్ళకు భాష ఉండదు. రాజకీయాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు అతీతంగా కేంద్రం వెంటనే సాయమందించి అండగా నిలవాల్సిన సమయమిది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
ప్రకృతి ప్రకోపిస్తే, వికృత విలయతాండవం చేస్తే, ఈ ప్రపంచానికి, ప్రాణులకు విస్మృతి ఉంటుందా? చేతనైతే ఎదుర్కోవడం, లేదంటే తలొగ్గడం తప్ప చేయగలిగింది ఏముంటుంది? ఆ ప్రళయ ఫలితాల్ని అనుభవించడం తప్ప. అయితే, ప్రకృతి విధ్వంసానికి కారకులం మనమే కావడం విషాదం. ఆ ఫలితాలు మనమే అనుభవించాల్సి రావడం విచారం. ఆ ప్రభావాన్ని తగ్గించి, రక్షించి, పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలుండటం ఉపశమనం. కష్టాలకు, కన్నీళ్ళకు భాష ఉండదు. రాజకీయాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు అతీతంగా కేంద్రం వెంటనే సాయమందించి అండగా నిలవాల్సిన సమయమిది.
నిన్నా, ఇవ్వాళ మొంథా తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా కుండపోతగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, ఊళ్ళకు ఊళ్ళే చెరువులయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి ఏరులయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరి, పత్తి, మక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. అతివృష్టి, అనావృష్టి, తుఫాన్లు వంటివేవొచ్చినా, తొలుత నష్టపోయేది మాత్రం రైతులే. మొంథా తుఫాన్ తో ఇరు రాష్ట్రాల్లో రైతులు భారీగా నష్టపోయారు. పంటలు నీటమునిగాయి. వరిచేలు వంగి పోయాయి. కొన్నిచోట్ల ఆరపోసిన ధాన్యం కొట్టుకు పోయింది. కోతదశకు వచ్చిన పంట నేలకొరిగింది. వేల ఎకరాల వరకూ వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. నేలకు ఒరిగిన పంటను పైకి లేపి కట్టలుగా కట్టాలని అధికారులు సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో పంట నేలవాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అరటి పంటలు సైతం దెబ్బతిన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు తొలుత ఆదుకోవాల్సింది రైతన్నలనే. నీరు చేరడంతో నానిన పంటలను కొనుగోలు చేయాలి. మునిగిన పంటలకు వెంటనే పరిహారం చెల్లిచాలి. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలి.
అతిభారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో, పాతాళగంగ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్.. అతిభారీ వర్షాలు, బలమైన గాలులతో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్ని ముంచేసింది. ఇటు తెలంగానలో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలను ముంచెత్తింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ భారీవర్షాలతో వాగులు పొంగి ప్రవహించడంతో జనజీవనం అతలాకుతలం అయింది. సముద్రం 20 నుంచి30 మీటర్లు ముందుకొచ్చింది. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు నేలవాలడంతో సరఫరా నలిచిపోయింది. ప్రభుత్వ చర్యలతో చాలాచోట్ల పునరుద్ధరించారు. సాధారణ స్థితికి రావడానికి మరికొంత కాలం పట్టవచ్చు. తీర ప్రాంత మండలాల్లో గాలుల దెబ్బకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోల్కతా-చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచాయి. ముందే ముప్పును గుర్తించి చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నంద్యాల పట్టణం మధ్యలో ప్రవహించే కుందూ నది, మద్దిలేరు, చామ కాలువ కూడా ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. భారీ వృక్షాలు నేలకూలి రహదారులకు అడ్డంగా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
భారీ వర్షాలకు జలాశయంలో పెద్దఎత్తున నీరు చేరడంతో విజయనగరం జిల్లా పరిధిలోని తాటిపూడి రిజర్వాయరు గేట్లు ఎత్తేశారు. ఆ నీటి ఉద్ధృతికి విశాఖ జిల్లా భీమిలి మండలంలోని గోస్తనీ నది పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గత వారం రోజుల పాటు ప్రజలను గజగజలాడించిన మొంథా తుఫాన్ ప్రభావం ఉపశమించడంతో, ప్రమాదం నుండి బయట పడ్డామని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసాయి. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై మొంథా తుఫాన్ పంజా విసిరింది. భారీ వర్షాలతో వరంగల్లో రహదారులు నీట మునిగాయి. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు వాగు ఉధృతంగా పారడంతో 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఇప్పుడు ప్రభుత్వాలు పునరుద్ధరణ చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయాలు పక్కన పెట్టి క్షేత్ర స్థాయిలో నష్టం అంచనాలు వేసి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేయాలి. రోడ్లను మరమ్మత్తులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలి. పంటల నష్టాలను అంచనా వేసి రైతులకు ముందుగా తాత్కాలిక ఉపశమనం కలిగించాలి. ఇళ్లు వాకిళ్లు కొట్టుకుపోయిన వారిని గుర్తించి వారికి నిత్యావసరాలతో పాటు జీవనోపాధి కింది పరిహారం అందించాలి. యుద్ధ ప్రాతిపదికన ఇవి చేపడితే తప్ప ప్రజలు కోలుకోలేరు. ప్రభుత్వాలు వెంటనే ఈ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రం కూడా నివేదికల కోసం ఎదురు చూడకుండా ముందుగా తక్షణ సాయంగా కొంత డబ్బును రాష్ట్రాలకు అందించాలి. అవసరమైతే గ్రామాల వారీగా బాధితులను గుర్తించి అక్కడికక్కడే పరిహారం చెల్లించాలి. గతంలో లాగా నెలల తరబడి వేచి చూసే ధోరణికి స్వస్తి పలకాలి.

