వెనుకటికి అప్పు ముప్పన్నారు. ఇప్పుడు పాలకులు అదే ముద్దంటున్నారు. రాజులపైస రాళ్ళ పాలన్నట్లు.. ప్రజల డబ్బును ప్రజలకే పంచి పెడుతున్నామని, అందులో అప్పైతేమి? ముప్పైతేమి? మధ్య మనకు పవర్ కు పవర్, మిగతా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఫ్రీగా అందుతున్నాయి. ‘దాచుకునే వాడికి దోచుకున్నంత’ అన్నట్లుగా అధికారం కోసం ఏ హామీ అయినా ఇచ్చేసి, అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేసి, అందలం ఎక్కామా? హాపీగా ఉన్నామా? అన్నదే ఫైనల్ అన్నట్లుగా బతికేస్తున్నారు. ఒక్కసారి అవకాశం వస్తే వందేళ్ళకు సరిపడా తరతరాలకు సంపాదిస్తున్నారు మన పాలకులు.
నిజమే, ఏపీ, తెలంగాణలను అప్పుల నరకాసురుడు వేధిస్తున్నాడు. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. మనమంతా కలసికట్టుగా ఈ అప్పుల నరకాసరుడిని అంతమొందించాలి. వీడిని మనకు అంటగడుతున్న రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల నేతలకు తగు బుద్ధి చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో లేనంత అవినీతి, అక్రమాలు, విడిపోయాక విజృంభించాయి. ప్రతి ఏటా దీపావళి వెలుగులు విరజిమ్మాల్సిన చోట, అప్పుల అమావాస్య కమ్ముకుంది. ప్రస్తుత, గత పాలకుల పని తీరు చూస్తుంటే, ఈ రెండు రాష్ట్రాలు అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. అధికారం కోసం అడ్డమైన హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేక అప్పులు చేయడం అలవాటుగా మారింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి పెద్దమనిషుల హెచ్చరికలు కూడా ఎవరికీ పట్టడం లేదు. అలాగని చేసిన అప్పులతో రాష్ట్రాలు బాగుపడ్డాయా? అంటే అదీ లేదు. నెలనెలా జీతాలు ఇవ్వడం కూడా ఇప్పుడు ప్రభుత్వ ప్రతిభకు, పనితీరుకు గీటురాయిగా మారింది. అప్పులు చేయడంలో వెనుకబడకూడదని పాలక పార్టీలూ కంకణం కట్టుకున్నట్లున్నాయి. సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచి పెట్టినంత మాత్రాన ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తున్నారా? అంటే అదీ లేదు!
ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ ప్రజలకు డబ్బు పంచుతున్నాయి. తాజాగా బీహార్ ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు డబ్బు పందేరాలకు రెడీగా ఉన్నారు. ప్రజలు కూడా వచ్చిన కాడికి తీసుకోవాలన్న ధోరణిలో ఉన్నారు. ఈ డబ్బు పంపిణీకి తిలోదకాలివ్వకపోతే, మన ప్రజాస్వామ్యం పటాపంచలయ్యేటట్లు కనిపిస్తున్నది. ఈ పందేరాల దుబారాకు ఫుల్ స్టాప్ పడకపోతే తిప్పలు తప్పేలా లేవు. అలాగే పథకాలు పొందని, పన్నులు చెల్లిస్తున్న వారు ప్రభుత్వాల వైఖరిని నిలదీయక మానరు.
ఏపీ, తెలంగాణల్లో గత పన్నెండేళ్లుగా ఇదే సాగుతోంది. భావి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఎలా అన్నది పక్కకు పోయింది. అప్పులు చేసి పండగ చేస్తున్నారు. చేసుకుంటున్నారు. ప్రజలు కూడా ఓట్ల పండగ రావాలని కోరుకుంటున్నారు. ఎంతకాలమీ అప్పుల జాతర? అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలున్నాయి.
ఎపి విభజన తరవాత కేసీఆర్, జగన్ చేసిన నిర్వాకంతో ఇది మనింత ఎక్కువైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ ఊరూరా ఊదరగొట్టారు. రెవెన్యూ మిగులులో ఉందని ప్రకటించారు. అదే సమయంలో విభజిత ఆంధప్రదేశ్ రూ.20 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటుతో ఏర్పడింది. 11 ఏళ్లు గడిచేసరికి రెండు రాష్ట్రాలూ దివాళా తీసాయి. అప్పు కోసం వెళితే దొంగను చూసినట్టు చూస్తున్నారని ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాన్ని బయటపెట్టారు. చేసిన అప్పులకు వేలకోట్లు వడ్డీలుగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టడమే కాకుండా, భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లే ఈ దుర్భర పరిస్థితి దాపురించింది.
అయినా సరే, ఉచిత బస్సు, ఉచిత బియ్యం, ఉచితంగా వేల రూపాయల బదిలీలు వంటివన్నీ చేస్తున్నారు. రేవంత్ హైదరాబాద్లోని ప్రభుత్వ భూములను కూడా ఎడా పెడా అమ్మేస్తున్నారు. రైతు రుణ మాఫీ కోసం దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పంచిపెట్టిన తీరువల్ల కలిగిన ప్రయోజనం కూడా అంతంత మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమ పథకాల జాతర ఆగడం లేదు. తెలంగాణ పథకాలను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేసేందుకు చంద్రబాబు అపసోపాలు పడుతున్నారు. అందుకే ఈ అవినీతి, అక్రమాల పార్టీలు, ప్రభుత్వాల పని పట్టాల్సిందే. అప్పుల నరకాసురుడిని మనమే కాల్చాలి. ప్రజలే ఇందుకు పూనుకోవాలి. పథకాల పేరుతో చేస్తున్న అప్పులపై ప్రశ్నించాలి. అప్పుడే మనకు నిజమైన దీపావళి అని గుర్తించాలి.

