ప్రపంచం చాలా విశాలమైంది. ఆధునిక సాంకేతికతతో అది అర చేతిలోకి వచ్చేసింది. ఎక్కడ? ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. దాపరికం, చాటుమాటు కొంతకాలమే. దీనికి తగ్గట్లుగా దేశం నుంచి వ్యక్తి వరకు ఎవరికి వారుగా స్వయంగా మనుగడ సాగించలేరు. మనం చేయగలిగింది చేయాలి. కావాల్సింది పొందాలి. అవసరాలతోపాటు స్నేహాలు కూడా అలాగే మారుతూ వస్తున్నాయి. అవి మనుషుల మధ్య కావచ్చు. దేశాల మధ్య కూడా కావచ్చు. అంతకంటే మనుషులు-దేశాల మధ్య సంబంధాలు కూడా సంక్లిష్టంగా మారుతున్నాయి. ఎవరితోనైనా మంచిగా ఉండటమే అవసరం. రాజనీతి, దౌత్యనీతి కూడా అంతే. ఏ ఒక్కరితోనో, ఏ ఒకవైపో ఉండి ఇతరులతో సంబంధాలు వద్దనుకునే రోజులు కావివి. ఇరుగుపొరుగుతో సాధ్యమైనంత వరకు సత్సంబంధాలు నెరపాల్సిందే!
ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ఖాన్ ముత్తఖీ ఇటీవల భారత్ వచ్చారు. ఆ దేశం కూడా సత్సంబంధాలు కోరుకుంటోంది. మనం పాక్తో కూడా స్నేహహస్తం సాచినా అందిపుచ్చుకోలేని దౌర్భాగ్యం ఆ దేశ పాలకులది. పైగా వారు భారత్లో ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న తీరుతో ఇటీవల ఆపరేషన్ సిందూర్ తో గట్టిగానే బుద్ధి చెప్పాం. ఇదిలావుంటే, తాలిబాన్లకు పాక్తో గొడవలు ఉన్నాయి. కానీ మనకు తాలిబన్లతో ఎలాంటి గొడవా లేదు. అందుకే మనతో సంబంధాలను పటిష్టం చేసుకోవాలని, మన సాయం పొందాలని ఆఫ్ఘనిస్తాన్ కోరుకుంటోంది. దీంతో పాక్కు చెక్ పెట్టే అవకాశం వచ్చింది. ఆఫ్ఘాన్తో స్నేహం ప్రయోజనకరమే తప్ప నష్టం లేదని విదేశాంగ నిపుణులు కూడా చెబుతు న్నారు. ఆప్ఘాన్ తో స్నేహాన్ని వ్యూహాత్మక అడుగుగా భావించాలి. అలాగే చైనా, అమెరికాలకు చెక్ పెట్టే అవకాశంగా కూడా తీసుకోవాలి.
నిజానికి ఏ దేశ దౌత్య నీతి అయినా దాని సొంత ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. రష్యాతో చమురు వాణిజ్యంపై అమెరికా కక్ష కట్టినా మనం పెద్దగా పట్టించుకోలేదు. సుంకాలు విధించినా మనం బెదరలేదు. ఇప్పుడు అమెరికాకు మెల్లగా తెలిసి వస్తోంది. భారత్ పవర్ ఏమిటో ట్రంప్ రుచి చూస్తున్నారు. తాలిబాన్లతో చిగురిస్తున్న భారత మైత్రి కూడా అంతే. మనతో స్నేహం కోసం వచ్చిన వారిని కాదనలేం. కానీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు. ఇదే సాకుగా తాలిబాన్లతో జతకట్టడమేంటని కొందరు సంకుచితంగా విమర్శలు చేస్తున్నారు. అఫ్ఘానిస్తాన్లోని తాలిబాన్లకు పాలనానుభవం తక్కువ. మతఛాందసమే ఎక్కువ. అయితే దేశంలో ఇది సాగినా ప్రపంచంలో సాగదు. అందుకే వారు కూడా చెలిమి కోసం పరితపిస్తున్నారు. పాక్తో వైరం కారణంగా భారత్కు చేరువవుతున్నారు.
ఆఫ్ఘానిస్తాన్ తాలిబాన్ల ప్రభుత్వాన్ని రష్యా మినహా భారత్తో సహా ప్రపంచ దేశాలు ఏవీ ఇప్పటి వరకు గుర్తించలేదు. అఫ్ఘానిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ఖాన్ ముత్తఖీని భారత్ స్వాగతించడం మారుతోన్న దౌత్య సమీకరణాలకు సంకేతం. పాక్, అమెరికా, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు తాలిబాన్లను రష్యాకు వ్యతిరేకంగా పెంచి పోషించాయి. ఆఫ్ఘాన్లో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ కలిసికట్టుగా పాక్ సహకారంతో తాలిబాన్లను రూపొందించారు. వీరంతా తిరుగుబాటు చేసి ఆనాటి దేశ అధ్యక్షుడు నజీబుల్లాను పదవీచ్యుతిడిని చేసి ఉరితీసి చంపారు. తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్కు భారత్ అన్ని విధాలుగా సహాయమందించింది. తాలిబాన్ల మొదటి ప్రభుత్వం 1996-2001లో ఆఫ్ఘాన్లో పాక్ కు ఆడింది ఆటగా సాగింది. ఆ తర్వాత
అమెరికా, నాటో దేశాల చేతుల్లో కీలు బొమ్మలు అయిన పాలకులు 2021 వరకు ఆఫ్ఘాన్ను పరిపాలించినా, తాలిబాన్లను నిర్మూలించలేకపోయారు. అమెరికా నిష్కమ్రణ అనంతరం 2021లో ఆప్ఘాన్లో మళ్లీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు, ఈసారి స్వతంత్రంగా బాహ్య ప్రపంచం వైపు చూడడం మొదలుపెట్టారు. పాక్ తో విభేదిస్తూ తమ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించారు. దీనికితోడు వారికి సరిహద్దు సమస్య తీవ్రంగా ఉంది. ఫక్తూన్ ప్రాంతం తమదని వారు బ్రిటిష్ కాలం నుంచే పోరాడుతున్నారు. దాయాది దేశానికి ఊపిరాడకుండా చేస్తోన్న తాలిబాన్లతో భారత్ వ్యూహాత్మక స్నేహం మన దేశ ప్రయోజనాలకు సానుకూలం.
భారత్కు ఈ దౌత్య విజయం డోనాల్డ్ ట్రంప్ చేసిన గాయాల తర్వాత ఒక ఉపశమనంగా చూడాలి. గతంలో తాలిబాన్ల అధినాయకుడు ముల్లా ఉమర్ పాక్ చెప్పుచేతల్లో ఉండేవాడు. ఇప్పుడు అతని కుమారుడు, ప్రస్తుత రక్షణమంత్రి ముల్లా యాకూబ్ మాత్రం భిన్నంగా నడుచుకుంటున్నాడు. అయితే, ఆఫ్ఘాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ముత్తఖీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశం కావడం పాకిస్తాన్ను కలవరపరిచిందనే చెప్పాలి. ఓవైపు అంతర్గత దాడులు, వేర్పాటు వాదుల విజృంభణ వంటి సమస్యలు ఎదుర్కొంటున్న పాక్ ఈ పరిణామం శరాఘాతమే. అమెరికాతో జతకట్టిన సంబంరంలో భారత్కు పక్కలో బల్లెంగా మారాలని కలలు కంటున్న తరుణంలో ఇది ఓ కొత్త తలనొప్పే.
ఇక పహల్గాంలో పాక్ ఉగ్రదాడిని ఆఫ్ఘాన్ నిర్ద్వంద్వంగా ఖండించింది. భారత్ కు వ్యతిరేకంగా అమెరికా పాక్ను దువ్వడం, ఆఫ్ఘాన్ మనకు చేరువ కావడం శుభపరిణామం.

