తమిళనాడులోని కరూర్లో సెప్టెంబర్ 27, 2025న సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభ తీవ్ర విషాదానికి దారి తీసింది. తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం, మృతుల్లో పిల్లలుండటం, అనేక మంది క్షతగాత్రులవడం దేశవ్యా్ప్తంగా సంచలనమైంది. తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే కుంభమేళా, ఢిల్లీ రైల్వేస్టేషన్, గోవా, ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాటలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మన దగ్గరే ఇలాంటి ఘటనలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? నిర్వాహకుల లోపమా? ప్రజల పాపమా? ఇలాంటి ఘటనల అనుభవంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
జనవరి 29న మహాకుంభ మేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. 60 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఫిబ్రవరి 16న ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా 18 మంది చనిపోగా మరో 20 మందికిపైగా గాయపడ్డారు. మే3న గోవా షిర్గావ్ లోని శ్రీ లైరాయ్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7గురు మరణించారు. జూన్ 4, 2025న బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. జూన్ 29న పూరి రథయాత్రలో ముగ్గురు చనిపోయారు. సెప్టెంబర్ 27న కరూర్లో 8 మంది పిల్లలతో సహా 41 మంది తొక్కిసలాటకు బలయ్యారు. సినిమాకు సంబంధించి 2024, డిసెంబర్ 4న పుష్ఫ 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో ఏపీలో చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల సందర్భంగా పదుల సంఖ్యలో చనిపోయారు. మొన్నటి జగన్ ర్యాలీలో ఒకరిద్దరు చనిపోయారు. ప్రమాదాలు జరిగాక నష్టపరిహారాలు, ప్యాకేజీలేవీ తిరిగి వారిని తీసుకరాలేవు.
ఈ ప్రమాదాలకు కారణం ప్రమాదకర రీతిలో జన సాంద్రత ఉండటమే. ఒక చదరపు మీటర్ ప్రదేశంలో సాధారణంగా 5-7 మంది ఉండాల్సిందానికి భిన్నంగా, కుక్కినట్లుగా జనం ఉండటం, ఇసుక రాలనంత ఇరుకు, కాలు మోపలేనంత సందు లేకపోవడం వల్లే తొక్కిసలాటలు జరుగుతున్నాయి. పైగా, ప్యాక్డ్గా ఉన్న జనంపై చిన్న ఒత్తిడి జరిగినా, పేకమేడలా పడిపోతారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకుపోయే యత్నంలో మరికొందరు పడి, మిగతా వాళ్ల కాళ్ల కింద నలిగి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోతారు. ఇదే సినీ, రాజకీయ సభలైతే, తొక్కిసలాట తీవ్రత మరీ ఎక్కువగా ఉంటున్నది.
ఇక నిర్వాహకులు 10వేల మంది వచ్చే అవకాశం ఉంటే, వెయ్యి మందికి ఏర్పాట్లు చుసుకోవడం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా జనం తరలిరావడం కూడా జరుగుతున్నది. ఈ క్రౌడ్ కంట్రోల్ విషయంలో నిర్వహకులు నిర్లక్ష్యంగా, ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. సరైన ఎంట్రీ, ఎగ్జిట్ ప్లానింగ్, కార్యక్రమం జరిగే ప్రదేశంలో లైనింగ్స్, బ్యారికేడ్లు లేకపోవడం తొక్కిసలాటలకు దారితీస్తున్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్ పై సరైన అవగాహన ఉండటం లేదు. వలంటీర్లను నియమించినా, వారేం చేయలేకపోతున్నారు.
ఇదే సమయంలో జనం సభకు నిండుగా వచ్చే వరకు సినీతారలు, లీడర్లు సభా ప్రాంగనానికి రావడం లేదు. గంటల తరబడి ఆలస్యంగా రావడం, వాళ్ళని చూడ్డానికి జనం ఎగపడ్డం వల్ల కూడా తొక్కిసలాటలు జరిగి, విలువైన మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కరూర్లో విజయ్ కూడా దాదాపు 6 గంటలు ఆలస్యంగా వచ్చారు. ఇలాంటప్పుడు ప్రజల్లో అంతకంతకు అసహనం, ఆసక్తి పెరుగిపోతుంది. కుంభమేళా లాంటి ప్రదేశాల్లో సీసీటీవీలు, క్రౌడ్ను సూచించే సెన్సార్లు ఏర్పాటు చేసినా, అవి ఇచ్చిన డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలం అయ్యారు. అనుకోని సంఘటన జరిగితే.. అంబులెన్స్ లు రావడానికి, జనాలు పారిపోవడానికి సరైన మార్గాలు ఉండటం లేదు.
ఇలాంటి తొక్కిసలాటలను సీరియస్గా పరిగణించాలి. అవసరమైతే నిర్వాహకులు పటిష్ట భద్రత చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించాలి. ఆర్సీబీ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ 2025 తీసుకొచ్చింది. రాజకీయ, సినిమా, మతపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు, నిర్వాహకులకు తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి వివరించాలి. అంతర్జాతీయంగా అమలులో ఉన్న భద్రత ప్రమాణాలు పాటించేలా చేయాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాలి. కార్యక్రమం ఏర్పాటు చేసే ప్రదేశానికి అనుగుణంగా జన సమూహానికి అనుమతించాలి. అలాగే ఇండిపెండెంట్ నిపుణులు ధ్రువీకరించిన క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్లను నిర్వాహకులు అధికారులకు ముందే సమర్పించేలా చర్యలు చేపట్టాలి. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళే ప్రజలు కూడా జాగ్రతలు తీసుకోవాలి. వీలైతే ముందుగా లేదా ఆలస్యంగా వెళ్లాలి. ఎవరినీ ముందుకు తోయకూడదు. బయటకు వెళ్లే దారులను బట్టి మసలుకోవాలి. అనూహ్యంగా తొక్కిసలాటలో చిక్కుకుంటే, చేతులు ఛాతిపై పెట్టుకోవాలి. ఒకవేళ కింద పడిపోతే, తల, మెడ కవర్ అయ్యేటట్లు చేతులు అడ్డుపెట్టుకుని ముడుచుకుపోవాలి. వీలైనంత త్వరగా పైకి లేచేందుకు ప్రయత్నించాలి. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలను గుణపాఠాలుగా తీసుకుని, ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలి. మెరుగైన చట్టాలను రూపొందించాలి. ఎక్కువమంది ప్రజలు హాజరయ్యే సభలు, కార్యక్రమాలకు.. సరైన ప్లానింగ్ ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో కరూర్ లాంటి దుర్ఘటనలను నివారించడానికి వీలవుతుంది.

