కొత్త నీరు రావాలి. పాత నీరు పోవాలి. నీరు నిలిస్తే బురదవుతుంది. అలాగే నిత్యం పారుతున్న సెలయేరులా రాజకీయాలుండాలి. ఎప్పటికప్పుడు పాత తరం దిగిపోతూ ఉంటే, కొత్త తరం యువత ముందుకు రావాలి. అప్పుడే సమర్థవంతమైన నాయకత్వం, పాలన అందుబాటులోకి వస్తాయి. ఒకప్పుడు రాజకీయాల్లో యువత ఎక్కువగా ఉండేది. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి కొన్ని దశాబ్దాల వరకు యువతకు అవకాశాలు లభించాయి. కానీ ఇటీవలి కాలంలో రాజకీయాలంటేనే యువత అసహ్యించుకునే పరిస్థితులు దాపురించాయి. రాజకీయాలను రాజకీయ నాయకులు అత్యంత పాపపంకిలం చేసేశారు. దీంతో రాజకీయాలకు అర్థాలు మారిపోయాయి. నిలువెల్లా స్వార్థం, అవినీతి, బంధుప్రీతి, దోపిడీ, దోచుకోవడం, దాచుకోవడమే రాజకీయ నాయకుల పనిగా మారింది.
బలహీనమైన నాయకత్వం వల్ల, నేతల్లో జాతీయ స్థాయిలో నమ్మకాన్ని కలిగించే నాయకత్వం కొరవడింది. వారి దృష్టి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతోంది. ప్రాంతీయ పార్టీలదే ప్రాధాన్యం. ఇవి జాతీయ రాజకీయాల్లో పెద్దగా పాల్గొనకపోవడం వల్ల మనవాళ్లు కేంద్రంలో గళాన్ని వినిపించలేకపోతున్నారు. స్థానికత, ప్రాంతీయత, కులాల ప్రాతిపదికన జరిగే రాజకీయాలు జాతీయ స్థాయిలో ఎదగడానికి అడ్డంకిగా మారుతున్నాయి. యువతకు రాజకీయాల్లో ఆసక్తి లేకుండా పోయింది. రాజకీయాలను చిల్లరగా చూస్తున్నారు. అపవిత్రమైనవిగా భావిస్తున్నారు. దీనివల్ల ప్రతిభావంతులైన యువకులు ఈ రంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం ఓటు వేయడంపై కూడా ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం కల్పిస్తాయి. యువత సమస్యల పట్ల స్పష్టమైన దృష్టితో పట్టుదలగా ఉంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిపాలనలో పారదర్శకత తీసుకురాగలుగుతారు. రాజకీయాల్లో మన ప్రాతినిధ్యం పెరగాలంటే యువత ముందుకు రావాలి. వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలి. కుటుంబ రాజకీయాలకు యువత విముక్తి కలిగించాలి. ప్రస్తుతం రాజకీయాల్లో కుటుంబ, వంశపారంపర్యం పెరిగిపోతోంది. రాష్ట్రాల్లో కంటే, జాతీయ స్థాయిలో అంటే లోక్ సభలోనే వారసత్వ నేతలు ఎక్కువగా ఉన్నారని ఇటీవలి ఓ సర్వే తేల్చింది. ఈ పరిస్థితిని మార్చాలంటే సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాల్లోకి వస్తేనే ప్రస్తుతం పేరుకుపోతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఇందుకు యువతకు రాజకీయ విద్యను అభ్యసించాలి. రాజకీయ చైతన్యం పెంచేందుకు పాఠశాల స్థాయిలోనే “రాజకీయ విద్య”ని ప్రవేశపెట్టాలి. ఇన్టర్న్ షిప్లు, ఫెలోషిప్లు పార్లమెంటులో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకునే అవకాశాలు కల్పించాలి. తగిన ప్రోత్సాహం లభించేలా చూడాలి. నాయకత్వ లక్షణాలున్న యువతకు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలి. అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఉపయోగించి రాజకీయ చైతన్యం పెంచాలి.
ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో దక్షిణాది నేతలదే హవాగా ఉండేది. ఇప్పుడు సర్పంచ్ నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాలపరిమితి విధించుకోవాల్సి ఉంది. దేశం మూస పద్దతిలో నడవడం వల్లనే బంగ్లాదేశ్, నేపాల్లో తిరుగుబాట్లు వచ్చాయి. నేపాల్లో యువతే ముందుకు కదిలింది. రాజకీయ స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలను నిరసించడం ద్వారా దేశాన్ని కదిలించారు. దేశం ఏదైనా పదవీకాంక్షతో చేస్తున్న రాజకీయాల వల్ల ఆ దేశం పురోగమించడం లేదు. మనదేశంలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. వీటిని నిలువరంచాల్సి ఉంది.
గతంలో పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి నేతల మరణం తరవాత అంతగా ప్రభావితం చేయగలిగిన నేతలు రావడం లేదు. వెంకయ్యనాయుడు పదవీ విరమణ తరవాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్వపు ఎన్డిఎలో ఎన్టీఆర్, చంద్రబాబు కన్వీనర్లుగా రాణించారు. ఒకప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, వెంకటస్వామి, సత్యనారాయణరావు, మల్లు అనంతరాములు వంటి ఉద్దండులు జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. తరవాత జైపాల్ రెడ్డి, విద్యాసాగర్ రావు, వెంకయ్యనాయుడు, సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరిలు కనిపించేవారు.
నిజానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొనసాగివుంటే మంచి నేతగా రాణించేవారు. ఆయన కూతురు కవితను జాతీయ రాజీయాల్లో కొనసగించినా ఆమె మంచి పట్టు సాధించేవారు. కవిత మంచి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలలో మాట్లాడగలిగే సత్తా ఉన్న నేత. కేసీఆర్ ఎందుకనో ఆ వైపుగా ఆలోచించినట్లు లేదు. ఇవాళ కవిత ఢిల్లీ రాజకీయాల్లో ఉండివుంటే బిఆర్ఎస్కు ఇప్పుడీ దుర్గతి పట్టివుండేది కాదు.
కేసీఆర్ స్వార్థ, కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టివుంటే, అద్భుతంగా రాణించే వారు. భాషాపటిమ, వాక్చాతుర్యం కూడా అద్భుతంగా ఉన్న నేతగా కేసీఆర్ దేశ ప్రజలకు సుపరిచితం. ఆయన తనకున్న ఇమేజ్ను డ్యామేజీ చేసుకున్నారు. కవిత లిక్కర్ స్కామ్, ఆమె రాజకీయ ప్రస్థానంపై మాయని మచ్చగా మారింది.
మొత్తంగా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తెలుగువారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని పూడ్చాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పిచాలి.

