నేపాల్ లో అంతర్గత సంక్షోభం ఎందుకు వచ్చింది? సోషల్ మీడీయా, మెస్సేజింగ్ యాప్స్ నిషేధం వల్లేనా? మరి నేపాల్ లో పెచ్చరిల్లిన వర్ణ, వర్గ వివక్ష, సామాజిక, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగిత, అధికారస్వామ్యం, అనేక ఉద్యమాలు, రాచరికాన్ని పున:ప్రతిష్టించే చర్యలు, నిరసనలు, మావోల ఉద్యమాలు, ప్రభావాలు ఎందుకున్నట్లు? పౌరులు, ప్రత్యేకించి యువత ఎందుకు ప్రభుత్వాన్నే కూల్చేందుకు తమ ప్రాణాలకు తెగిస్తున్నది?
నేపాల్ ప్రస్తుత అంతర్గత సంక్షోభం కేవలం సోషల్ మీడియాపై నిషేధం వల్లే ఏర్పడిందన్న తప్పుడు భావనలు ప్రపంచానికి చేరడం అంత మంచిది కాదు. సోషల్ మీడియా ప్రభావాన్ని కాదనలేం. ప్రజలు దానికి బానిసలవడం కూడా నిజమే. అందులోనూ అవాంఛిత అంశాలనేకం విశృంఖలంగా పరివ్యాప్తం అవుతున్నాయి. ఇవ్వాళ సోషల్ మీడియాను అదుపుచేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. కనీస నియంత్రణ కూడా వాటికి లేదు. అవి పెచ్చరిల్లినప్పుడు వచ్చే ఉపద్రవాలకు కళ్ళ ముందే కనిపిస్తున్న వాస్తవం నేపాలే.
నేపాల్ ప్రస్తుత సంక్షోభంపై సవివరణలతో సహేతుకంగా ‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ తేల్చి చెప్పిన నేపాల్ సంక్షోభం-కారణాలు-పరిష్కారాలు
నేపాల్ సంక్షోభం-కారణాలు-పరిష్కారాలు
‘ఇక్కడ భూకంపాలు రావాల్సిన పనిలేదు. అంతకుమించి, నేపాల్ నిత్యం అవినీతితో వణికిపోతోంది’ ఇది నేపాల్ తాజా ఉద్యమంలో పాల్గొన్న ఓ విద్యార్థి పట్టుకున్న ప్ల కార్డుపై రాసి ఉన్న వాక్యాలు. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతున్నది. ఆందోళన చేస్తున్న యువత అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నేపాల్లో రాచరికాన్ని పునరుద్ధరించాలన్న కొన్ని నెలల కిందటి ఒక ఉద్యమం జరిగింది. ఆ సమయంలో కూడా నిరసనకారులు వ్యవస్థలో ప్రబలంగా అవినీతి పేరుకపోయిందన్న ఆరోపణలు చేశారు. మరి సోషల్ మీడియాని నిషేధించిన కారణంగానే నేపాల్ సంక్షోభం తలెత్తిందా? అంటే అది ఒక సాకు మాత్రమే. ఆ కారణాన్ని బేస్ గా చేసుకుని అల్లరి చెలరేగింది. అది దావానలంలా వ్యాపించింది. సైన్యానికి సైతం లొంగని రీతిలో విజృంభిస్తోంది.
నేపాల్ లో సెప్టెంబర్ 4న ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ వంటి 26 ప్రముఖ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లను ప్రభుత్వం నిషేధించింది. నిషేధిక ఆజ్ఞలను పాటించడానికి వారం సమయమిచ్చింది. చైనా సోషల్ మీడియా టిక్టాక్ ఈ షరతులను సకాలంలో పాటించడం వల్ల నిషేధించలేదని లేదు. అయితే, నేపాల్ ప్రజలు, ప్రత్యేకించి యువత పెద్ద సంఖ్యలో విదేశాల్లో నివసిస్తున్నారు. మెసేజింగ్ యాప్లు, సోషల్ మీడియాపై నిషేధం వల్ల తమ కుటుంబాలను కాంటాక్ట్ అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యువత నిరసనలకు పిలుపునిచ్చారు. టిక్టాక్ ప్రస్తుతం నేపాల్లో ట్రెండింగ్లో ఉంది. పైగా నిషేధిత జాబితాలో ఎలాగూ లేదు. టిక్టాక్లో అనేక వీడియోలను షేర్ చేసి, నిరసనలో చేరాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేశారు. టిక్టాక్లో ‘నెపో బేబీ’ ట్రెండ్ కూడా ప్రారంభమైంది. ఇందులో రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. వీటితో నేపాల్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టతరమైన జీవితాలను పోలుస్తూ కూడా అనేక వీడియోలు కనిపిస్తున్నాయి.
కాగా, సోమవారం ఉదయం కఠ్మాండూలోని సింహ్ దర్బార్ దగ్గరకు వేలాది మంది నిరసనకారులు చేరుకున్నారు. అక్కడి నుంచి న్యూ బనేశ్వర్లోని పార్లమెంట్ భవనం వైపు ప్రదర్శనగా వెళ్లారు. రాష్ట్రపతి భవన్, శీతల్ నివాస్, నారాయణ్ దర్బార్ మ్యూజియం, ప్రధాన మంత్రి నివాసం పార్లమెంట్ హౌస్ చుట్టూ ఉండే కర్ఫ్యూని, నిషేధాజ్ఞలను లెక్క చేయకుండా, నిరసనకారులు, దూసుకుపోయారు. సైన్యాన్ని వీధుల్లో మోహరించినా పట్టించుకోలేదు. ఘర్షణలు జరిగాయి. మంటలు చెలరేగాయి. సజీవ దహనాలు జరిగాయి. తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసన కారులు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 19 మంది మరణించారు. కనీసం 150 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. అయినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని తెలిసిన తర్వాత కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
‘జెన్ జీ’గా పిలుచుకుంటున్న నిరసనకారులు నేపాల్ పాలనా వ్యవస్థ అవినీతిమయమైందని ఆరోపిస్తున్నారు. జెన్ జీ అంటే, నేపాల్ లో 1990 నుంచి 2010 మధ్య పుట్టిన వారిని ఇంగ్లిష్లో జనరేషన్ జెడ్ గా పరిగణిస్తున్నారు. వీరినే జెన్ జీగా పిలుస్తున్నారు.
అసలు హింసకు కారణాలేంటి? ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి. అభివృద్ధిలో అసమానతలు. యువతకు ఉపాధి అవకాశాలు లేమి. పాలక, అధికార వర్గాలకు చెందిన పిల్లలు అంటే ‘నిపో కిడ్స్’ అత్యున్నతంగా ఉండటం వల్ల అసంతృప్తి పెరిగింది. అధికారిక ఆధిపత్యం వల్ల పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై నియంత్రణ జరిగింది. రాణా ప్రాంతాల మాధేశ్ ఉద్యమాలు, వర్గ, వర్ణ వివక్ష, దళిత హత్య కేసులు వంటి ఘో రమైన సంఘటనలు ప్రజలను పోరాటానికి ప్రేరేపించాయి. 2015లో జరిగిన టికాపూర్ హత్యాకాండ, రుకుం హత్యల కేసులు ఆ ప్రేరేపణలకు ఆజ్యం పోశాయి.
నేపాల్ లో 1996–2006 మధ్య మావోయిస్టు విప్లవం, సామాజిక అన్యాయం, పేదరికం, నిరాశ వంటి అంశాలతో పని చేసింది. ఈ యుద్ధంలో 14వేలకు పైగా మరణించారు. అనేక అత్యాచారాలు జరిగాయి. లక్షల్లో నేపాల్ ని వీడి పోయారు. 2023, 2025లో రాజరికాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు జరిగిన నిరసనలు, ఆందోళనలు, ఈ ఉద్యమానికి ఊపునిచ్చాయి. లింగ వివక్ష, మహిళలపై అత్యాచారాలు వంటి సామాజిక అంశాలు కూడా ఈ ఉద్యమంతో ముడిపడి ఉన్నాయి.
మరి పరిష్కార మార్గాలేంటి? పాలనలో అవినీతిని అంతమొందించాలి. అధికారస్వామ్యాన్ని పూర్తిగా తగ్గించి, ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, సామాజిక అంతరాలను తొలగించే విధానాలను అమలు చేయాలి. ఆందోళనకారుల సమూహాలతో చర్చలు జరిపి తగిన హామీలివ్వాలి. పకడ్బందీగా అమలు చేయాలి. బాధితులకు న్యాయ పరమైన పరిహారాలు అందించాలి. అక్కడ మహిళలపై జరిగిన హింసలకు పరిష్కార మార్గాలు వెతకాలి. హెల్ప్ లైన్లు పెట్టాలి. అన్నింటికంటే ముందు నేపాల్ లో శాంతిని నెలకొల్పాలి. ఇందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.
నేపాల్ ప్రస్తుత అంతర్గత సంక్షోభం కేవలం సోషల్ మీడియాపై నిషేధం వల్లే ఏర్పడిందన్న తప్పుడు భావనలు ప్రపంచానికి చేరడం అంత మంచిది కాదు. అది ఒక సాకు మాత్రమే. సోషల్ మీడియా ప్రభావాన్ని కాదనలేం. ప్రజలు దానికి బానిసలవడం కూడా నిజమే. కానీ సోషల్ మీడియాలో వస్తున్నదంతా అంత మంచిదేం కాదు. అందులోనూ అవాంఛిత అంశాలనేకం విశృంఖలంగా పరివ్యాప్తం అవుతున్నాయి. ఇవ్వాళ సోషల్ మీడియాను అదుపుచేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. కనీస నియంత్రణ కూడా వాటికి లేదు. అవి పెచ్చరిల్లినప్పుడు వచ్చే ఉపద్రవాలకు కళ్ళ ముందే కనిపిస్తున్న వాస్తవం నేపాలే.

