ప్రకృతే మానవాళికి జీవనాధారం. సకల జీవరాసులను పోషించేది ప్రకృతే. కానీ నేడు, అదే ప్రకృతి మనిషిని మటాశ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వర్షాభావాలు, తుపాన్లు, వరదలు భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు, హిమపాతాలు, వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా లక్షలాది మంది మనుషులు, జీవరాసులు బలవుతున్నాయి. తాజాగా క్లౌడ్ బరస్ట్ వచ్చి చేరింది. క్యుములో నింబస్ మేఘాలు ఉరుము ఉరిమినట్లుగా కురియడంతో ఒక్కసారిగా ఒకేచోట కుండపోత వానగా వస్తోంది. దీంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది.
ఉమ్మడి ఏపీలో క్యుములో నింబస్ మేఘాల వల్లనే అప్పటి సీఎం రాజశేర్ రెడ్డితో పాటు, పలువురు నల్లమలలో హెలీక్యాప్టర్ క్రాష్ లో మృత్యువాత పడ్డారు. ఇదంతా ప్రకృతి విధ్వంసం వల్ల జరుగుతున్న విపరిణామం. ఇది నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హానికర వాయువుల ఉద్గారాల వలన గ్రీన్హౌస్ ప్రభావం పెరిగింది. దాంతో భూమి ఉష్ణోగ్రత పెరిగింది. ఫలితంగా మంచు కరగడం, సముద్ర మట్టం పెరగడం, తుఫానుల తీవ్రత పెరగడం వంటి సంఘటనలు సంభవిస్తున్నాయి. పైగా మనం నిత్యం కొండలను, గుట్టలను కొట్టేస్తున్నాం. అడవులను నరికేస్తున్నాం. పారిశ్రామీకరణ, పట్టణీకరణ, నగరాల విస్తరణ, పర్యావరణంపై నిర్లక్ష్యం వెరసే ఈ వైపరీత్యాల విష పరిణామాలు.
ఈ వర్షాకాల సీజన్ లో కాశ్మీర్, ఉత్తరాఖండ్, కేరళ, హిమాచల్, ఏపీ, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ లు జరిగాయి. జమ్మూలో గురువారం మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఫలితంగా మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన వరదలకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గాయాల పాలయ్యారు. చాలామంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్ మాతా దేవి యాత్రను నిలిపివేశారు. ఉత్తరాఖండ్లో ఖీర్గంగా నది మెరుపు వరదతో ధరాలీ పట్టణంపై విరుచుకుపడింది. ఎగువ ప్రాంతాల్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా అనూహ్య వరద ధాటికి ధరాలీ పట్టణం దాదాపు సగం కొట్టుకుపోయింది. కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన బురద తప్ప ఏవీ కనిపించడం లేదు. వరద ధాటికి మూడు నాలుగు అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. యాత్రికుల కోసం నిర్మించిన 20-25 హోటళ్లు, పలు హోం స్టేలు ప్రస్తుతం కనపడటం లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఐదుగురు మరణించారు. ఉత్పాతం సమయంలో పర్యాటకులు, స్థానికులందరూ క్షేమంగా ఉన్నారా అన్న అంశంపై కూడా స్పష్టత రావడం లేదు. సహాయక చర్యలు చేపట్టిన సైనిక బృందాల్లో 10 మంది వరద ధాటికి గల్లంతు కావడం గమనార్హం. ఈ దుర్ఘటన తర్వాత కూడా ఆ ప్రాంతంలో అధిక వర్షపాతం కురిసింది. ఖీర్గంగ ఇలా ఉప్పొంగడం ఇదే మొదటిసారేం కాదు. ఇటీవల కాలంలో 2018లో, 2021లో కూడా ఈ నదికి భారీగా వరదలు వచ్చి, తీవ్ర నష్టం వాటిల్లింది. 1835లో కూడా ఇలాంటి వరద ఈ నదికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటి మాదిరే బురద వరద అప్పుడు కూడా ధరాలీని ముంచెత్తిందని, దాంతో అప్పటి పట్టణం పూర్తిగా ధ్వంసం అయిందని చెబుతున్నారు. ఆ శిధిలాలపైన ప్రస్తుత పట్టణం నిర్మాణమైంది.
అభివృద్ధి పేరుతో పెద్దఎత్తున సాగుతున్న అడవుల విధ్వంసం కూడా ఉత్తరాఖండ్లో కొనసాగుతోంది. ఒక్క గత సంవత్సరంలోనే 998 హెక్టార్ల మేర అడవి తరుక్కుపోయింది. 2021-24 మధ్య దేశంలోని అటవీ ప్రాంతాల్లో 41 శాతం చెట్లను కోల్పోయినట్లు తాజాగా విడుదలైన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. విచ్చలవిడిగా సాగుతున్న ఈ తరహా విధ్వంసం కూడా ప్రకృతి ప్రళయాలకు కారణమౌతోంది. అదే విధంగా ఖీర్గంగా పొడవునా రక్షిత గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు కొన్ని సంవత్స రాలుగా కోరుతున్నారు. అధికార యంత్రాంగం ఈ విషయాలపై దృష్టి సారిస్తే స్థానిక ప్రజలకు కొంత మేర ఊరట లభిస్తుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో, ఏపీలోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంకోవైపు వర్షం నీరు వస్తే పోయే దారులను ఆక్రమించి ఇళ్లు కట్టుకుంటున్నాం. దీంతో చిన్న పాటి వర్షాలకే రోడ్ల నదుల్లా, లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారుతున్నాయి. ఇక ఆకస్మిక వరదలు వస్తే ఎలా ఉంటుందో నిన్న మొన్న హైదరాబాద్ లో చూశాం. వరంగల్లోనూ మరోమారు వర్షం బీభత్సం సృష్టించింది. ఖమ్మంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. చెరువులను మాయం చేసిన పాపానికే హైదరాబాద్ ఓ పెద్ద చెరువైంది.
హైదరాబాద్లో పురానాఫూల్ శ్మశాన వాటిక మునిగి పోయింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాంతాలు మళ్లీ వరద ముంపులకు గురవుతున్నాయి. వివిధ జిల్లాల్లో చిన్నా పెద్దా జలపాతాలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న వరదలు, వానలు సకాలంలో కురవక పోవడం, క్లౌడ్ బరస్ట్ లు అన్నీ కూడా ప్రకృతి విధ్వంసం కారణంగానే. వాటినుంచి మనం గుణపాఠం నేర్చుకోవడం లేదు. అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదు. పర్యావరణంపై ప్రజల్లాగే పాలకులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రజల్లో కూడా చైతన్యం రావడం లేదు. పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు. అప్పటిదాకా ఇలాంటి విధ్వంసాలను భరించాల్సిందేనా? బలవ్వాల్సిందేనా? అందరమూ ఆలోచించుకోవాలి.
ఈ భూమి మన వారసత్వం కాదు, మన భవిష్యత్ తరాలకు అప్పగింత. దాన్ని పరిరక్షించడం మన బాధ్యత. ప్రకృతితో పోరాడటం కాకుండా, దానితో సహజీవనం చేసుకోవాలన్న తత్త్వాన్ని అవలంబించాల్సిన సమయం ఇది.

