|NARENDRAMODI|OPERATION SINDHOOR|
‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్తాన్ బెంబేలెత్తింది. ఎంతగానో బెదిరిపోయింది. కాల్పుల విరమణకు ప్రపంచం చుట్టూతా తిరిగింది. చివరకు అమెరికా కాళ్ళు పట్టుకుంది. యుద్ధతంత్రమో, రాజకీయ కుతంత్రమో కానీ, కాల్పుల విరమణ అనివార్యమైంది. ఫలితంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, యుద్ధభూమిలో దాయదిపై పూర్తిగా పై చేయి సాధించిన భారత్, మరోమారు అది వికృత చేష్టలకు పాల్పడకుండా ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుంది? అనేది ప్రధాన ప్రశ్న. ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్ని భయపెట్టగలిగాం. కానీ, అది ఎంతో కాలం నిలవలేదనేది మరో ప్రశ్న.
ఒకవైపు కాల్పుల విరమణ మరుక్షణమే మరోవైపు ఎప్పటిలాగే ఎల్ఓసీ వద్ద పాక్ దుశ్చర్యలు. పైగా ‘నేనే యుద్ధాన్ని ఆపా?’ అంటూ అమెరికా అధ్యక్షుడు ‘ట్రంప’రితనపు మాటలు మోడీని మరింత ఇరుకున పెట్టాయి. ఇంతలోనే ‘మాదే విజయమ’ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. పాక్ సైనికులు మిఠాయిలు పంచుకొంటూ సంబురాలు చేసుకొన్న వీడియోలు వైరల్గా మారాయి. దీంతో మోడీ ప్రభుత్వంపై విమర్శల తీవ్రత మరింత పెరిగింది. ఇంతలోనే ‘కాల్పుల విరమణ’ నిర్ణయాన్ని పక్కనబెట్టి సరిహద్దుల్లో పాక్ మళ్లీ డ్రోన్ల దాడులతో కవ్వింపులకు పాల్పడుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈలోగా ఉగ్ర ప్రతిదాడుల్లో హతమైన ప్రతి ఒక్కరికి రూ.కోటి చొప్పున పాక్ ప్రధాని ప్రకటించారు. ఇంత దారుణ మారణకాండ జరుగుతుండగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ నుంచి తెచ్చిన అప్పుల ప్యాకేజీలోంచి ఉగ్రవాదుల కుటుంబాలకు అంత పెద్ద మొత్తం ప్రకటించడం భారత్ ని కవ్వించడం, మోసం చేయడం, నయవంచన కాక మరేమిటి? అలాగే ఆ దాడుల్లో భవహల్ పూర్ ఉగ్ర శిబిరంలో హతమైన మరో 14 మందికి కూడా పరిహారం ప్రకటించింది. ఆ హతుల్లో మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టు, భారత్ లో జరిగిన ఉగ్ర చర్యలన్నింటికీ మూలం జైష్ ఎ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది, మరో నలుగురు కూడా ఉన్నారు. వారికి అందాల్సిన ఆ మొత్తం రూ. 14 కోట్లను మసూద్ అజార్ కే ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించడం, వారి అంత్యక్రియల్లో పాక్ సైన్యం, పోలీసులు పాల్గొనడం వంటి చర్యలు మరింత కవ్వింపుగా ఉన్నాయి. ఇలా ఇచ్చే ప్రతి పైసా, తిరిగి పాక్ లో ఉగ్రవాదుల పెంపునకు దోహదం చేయడమేగాక, ఉగ్రవాదులకు బలం చేకూర్చి, తిరిగి అది భారత్ పై ప్రయోగానికి దారి తీస్తుందన్నది నిస్సందేహం.
1971 యుద్ధంలోనే అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని కాంగ్రెస్ ను, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని విమర్శిస్తున్న కమలనాథులు, ఇప్పుడు మోడీ చేసిందానికి ఏం సమాధానం చెబుతారు? ఏ విధంగా సమర్ధించుకుంటారు? అందుకే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇప్పుడు మోడీని, బీజేపీని వేలెత్తి చూపిస్తున్నాయి. ఏ ఒత్తిడులకు తలొగ్గి కాల్పుల విరమణకు ఒప్పుకున్నారో ప్రధాని మోడీ ప్రజలకు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం రాజకీయ రాజీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలంత ఈజీగా ఈ విమర్శలను తిప్పికొట్టడం కష్టం. అయితే ఈ నిర్ణయం మోడీ దీర్ఘకాల వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుందని అంటున్నారు. కానీ, ఈ వ్యూహాన్ని ఏవిధంగా భారత ప్రజలను నమ్మిస్తారు. ప్రతి పక్షాలను ఒప్పిస్తారు? విచిత్రంగా విమర్శకులే కాదు మోడీని సమర్ధించేవారు కూడా మోడీ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్కు ఎదురు దెబ్బగానే చూస్తున్నారు. ఏదేమైనా, ‘ఆపరేషన్ సిందూర్’ తో ప్రధాని మోడీ ఇమేజ్ ఒక్కసారిగా పైకెళ్లి, ఆ తర్వాత ఆయన భక్తులు కూడా ఉస్సూరుమనే దీనస్థితికి దిగజారింది. రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, రక్షణరంగ నిపుణులు, కళాకారులు, జర్నలిస్టులు.. అంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఆత్మరక్షణలో పడిన మోడీ తన ఇమేజీ డ్యామేజీ కంట్రోల్కు దిగినట్టు కనిపిస్తోంది. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించడం, ఆ మరుసటి రోజే పంజాబ్లోని అధంపూర్ ఎయిర్బేస్ను సందర్శించడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘కాల్పుల విరమణ’పై ఆగ్రహంతో ఉన్న వారిని తన ప్రసంగంతో తన దారికి తెచ్చుకోవాలని మోడీ ఎంతో ప్రయత్నించారు. భావోద్వేగపూరిత సంభాషణలు జోడించారు. అయితే, మోడీ తన ప్రసంగంలో ‘కాల్పుల విరమణ’ నిర్ణయానికి గల కారణాలను మాత్రం కనీసం ఉటంకించలేకపోయారు. ‘ట్రంప్ వాణిజ్య బెదిరింపుల వ్యాఖ్యల’పై కూడా ఆయన స్పందించలేదు. దీంతో మోడీ వైఖరిపై అందరూ మండిపడ్డారు.మోడీ ప్రసంగం నిస్తేజంగా సాగిందని ధ్వజమెత్తారు. ‘జాతినుద్దేశించి మాట్లాడటం పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదని, బాధ్యతల నుంచి ప్రధాని తప్పించుకోలేర’ ని ప్రముఖ జర్నలిస్ట్ రాజు పార్లేకర్ వంటి వారు బహిరంగంగానే విమర్శించారు. అమెరికాతో చర్చల్లో వాణిజ్యం ప్రస్తావనే రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఓ మొక్కుబడి ప్రకటనను ఆ తర్వాత విడుదల చేశాయి. దీంతో నెటిజన్లు మరింతగా మండిపడ్డారు.
మొత్తంగా తన ప్రసంగం కూడా ప్రభావం చూపలేదని గ్రహించిన మోడీ మంగళవారం పంజాబ్లోని అధంపూర్ ఎయిర్బేస్ను సందర్శించి జవాన్లతో ముచ్చటించారు. పనిలోపనిగా సైనికుల్లో ధైర్యాన్ని నింపేలా మాట్లాడారు. ‘భారత ఆడపడుచుల సిందూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశామం’టూ మాట్లాడారు. భారత్ను, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకొంటామన్నారు. ఈ సందర్శన కూడా బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. జవాన్లతో మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘పహల్గాం మహిళల సిందూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులను, వారిని ఎగదోసిన పాక్ను విడిచిపెట్టడమేనా మీరు చెప్తున్న ఆ పెద్ద నిర్ణయం’ అంటూ నెటిజన్లు మోడీ వీడియోను ట్యాగ్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. యుద్ధానికి ముందు లేదా యుద్ధం జరుగుతున్నప్పుడు నాయకుడు సైన్యంలో ధైర్యాన్ని నూరిపోయడం చూశాంగానీ, యుద్ధం పూర్తయ్యాక వెళ్లడమేంటని మోడీని ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. విచిత్రమేంటంటే, లైవ్ స్టీమ్రింగ్, యూట్యూబ్, ఎఫ్బీ, ఎక్స్ లైవ్ వీడియోల్లో మోడీ ప్రసంగాలకు వ్యూయర్షిప్ భారీగా తగ్గింది.
మొత్తంగా ’కాల్పుల విరమణ’ ప్రకటన, దాని తదనంతర పరిణామాలపై ప్రధాని మోడీ ఆత్మరక్షణలో పడి ఇమేజ్ మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయని చెప్తున్నారు. రాబోవు రోజులలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

