41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..
ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 41 దేశాలపై కఠినమైన ప్రయాణ ఆంక్షలను విధించేందుకు ఆయన ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదిత నిషేధంపై ఆయా వర్గాల సమాచారం ప్రకారం 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ నిషేధించనున్నట్లు తెలిసింది. వీటిని మూడు విభిన్న సమూహాలుగా విభజించి, ఆయా దేశాలపై ప్రయాణ పరిమితులను విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మొదటి సమూహం – పూర్తి వీసా నిషేధం
ఈ గ్రూపులోని దేశాల పౌరులకు అమెరికా వీసాలపై పూర్తిగా నిషేధం విధించే అవకాశం ఉంది. ఇందులో ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా వంటి 10 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఎవరికీ వీసా ఇవ్వకుండా పూర్తిగా నిరాకరించే యోచనలో అమెరికా ఉన్నట్లు సమాచారం.
రెండో సమూహం – పాక్షిక నిషేధం
ఈ విభాగంలో ఎరిత్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ వంటి 5 దేశాలు ఉన్నాయి. ఈ దేశ పౌరులు పర్యాటక, విద్యార్థి వీసాల కోసం అప్లై చేసుకుంటారు. కానీ ఇతర వీసాల పరంగా మాత్రం కఠిన ఆంక్షలు ఎదుర్కొవచ్చు.
మూడో గ్రూప్- 60 రోజుల గడువు
ఇందులో పాకిస్తాన్, భూటాన్, మయన్మార్ సహా మొత్తం 26 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తమ భద్రతా తనిఖీలను మెరుగుపరిచేందుకు 60 రోజుల గడువు పొందుతాయి. ఈ సమయంలో అవసరమైన మార్పులు చేయకపోతే, ఆ పౌరులకు వీసాల జారీని పాక్షికంగా నిలిపివేసే ఛాన్సుంది.
ఈ దేశాలపై ఎక్కువ ప్రభావం..
ఈ కొత్త నిషేధం వల్ల ఆయా దేశాల ప్రజలు అమెరికాకు ప్రయాణించడం మరింత కఠినతరం కానుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపార వేత్తలు, కుటుంబ సభ్యులు ఈ ఆంక్షల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. అయితే ప్రధానంగా ముస్లిం మెజారిటీ ఉన్న కొన్ని దేశాలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ ఇదే తరహా నిషేధాలు
2017లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించారు. అయితే, ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, 2018లో సుప్రీంకోర్టు దీనిని సమర్థించింది. ఇప్పుడు అదే దారిలో మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మరోసారి ట్రంప్ తన వలస వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారు.
ఈ నిషేధం ఎందుకు..
అమెరికా జాతీయ భద్రతను కాపాడడమే లక్ష్యంగా ఆయా దేశాలపై ఈ నిషేధం విధించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో గాజా, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల ప్రజలను యూఎస్ ప్రవేశించేలా చేయకూడదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. 2023 అక్టోబర్లో జరిగిన ఓ ప్రసంగంలో ఆయన తాను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే వలస నియంత్రణ మరింత కఠినతరం చేస్తానని చెప్పడం విశేషం.

