ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా విజయం సాధిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. “నేను దేవుణ్ణి నమ్ముతాను, ఆయన మా వైపు ఉన్నారు. 2025 నాటికి మాస్కో విజయాన్ని సాధించగలదు” అని పుతిన్ అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, నివేదికలు కూడా రష్యా విజయం సాధించే సూచనలను ఇస్తున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించడానికి, నాటో సభ్యత్వం కల్పించే అంశాన్ని ఆలస్యం చేయాలని అమెరికా సూచిస్తుందని ఒక విలేకరి ప్రశ్నించడంతో పుతిన్ పై విధంగా స్పందించారు. “2021లోనూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇదే ప్రతిపాదన చేశారు. ఆ ఒప్పందం మాస్కోకు ఆమోదయోగ్యం కాదని మేము స్పష్టం చేసాము” అని పుతిన్ తెలిపారు. అదేవిధంగా, రష్యా ఆర్థిక లక్ష్యాలు సాధించడమే కాకుండా సామాజిక, సైనిక భద్రతా సమస్యలను కూడా పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా, కీవ్ శాంతి చర్చలను నిర్వహించాలన్న స్లొవేకియా ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని పుతిన్ వెల్లడించారు. 2022 ప్రారంభం నుంచి రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూ, దీని ముగింపును అందించేందుకు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు.

